గౌతమ మహర్షి - అహల్యాదేవి
గౌతమ మహర్షి - అహల్యాదేవి
https://ajaraamarasukthi.blogspot.com/2025/03/blog-post_24.html
దండకమండలంబులును ధ్యానము తప్ప
మరేమి కోరకన్
నిండగు లోక శోభనము నిష్ఠుర నీమ
నిబంధనావళిన్
మెండుగ గోరు నట్టి ముని మూకలు నేడెటు
బోయినారొ ఆ
నిండు తపోనిధానమును నిర్మల మానసినౌచు మ్రొక్కెదనన్
గౌతమ మౌనికిన్ మరియు కల్పనకందని
సుందరాంగియౌ
మాత అహల్యకున్ మరి కుమారిత అంజని దేవికిన్ మరిన్
తాతగు బ్రహ్మ పేరుతన తండ్రి
దయన్ గల పుత్రుకున్ స్వజా
మాత ఉదంకుడై దనరు మాన్యుని వర్గుకు
అంజలించెదన్
గౌతముడు బ్రహ్మమానస పుత్రుడు. అంటే
బ్రహ్మ యొక్క సంకల్పబలము చేతనే పుట్టినవాడు. ‘గౌ’ శబ్దమునకు వేదము లేక వేదములు
అనికూడా ఒక అర్థము. అంటే గౌతముడు అత్యుత్కృష్ట వేదనిధి అని మనము
అన్వయించుకొనవచ్చును. లోకోపకారియై, సహన సద్భావనల ప్రతీకయై సాగునీరు, తాగునీరునివ్వగల గంగాసమానమగు నదీ జన్మకు కర్తయై లోకకళ్యాణ
కర్తగా భాసిల్లు ఒక మహర్షి కావలెనని సంకల్పించి గౌతముని జన్మకారకుడైనాడు
బ్రహ్మదేవుడు.
జన్మించిన పది సంవత్సరములకే
తపససాధనకు వెడలినాడు గౌతముడు.
క్షీరసాగర మథన కాలములో ఉద్భవించిన
జీవ నిర్జీవ వపదార్థముల తోడుగా అప్సరసలు కూడా జన్మించినారు. దేవదైత్యాది సకల గణములు
వారిని, వారి సౌందర్యమును పొగడే వారే! ఆ
ప్రశంసలను భరించలేక బ్రహ్మదేవుడు అందమే ఆమె అన్నవిధముగా ఆహల్యను సృష్టించినాడు.
కాలక్రమములో ఆమె యుక్త వేయస్కురాలైనది. ఇపుడు ఆమెకు వరుని
వెతకడం బ్రహ్మగారి వంతయినది. స్వయంవరమునేర్పాటు చేసినాడు. అందరితోబాటు తపోనిధి యైన
గౌతముని కూడా ఆహ్వానించినాడు. ఈ స్వయంవరసంరంభమును జూచి వినయవతియైన అహల్య “తండ్రీ! మనము సత్వ గుణ
సంపన్నులమైన బ్రాహ్మణులము , తండ్రి నిర్ధారించిన వరుని మనువాడుట కుమార్తె లక్షణము.
నేను మీ అభిప్రాయమునకు కట్టుబడియుండుదానను ” అన్నది. బ్రహ్మ క్షణకాలము యోచించి గౌతముని
తగిన వరునిగా నిశ్చయించినాడు. తపోనీష్ఠుడైన గౌతముడు బ్రహ్మ మాటను కాదనలేక ఆహల్యను
వివాహమాడినాడు.
మొదటి సంతానముగా గౌతమ దంపతులకు శతానందుడను కుమారుడు, అంజనీదేవి యను కుమార్తె ఆపై కలిగినది. ఈవిడయే సాక్షాత్తు ఆంజనేయుని తల్లి. అనగా ఆంజనేయుడు గౌతమ ఋషి దౌహిత్రుడు.
శతానందుడు అంటే
బ్రహ్మ అని అర్థము. ఆయన వేద వేదాంత విద్యా సంపన్నుడయి రాజర్షి మరియు సీతామాత
జనకుడగు జనక మహారాజునకు రాజపురోహితుడైనాడు.
తదనంతర కాలములో గౌతమునికి ఒక కుమార్తె కలిగినది కానీ ఆ
విషయము తగు సమయమున చెప్పుకొందాము.
గౌతముడు మహాపండితుడు. ఆయనకు తెలియని శాస్త్రము లేదు, రాని విద్య
లేదు. అరణ్యములోని ఆయన పర్ణశాల ఉన్న ప్రాంతమునకు తమకు తెలియని విషయములు
తెలుసుకొనేందుకు రాని విద్యలు నేర్చుకొనేందుకూ రాను రాను జిజ్ఞాసువులు అపరిమితముగా
రాజొచ్చినారు. వచ్చినవారిలో కొందరు రెండు మూడు రోజులు నిలువ వలసికూడా వచ్చేది
. వారి క్షుదార్తి తీర్చవలసిన బాధ్యత
తనదిగా భావించి మహర్షి గౌతముడు శివుని గూర్చి ఘనతపంబాచరించి తాను భూమిపై జల్లిన
విత్తనములు రెండు గంటలలో ఫలితమునిచ్చు విధముగా వరము పొంది వచ్చియున్న వారందరి
క్షుత్ పిపాస తీర్చనారంభించినాడు. జన ప్రవాహము పెరిగిపోయినది కానీ గౌతముడు
వెనుదీయలేదు. దంపతులిరువురూ అతిథి సత్కారములు చేయుచునే ఉండినారు.
గౌతమమ -అహల్య – 2 వభాగము
ఈయన ప్రతిష్ఠకు అత్యంత ఈర్ష్యాసూయలు కల్గినవారై సాటి ఋషులు
ఒక మాయా గోవును సృష్ఠించి గౌతముని చేలో వదిలినారు. ఈ అనూహ్య పరిణామమునకు అప్రతిభుడైన
గౌతముడు తనకు అందుబాటులోనున్న ఒక దర్భపుల్లను ఆ గోవుపై విసరినాడు. మాయాగోవు
కాబట్టి ఆవు అసువులు బాసినది. అ గోవవపై ఇదే యదనని సాటి ఋషులు గౌతముడు గోహత్యాయపాతకుడు,
అతని ఇంట భుజించరాదని ప్రచారము సాగించినారు. విషణ్ణ వదనుడై గౌతముడు
దుఃఖించ సాగినాడు.
ఇక్కడ నేరుగా కథతో సంబంధము లేకున్నా అన్వయించ దగిన ఒకమాట
భగవద్గీతనుండి తెలుపవలసి ఉన్నది. భగవద్గీత లోని ఈ శ్లోకాన్ని ఒకసారి చదువండి.
నేహాభిక్రమనాశోஉస్తి ప్రత్యవాయో న విద్యతే l
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ll (2.40)
ఈ అధ్యాయములో
‘సాంఖ్య యోగము’ను గూర్చి చెప్పబడినది. ఈ యోగమును ప్రారంభించినవారికి నాశము ఉండదు ; పైగా విపరీత విపత్కర దోషములంటవు. ఈ విధానమును చిత్తశుద్ధితో స్వల్పముగా
ఆచరించినా గొప్ప భయముల నుండి రక్షిస్తుంది.
ధర్మాన్ని కొద్దిగా
ఆచరించినా అది ఎంతో లాభదాయకమే.
“ అధర్మానికి కొద్దిగా తల ఒగ్గినా అది ఎంతో నష్టదాయకమే.
“ సన్మార్గము ”లో ప్రారంభించినది ఏదీ ఎప్పటికీ వృథా
కాజాలదు.
“ ధర్మమార్గము” లో ప్రారంభించి, ఎంత చేస్తే
అంత భవిష్యత్తుకు పునాది అవుతుంది.
ఈ ఉపదేశము గౌతమునికి ఎంతో అన్వయమైనది. ఆయన ధర్మము తప్పక జనహితమునకై పాటుబడిన
మహనీయుడు.
ఎంతగానో విలపించుచున్న గౌతమునికి అప్రయత్నముగా కన్నులు మూతబడినాయి.
ఆయనకు స్వప్నములో వినాయకుడు అగుపించి “నీవు ముందు ఒక్కసారి మనసారా గణానాంత్వా
..... అని నన్ను తలచి నీ పని మొదలు పెట్టు. ఇక ఆవు విషయమంటావా! శివుని ధ్యానించి
ఒక పాయ గంగను తన జటాజూటము నుండి విడిచి అది ఆవు పడియున్న స్థలమును తడుపుతూ ప్రవహింపజేయ
ప్రార్థించు” అని చెప్పి అంతర్ధానమందినాడు. గౌతముడు అట్లు చేయుటచే గోదావరి పుట్టి
గౌతముని పేరుపై గౌతమి అన్న నామాంతరముతో ప్రవహించదొడగినది. పవిత్ర గంగాజలము
ఆ ఆవును తాకుటచే
ఆవు బ్రతికి మాయమైపోయినది. ఈ విధముగా మహనీయుడగు గౌతముడు గంగను దక్షిణాథమునకు కూడా
మరలించి తనపై కలిగిన అభియోగమును చెరిపివేసుకొనగలిగినాడు.
కానీ ఆయన అంతటితో ఆగలేదు. బ్రాహ్మణులైన మీలో అనేకులు కలియుగములో కర్మభ్రష్టులై మదమాంస మదిరాపాన మత్తులగుదురుగాక, అధికాంశము, నాస్తికులగుదురుగాక! అని శపించినాడు.
మిగిలి నదిమరోమారు.......
గౌతమ మహర్షి --3 వ భాగము
ఇపుడు గౌతమముని యొక్క మరొక
జీవిత విశేషమును తెలుసుకొందాము. ఈ కథ భారతములోని అశ్వమేధపర్వములో వస్తుంది.
గౌతముని వద్దకు ఉదంకుడు అనునొక శిష్యుడు విద్యార్థియై వచ్చి చేరినాడు. విద్యార్జన
గురుసేవ తప్ప అన్యథా పట్టించుకొన్నవాడుకాడు. ఒకనొకరోజు యజ్ఞమునకై దర్భలు
సమిధల కొరకు అడవికి
వెళ్ళినాడు. సమిధల మోపు నెత్తిన పెట్టుకొని వచ్చి ఇంటిలోవేసి ఎందుకో ఆ మోపు వైపు
తెరిపారజూచినాడు. ఆయనకు అక్కడక్కడా 3,4 తెల్ల వెంట్రుకలు అగుపించినాయి. గురువు
వద్దకు విల్లి “గురుదేవా! నావయసు యౌవ్వనము దాటుచున్నదని తెలియవచ్చుచున్నది. నాలో
వివాహెచ్ఛ కలుగుచున్నది. ఇప్పుడు కన్యాదానమెవరు చేస్తారు నాకు “ అని సందేహమును
వెలిబుచ్చినాడు. ముందువెనుకలాలోచింపక సంకల్ప బలముచే ఒక యవ్వవనవతిని సృష్టించి ఆతనికిచ్చి
వివాహము జేసినాడు. తన శిష్యుని పెళ్లి బాధ్యత, ఆలస్య ము తనవల్ల జరిగినదని పరితపించి, స్వీకరించి
చేసినాడు. మహనీయుల మహాత్మ్యములు ఈ
విధముగా ఉంటాయి. ఈ ఉదంకుని వృత్తాంతము తిరిగి భారతము చివరన వస్తుంది. ఒక అనామకుడు
అరణ్యములో తపమాచారించుకొనుచున్న ఉదంకునివద్దకు వచ్చి మహాభారత యుద్ధము
పరిసమాప్తినందినదనీ, శ్రీకృష్ణుడే సకల వినాశనమునకు కారణమని చెప్పగా ఉదంకుడు
నిజానిజముల నెరుంగకయే శ్రీకృష్ణుని శపింప ఉద్యుక్తుడైనాడు. యోగదృష్టితో అది
గ్రహించిన శ్రీకృష్ణుడు ఉదంకుని ముందు నిలచి కౌరవుల దూరాగతములను విలేవారీగా వివరించి
తన తప్పిదముంటే క్షమించి శపించినా ఫరావాలేదని అని శాసతాంగాణమస్కారమూనాచారించినాడు.
ఉదంకుడు ఆశ్రుపూరిత నయనాలతో తనను ఒక్కసారి
శ్రీకృష్ణునికి సాస్టాంగనమస్కారము చేయననుమతి కొరినాడు. మహనీయుల మనస్తత్వము
అట్లుంటుంది.
మిగిలినది మరొకమారు........
గౌతమ మహర్షి - 4 వ భాగము
(చివరిభాగము)
ఇక అతిముఖ్యమగు అహల్య
వృత్తాంతమునకు వస్తాము.
అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరిస్తథాl
పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనం ll
పైన తెలిపిన ఐదుగురు పెళ్ళయిన వారే! పిల్లలను కన్నవారే!
కానీ వారి కన్యత్వము చెడదని శాస్త్రవచనము. అహల్య విషయములో ఈ మాటకు సమాధానము
గౌతముని శాపములోనే తెలియవస్తుంది. అహల్య వృత్తాంతమును ఎన్ని విధములుగా చెప్పినా
ఇంద్రుడు అహల్య యొక్క సంగమము వాస్తవము. ‘అహల్య’ అనగా హాలమును బొలీన వంకర ఏదియునులేక
ఎంతో అందముగా ఉందునది అని నిఘంటువు తెలుపుతుంది. నేను ఆలోచించిన విధానము, ఇది
తప్పు కూడా కావచ్చును, దున్నబడని పొలమును అహల్యము అనుట సబబయితే అహల్య అన్న మాటకు
అర్థము నిత్య కన్యకయే! అవుతుంది. ఇక ఒకపర్యాయము కథను చూద్దాము. ఈ కథలు పలువిధాలుగా
చెప్పుకొంటారు. ఎన్నివిధాలుగా చెప్పుకొన్నా ఇం ద్రుడు చేసినది తప్పే!
యత్ర మిత్రత్వ మిచ్చంతి తత్ర త్రీణి నకారయేత్l
వాగ్వాదమర్థ సంబంధం పరోక్షే దార భాషణంll అన్నది శాస్త్ర వచనము. మైత్రి కోరువాడు, అనవసర వాగ్వాదము, డబ్బుకు
సంబంధించిన లావాదేవీలు, భర్త లేని
సమయములలో భార్యతో చనువు, చొరవతో మాట్లాడటము
అన్నవి పనికిరావు. ఈ తప్పిదమును ఇంద్రుడు చేసినాడు.
ఇక కథకు వస్తాము.
ఒకరోజు అహల్య భర్తయైన గౌతముడు ఉదయాన్నే నదీ స్నానానికి
వెళ్ళగా ఆమె మీద కోరికతో దేవేంద్రుడు ఆమె భర్త రూపంలో వచ్చి కోరిక తీర్చమని
అడుగుతాడు. తపస్సంపన్న అయిన అహల్య ఇంద్రుడి మోసం తెలిసీ అందుకు అంగీకరిస్తుంది. సంస్కృత
రామాయణం, బాలకాండ, 48వ సర్గ, 19వ
శ్లోకము). అదే సమయానికి గౌతముడు తిరిగివచ్చి ఆమెను ఈవిధముగా శపిస్తాడు.
“ ఇహవర్ష సహస్రాణి బాహూని నిసిశ్యసిl
వాయు భక్ష్యా నిరాహారా తప్యాని భస్మశాయినీll
అదృశ్య సర్వ భూతానాంఆశ్రమే అస్మిన్ నివసిష్యసిll (సంస్కృత రామాయణం, బాలకాండము, 48వ సర్గ,30వ
శ్లోకము.) అనగా, “బహు
సంవత్సరాలునీవు గాలిని భక్షిస్తూ ఆహారము లేక తపస్సు చేసుకుందువు. నీపైన
పరాగము(బూడిద) కప్పబడుతుంది. నీవెవరికీ కనబడవు. అదృశ్య రూపమున ఇక్కడనే తపస్సు
చేసికొనుము.
“ త్రేతా యుగంలో
మహా విష్ణువు రాముని అవతారమునెత్తి ఇచ్చటికి వచ్చినపుడు ఆయన పాదధూళిచే (ఆయన రాక
వలన, దర్శనము
వలన) ఆమెకు శాపవిమోచనం అవుతుందని తెలియబరుస్తాడు. (శ్రీమత్ ఆంధ్ర వాల్మీకి
రామాయణము, యదాతథ
అనువాదము, వావికొలను
సుబ్బారావు గారు, 1932).
అలాగే ఇంద్రుణ్ణి తన శరీరమంతా స్త్రీ జననేంద్రియాలతో నిండిపోయేలాగా శపిస్తాడు.
వృషణాలు నేలరాలిపోయేటట్లు చేస్తాడు. కానీ ఇంద్రుడు ఇతర దేవతల సాయంతో ఒక జీవాన్ని
బలి ఇచ్చి దాని వృషణాలను అతికించేటట్లు చేస్తాడు. అమ్మవారిని గురించి తపస్సు చేసి
తన శరీరంపై ఉన్న స్త్రీ జననేంద్రియాలను కన్నులులాగా కనిపించేటట్లు వరం పొందుతాడు.
అందుకనే ఆయన్ను సహస్రాక్షుడు అని కూడా వ్యవహరిస్తారు. “ఇట్లు అహల్య శిలగానయ్యెనని
కొన్ని గ్రంధములయందు గలదు. కానియది వాల్మీకి మతముగాదు. దుఃఖభావము లేక శిలవలె
యుండిన, పాపఫలమేమి
అనుభవించినట్లు? కావున
నహల్య స్త్రీగానుండియే తపమాచరించెను. “ - వావికొలను సుబ్బారావు గారు, వాల్మీకి
రామాయణ ఆంధ్ర అనువాద కర్త.
మరియొక విషయమును
తెలుపదలచినాను. అహల్య మహా
తపశ్శాలి. అప్పటికే
పెళ్ళయిన పిల్లలు కలిగిన ఇల్లాలు. అంటే ఆమెకు తక్కువలో తక్కువన్నా 50 సంవత్సరముల
వయస్సు ఉండవఛ్చునేమో! తన తపశ్శక్తితో శీలము చెడకుండా ఉండు విధముగా
సంగమించినదేమో!ఇవన్నీ జవాబు దొరకని ప్రశ్నలు. అయినా మనము పైన చెప్పుకొన్న శ్లోకము
ఆవిడ కన్యత్వమును బలపరచుచున్నది. గౌతముడు కూడా ఆమె తపస్సాధనలో లోపముగా ఈ బాలహీనతను
గుర్తించినాడు కావున ఆమెకు శాపము వరతుల్యమైనదిగా యిచ్చినాడు.
ఆయన 5 అధ్యాల తర్కశాస్త్రమును రచించిన మహా పండితుడు. ఇది వేదాంత ప్రామాణిక గ్రంథము. ఇందు
28 ముక్తి సూత్రములను జిజ్ఞాసువుల కొరకు తెలిపినాడు. ఇంతటి మహనీయుల చరిత్ర వ్రాసిన
నాకు చదివేమీకు ఆ శ్రీరామచంద్రుడు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి తోబాటూ సకల
శుభములను సమకూర్చుగాక!
స్వస్తి.
రెండవభాగముకై ఎదురుచూస్తూ...ధన్యవాదములు సర్
ReplyDelete