విష్ణు సహస్రనామము  

యుధిష్ఠిరుని ప్రశ్నలు - భీష్మాచార్యుని సమాధానములు

https://ajaraamarasukthi.blogspot.com/2025/08/blog-post.html

ఇది నాపాలి భగీరథ ప్రయత్నము. భగీరథుడు గంగను భూమిపైకి తెచ్చి తన పూర్వులకు స్వర్గప్రాప్తి కలిగించ గలిగినాడు. మరి నేను నా ప్రయత్నమును ఎంతవరకూ సఫలము చేసి ,'విష్ణు సహస్రనామము' యొక్క జద్గురువు శంకరుల వారి భాష్య సహకారముతో పూర్తిచేసి మీ ముందు ఉంచగలనో లేదో తెలియదు. ఏది ఎట్లయినా విత్తనమే వేయకుండా చెట్టు ఫలాలను పదిమందికీ పంచాదలచుట మూర్ఖత్వమౌతుంది. అందుకే రోజు ఉపోద్ఘాతముతో శుభారంభామును చేయుచున్నాను. సాధ్యమైనంత వరకూ ప్రతి శనివారమూ మీమున్డుంచే ప్రయత్నమూ చేస్తాను.

కార్యమును నేను యుధిష్ఠిరుని ప్రశ్నలు భీష్మ పితామహుని జవాబులతో ప్రారంభించుతాను.ఈపని పూర్తియగుతకే కొన్ని వారాలు పడుతుంది. విఘ్న వినాశకునికి నమస్కరించి ప్రారంభించుచున్నాను.

యుధిష్ఠిర ఉవాచ

కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం |

స్తువంత: కం కం అర్చంత: ప్రాప్ను యుర్మానవా శుభం ||

 

కోధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మత: |

కిం జపన్యుచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ ||

తాత్పర్యం : (శంకర సంస్కృత భాష్యమును సులభ గ్రాహ్యముగా చేసి మీ ముందు ఉంచుచున్నాను.)

1. కీమేకం దైవతం లొకే  అనగా ఈ లోకములో ఒకేఒక దేవుడు ఎవరు? ఇంకా చెప్పవలసి వస్తే సకల వేద శాస్త్రాలలో ఏ  పరమాత్మను గూర్చి చెప్పబడినది? 2. కిం వాప్యే కం పరాయణం, ఈ సకల వేదశాస్త్ర జ్ఞానసారములో పరం+అయనం చెరదగిన పరం అనగా అత్యుత్తమమైన స్థానము, కిం అనగా ఏది? అనగా ఎవరిని ఆశ్రయించితే ఏవిధమైన భయము బాధ ఉండదో అది (అన్వయము) . అనగా ఆ పరబ్రహ్మాను గూర్చి ఎవరైతే తెలుసుకొంటాడో స్వతహాగా అతనే పరబ్రహ్మమే అవుతాడు. 3.స్తువంతః  కం ప్రాప్నియుః మానవాః శుభం అనగా ఎవరిని స్తోత్రము చేస్తే మానవులు శుభమును పొందుతారు?  4.  కం అర్చంతః    ప్రాప్న్యుః మానవాః  శుభం  అనగా ఎవరిని మనసా వాచా కర్మణః అర్చించుటచేత మానవులు శుభమును పొందగలుగుతారు? 5.కో ధర్మః సర్వ ధర్మాణాం అనగా మొత్తము అన్నీ ధర్మములలో అత్యుత్తమము అత్యున్నతము అయిన ధర్మము 'భవతః పరమవమాతః' అనగా మీ దృష్టిలో అత్యనా ఉత్కృష్ట మయినది ఏది?    6. కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్' అనగా ఏది జపించుటకు యోగ్యమైనదో దానిని సకల ప్రాణులు జన్మ సంసార బంధములనుంది విముక్తి పొందగలరు?.

 

భీష్ముడు ఆరింటికీ సమాధానము చెబుతాడు కానీ ధర్మజుడు అడిగిన క్రమములో కాదు. ఒకపరి పరిశీలించుదాము .  ఆయన మొదట

6వ ప్రశ్న కు సమాధానమును ఇస్తూ ఉన్నాడు.

జవాబు: జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమమ్ ll

స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోథ్థితఃll

జగత్ ప్రభువు, దేవదేవుడు, అనంతుడు పురుషోత్తముడు యగు శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి పేర్లను స్మరించువాడు కలకాలమూ వృద్ధి లోనికి వస్తాడు.

భీష్మ ఉవాచ, బీష్ముడు అన్నమాటకు భగవత్పాదులు ఈ విధముగా నిర్వచించుచున్నారు. సర్వేషాం బహిః అంతః శత్రూణాం భయ హేతుః , అంటే కామ క్రోధ మద మోహ లోభ  మాత్సర్యములగు అంతఃశత్రువులను జయించినవాడును బాహ్య శత్రువులు వారెవరైననూ సరే వారికి భీతి గొల్పువాడు కావున ఆయన    భీష్ముడు.

మరి భీష్మ ఉవాచ  అని ఉన్నది కదా! ఉవాచ అంటే బోధించుచున్నాడు అని కదా అర్థము. మరి ప్రవక్తకు మాత్రమే కదా అందుకు అర్హత ఉండేది. ఆయన మోక్ష ధర్మము మొదలగు అన్నిటినీ తెలిసినవాడు కావుననే ఆయన  ప్రవక్త. జంగమ స్థావరాత్మకమైనది జగము.దానికి ఆయన ప్రభువు. అంటే ఆయన ప్రభుతకు లోబడని జీవాజీవ పదార్థమే లేదు. అసలాయన సమస్త విశ్వమునకే ప్రభువు. బ్రహ్మ విష్ణు మహేశ్వరేంద్రాదులకు  అతీతమైనవాడు దేవదేవుడు. ఇక అనంతుడు అంటే

దేశతః కాలతః వస్తుతశ్చ అపరిచ్ఛిన్నం. అంటే, దేశతః  అపరిచ్ఛిన్నం, అది  ఎంత పెద్ద పొడవెడల్పు వైశాల్యము కలిగిన  ప్రాంతామయినా కూడా అది పరిచ్ఛిన్నమే! అట్టి పరిచ్ఛిన్నమే లేనియెడల అది అపరిచ్ఛిన్నమౌతుంది (అపరిచ్ఛిన్నం=De-limitation). కాలము విషయములో కూడా అది ఆవిచ్ఛిన్నమే! ఆదేవిధముగా కాలానికి ఆయన అపరి చ్ఛి న్నుడే! అదేవిధముగా

బ్రహ్మణ్యం సర్వ ధర్మజ్ఞం:

బ్రహ్మణ్యం సర్వ ధర్మజ్ఞం లోకానాం కీర్తి వర్ధనం ।

లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం॥ 13

 బ్రహ్మణ్యం:బ్రహ్మణే హితం బ్రహ్మణ్యం, స్రష్ట్వే

 బ్రహ్మణే హితం అనగా సృష్టికర్త యగు బ్రహ్మను కాపాడవలసిన బాధ్యత కూడా విష్ణువుదే! కారణము ఆయన సృష్టిభర్త కూడా కదా!బ్రాహ్మణాయ హితం అని కూడా అన్వయిన్చుకోవచ్చును. అంటే చతుర్వేద పారీణత గల్గి పురాణ శాస్త్ర ఉపనిషదాది సకల ధార్మిక వాఙ్మయమును ధరించిన బ్రాహ్మణ రక్షకుడు అని మరొక అన్వయము. తపస్సు చేయువారలను అనగా తాపసులను రక్షించువాడు, శృతయే అనగా వేదపరిరక్షకుడు,

మిగిలినది మరోమారు.......


 

విష్ణు సహస్రనామము-2వ భాగము

యుధిష్ఠిరుని ప్రశ్నలు - భీష్మాచార్యుని సమాధానములు

 

వేదపఠనానురక్తులకు రక్షకుడు, ఇన్ని అర్థములున్నవి బ్రహ్మణ్యం అన్నపదానికి. ఇంతటి వ్యాఖ్యానము చేయగల ఏకైక వ్యక్తి శంకరులు మాత్రమే!ఇక సర్వ ధర్మజ్ఞం అంటే సర్వాన్ ధర్మాన్ జానాతి - సర్వధర్మజ్ఞః అనగా ఆయనకు తెలియని ధర్మమే లేదు. ఈ విషయమై భవద్గీత వ్యాఖ్యానము వ్రాయుసమయమున ఉపోద్ఘాతములో కొంత విస్తారముగా చెబుతారు శంకరులవారు. ధర్మము అన్న ఒక మార్గమును సృష్టించించిన పరమాత్మ దానిని రెండుగా విభజించినాడు. 1. ప్రవృత్తి ధర్మము 2. నివృత్తి ధర్మము. సనకాది నారడాది మహర్షులకు భగవంతుని హృదయము నందు ఉంచుకొని రమించుట తప్ప అన్య చింతన లేనివారు. మరీచ్యాది మహార్షులు ప్రవృత్తి ధర్మమును పాటించిన వారు.ప్రవృత్తి అంటే కర్మ భక్తి సమాధులు.నివృత్తి అంటే కేవలం జ్ఞానం.

వేదాంత విజ్ఞాన రంగంలో భగవద్గీత కున్న ప్రచారం మరి దేనికీ లేదు. అన్నీ తెలిసిన పండితుల దగ్గరి నుంచీ ఏమీ తెలియని పామరుల దాకా దాని నభిమానించే వారే, ఆబాల గోపాల మందరికీ అది శిరోధార్యమే. మహాభారతంలో ఇది గాక ఇంకా ఎన్నో ఉన్నాయి గీతలు. హంస గీత- బుభు గీత-బ్రాహ్మణ గీత- అనుగీత- ఒకటేమిటి- చాలా ఉన్నాయి. వాటికి తోడు సనత్సుజాతీయ మోక్ష ధర్మాల లాంటి ఘట్టాలు కూడా ఏమంత తక్కువవి కావు. అయినా దీనికి వచ్చిన ప్రఖ్యాతి వాటికి రాలేదు.

ఏమి కారణం. సకల వేదార్ధ సార సంగ్రహ మది. వేదంలో చెప్పిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు రెండూ చోటు చేసుకొన్నాయందులో. ప్రవృత్తి అంటే కర్మ భక్తి సమాధులు. నివృత్తి అంటే కేవలం జ్ఞానం. భగవద్గీతలో నాలుగూ కనిపిస్తాయి మనకు. అంతవరకేగాదు _నాలుగింటినీ _సమన్వయించటంలో ఉంది దాని గొప్పతనం. అది ఎలా గని అడగవచ్చు. పేరుకు పద్దెనిమిది అధ్యాయాలని విభజించినా అన్ని అధ్యాయాలలో చెప్పిందీ నాలుగే యోగాలు. ఈ నాలుగూ మరలా రెండే. “లోకేస్మిన్‌ద్వివిధా నిష్టా పురా ప్రోక్తామయార్జున” అని స్వయంగా చెప్పుకొన్నాడు కృష్ణ భగవానుడు. ఈ లోకానికి  రెండే రెండు యోగాలు బోధించాడటతాను. అవి ఒకటి జ్ఞానం. _ మరొకటి యోగం. యోగ మంటే కర్మ అని అర్ధం. అప్పటికి జ్ఞానము- ఆ - కర్మా - ఇవి రెండే భగవాను డుపదేశించింది. ఇవి రెండూ కూడా ఇంకా కొంత లోతుకు దిగి చూస్తే మరలా ఒక్కటే: దీనికి కూడా భగవానుడి ఆమోద ముద్ర ఉంది. ఏకమ్ సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి. జ్ఞాన కర్మలూ రెండూ నిజాని కొక్కటే - అవి రెండూ ఒక్కటేనని గ్రహించిన వాడే ధన్యుడని చాటుతాడు. ఇలాంటి సమన్వయం భగవద్గీతలో తప్ప మరెక్కడా కనిపించదు మనకు.

అంతే కాదు. ఇలాంటి సమన్వయ జ్ఞానంతోపాటు విజ్ఞానాన్ని కూడా ప్రసాదించటం గీతలోని మరొక విశిష్టత. జ్ఞానం వేరు. విజ్ఞానం వేరు. విజ్ఞానమంటే శాస్త్ర జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోటం.. “జ్ఞానం తేహమ్‌సవిజ్ఞానమ్‌- జ్ఞానవిజ్ఞాన నహితమ్‌” అని అక్కడక్కడా భగవానుడు సెలవిచ్చిన మాటలలో అంతరార్థ మిదే. ప్రస్థానత్రయంలో అసలు నిదిధ్యాసనకు ప్రాధాన్యమిచ్చేది భగవద్గీత. నిదిధ్యాసనమంటే అనుభవమే. అనుభవమనేది ఎప్పుడూ ప్రత్యక్షమేగాని పరోక్షం గాదు. మిగతా ప్రాపంచిక పదార్థాల లాగా బ్రహ్మభావం కూడా మానవుడికి ప్రత్యక్షంగానే అనుభవానికి వస్తుందనీ - అది సాధించే మార్గం కూడా అతి సులభమనీ - చాటించే ధైర్య మొక్కగీతకే చెల్లు, ప్రత్యక్షావ గమమ్ ధర్మమ్ - సుసుఖమ్‌కర్తు మవ్యయమ్‌” అని గీత ఇచ్చిన హామీ. ఇదే తదుపదేశ లక్ష్యం కూడా.

అయితే ఇది ఇంత బహిరంగ సత్యమై - అందుకొనుట ఇంత సులభమైతే ప్రతివారి అనుభవానికీ రావాలిగదా - ఎందుకు రావటంలేదని ప్రశ్న వస్తుంది. దానికి కారణం మానవ మనోదర్చణానికి పట్టిన మాలిన్యమే. కాబట్టి దానిని శుద్ది చేసుకోటానికి మొదట కర్మయోగమూ - శుద్ది అయిన తరువాత ఏకాగ్రత కోసం సమాధియోగమూ- ఆ తరువాత ఒక ఆలంబన కోసంగా భక్తియోగమూ - అలవరచుకోవాలనీ - ఆ పిమ్మట వా వాటన్నిటి ఫలితంగా ఆత్మజ్ఞాన ముదయిస్తే - అది చివరకు విజ్ఞానరూపమైన అనుభవంగా మారుతుందనీ - ఒక చక్కని భూమికాక్రమాన్ని నిర్దేశిస్తుంది గీత! దీనితో పరస్పరం విరుద్ధంగా కనిపించే సాధన మార్గాలన్నీ ఏకరూపంగా మారి అంతా బ్రహ్మాత్మానుభవంలో పర్యవసానం చెందుతాయి. దీనిస బట్టి లోకంలో ఎవరి అంతస్తుకు తగినట్టు వారు తమ కనువైన మార్గాన్ని అనుసరిస్తూ పోవచ్చు. ఒక్కసారిగా అందరూ జ్ఞానాన్ని అందుకోలేరు. మానవులలో ఉత్తములుంటారు, మధ్యములుంటారు. మందు లుంటారు. అతి మందు లుంటారు. అందరినీ దృష్టిలో పెట్టుకొనే గీత అందరికీ అన్ని మార్గాలు బోధించిందీ. అవే కర్మ భక్తి సమాధి యోగాలు. భగవానుడే అంటాడొకచోట, యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్l

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ।। 4-11 ।।

మిగిలినది మరోమారు..............

Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి