శుంభ నిశుంభుల వథ
శుంభ నిశుంభుల వథ
https://ajaraamarasukthi.blogspot.com/2025/03/blog-post_20.html
నిర్మల సాధు సంత ఋషి నిర్జర శ్రేణిని హింస చేయగా
దుర్మద దుష్ట ధూర్త గుణ దుర్నయ సంతతి యౌచు
రాక్షసుల్
ధర్మము వీడి హింసకు నితాంతము
ప్రోత్సహమందజేయ నా
దుర్మతులన్ వధించి బహు దుర్గతి గూర్చగ దుర్గ
వచ్చెడిన్
ఈ
విధముగా నానాపాట్లూ పెట్టే శుంభ నిశుంభులను సోదరద్వయము యొక్క ధాటి కోపలేక దేవతలంతా తమ మొరలాలకింపజేయ
బ్రహ్మలోకమును చేరుకున్నారు.
ఆ రక్కసిద్వయము పీచమణచడానికే, 'కౌశికి' అన్న దేవతను ఆవిర్భవింపజేసి ఉంచిన విధాత, ఆమె కాళికామూర్తి యై మాతంగిగా విలసిల్లుతుందనీ, ఆమెను ఆరాధించ వలసిందని
దేవతలకు సూచించినాడు చతుర్ముఖుడు.
అంతా భక్తిశ్రద్ధలతో ఆమెను అలాగే కొలిచి
తమ కోర్కెలీడేర్చుకొంటామని తెలిపి ఆవిధముగానే చేయసాగినారు. వారిపట్ల సుప్రసన్నయై, ఆ కదంబనవాసిని ధైర్యం చెప్పి కరుణ కురిపించి వారికోర్కె తగిన సమయమున తీరుస్తానని మాట ఇచ్చింది.
.ఒక పర్యాయము ఆమె అతిశయించిన
రూపలావణ్యాలతో కళ్ళు చెదిరే కమనీయ రూపును
దాల్చి శుంభనిశుంభులరాజధాని పొలిమెరలలో నడయాడ సాగింది .
ఆ అపురూప సౌందర్యరాశియగు అమ్మవారిని జూచి చండ ముండులనే రాక్షస సేవకులు ఆతల్లి
సౌందర్యమును గూర్చి తక్షణం తమ యజమానులకు చేరవేయనిదే ఉండలేకపోయినారు.
అంతటి జగదేకసుందరిని పొందితీరని బ్రతుకు
వ్యర్ధం అన్నట్లు ఆమె అంద చందాలను వర్ణించడంతో, ఆ ఆసురులలో ఆమెను పొందవలెనన్న పట్టుదల పెరిగి పోయింది . ఆ దుర్మతులకు అలాగే పెరుగుతుందని, అంబకు ముందే తెలుసు!
వాళ్లు తమ వైభవము తెలుపుతూ ఆమెకు సుముఖత
కలుగజేయ దూతలను పంపినారు. వారు వచ్చి - తనను రమ్మంటారనీ ఆ ఆమ్మకు తెలుసునని ముందే
అనుకొన్నాము కదా!
అలావచ్చిన దూతలతో జగన్మాత ఈవిధముగా
చెప్పినది "నాకో ప్రతిజ్ఞ వున్నది. యుద్ధము లో నన్ను గెలిచిన వాళ్లని తప్ప, ఇతరుల్ని నేను పెళ్లాడను. చేవ వుంటే యుద్ధానికి రమ్మని మీ వాళ్ళకు చెప్పుడు !"
అని చెప్పిపంపినది అమ్మ.
తమనొక సుకుమారి ఆ విధంగా సవాలుచేయడమా అనే
గర్వంతో "ఆ జవ్వనికి తమ శౌర్యమును
గూర్చి తెలిసినట్లు లేదని భావించి, తన
సేవకుడగు ధూమ్రాక్షుని “ఓరీ ధూమ్రాక్షా!
మాయచేసి అయినా సరే! ఆ ముగ్ధను పట్టి తీసుకురా!" అని ఆజ్ఞచేసినాడు నిశుంభుడు.
ధూమ్రాక్షుడు ఎందుకైనా మంచిదని ముందు
జాగ్రత్త చర్యగా సైన్య సమేతుడై ఆమె వద్దకు వెళ్లినాడు.
అట్టహాసముగా సైన్యంతోవచ్చిన ధూమ్రాక్షుని కేవలం తన హుంకార ధ్వనిలో పుట్టిన
వేడితో బూడిదగా మార్చివేసింది. నిశుంభునికి విషయము చేరినది. ఆమె సాధారణ స్త్రీ
కాదని గ్రహించినాడు నిశుంభుడు. ధూమ్రాక్షుని సైన్యముతో సహా ధూళిలో కలిపి 'ధూమావతి' అన్న పెరు పొందింది మాతా కౌశికి. శత్రువుల్ని నామ రూపాల్లేకుండా మట్టుబెట్ట
దలచినవారు ధూమావతిని ఆరాధిస్తారు. అనగా ఆమెను ఉపాసించు వారికి శత్రుభయం ఉండదు. ధూమ్రాక్షునే
వధించిందంటే, ఆమె సుకుమారి అయివుండదని - ఏ మహత్తర దైవ శక్తియో అయివుంటుందని గ్రహించుకున్న
నిశుంభుడు మెరికల్లాంటి రాక్షసవీరులను ఏరి, ఆమె పైకి
యుద్ధానికి పంపినాడు.
చండ, ముండ, రక్తబీజాదులు కూడా ఆమె ధాటికి మరణించినారు.
ఎట్టకేలకు కాలకేయాది మహావీరుల్ని
వెంటబెట్టుకుని అన్నదమ్ములిద్దరూ ఒకేమారు కదనానికి కదిలినారు.
వారిని చూస్తూనే కౌశికి వింటినారి
సంధించింది. పెనుఘోషతో ధనుష్టంకారం చేసింది.
అంతవరకూ కేవలం ఆమె సోయగాలను విని మాత్రమే
ఉన్న శుంభ నిశుంభులు, ప్రత్యక్షంగాఆ తల్లిని జూచి
అప్రతిభులైపోయినారు.
తమ సైనికులు చెప్పినది నిజమేనని, వారి
మాటలలో ఆవగింజంతయినా
అతిశయోక్తి లేదు అని గ్రహించినారు. గత్యంతరము లేక , యుద్ధ సన్నద్ధులై “మానినీ మాతో
పోరుకంటే పొందు నీకులాభం!" అని మెల్లమెల్లగా నచ్చజెప్ప ప్రయత్నించినారు.
"పిరికిపందల్లారా! ఇంత సైన్యాన్ని
తెచ్చుకొని కూడా ఇంకా డంబాచారమేల? సమరము తప్ప మీకు సమంజసమైనది ఏదీ లేదు. ముందే చెప్పినట్లుగా, నన్ను యుద్ధంలో ఓడిస్తే నేను ఇంకెక్కడికి పోగలను?" అనేసరికి, పౌరుషం పొడుచుకొచ్చిన శుంభ నిశుంభు
లిద్దరూ వివిధ ఆయుధాల్ని ఆమెమీద ప్రయోగించినారు. అన్నీ ఆమె శరపరంపర ముందు
నుగ్గునుగ్గు అయిపోయినాయి.
ఇక – చివరిగా తన దగ్గర మిగిలినదీ
అజేయమైనదీ అయిన గదాయుధాన్ని ప్రయోగించాడు నిశుంభుడు. కౌశికి త్రిశూలం ప్రయోగించింది
- అందుకు ప్రతిగా. అది, గదను పడగొట్టి నిశుంభుని రెండుగా
చీల్చుకుంటూ వెళ్లిపోయింది.
హాహాకారాలతో రాక్షసులు విషణ్ణ వదనులు కాగా, సోదరుని
కోల్పోయిన శుంభుడు క్రోధారుణ నేత్రుడై
విరుచుకుపడినాడు ఆమెమీద.
శుంభుని దగ్గర ఎంతోకాలము అజేయంగా ఉన్న
ఖడ్గాన్ని తుత్తునియలు చేసి, తన శూలాయుధ ప్రయోగంతో
శుంభుని తలను ఎగుర కొట్టింది అమ్మవారు.
శుంభ నిశుంబుల వధ పూర్తయింది.
శ్రీముఖీ కౌశికీదేవీ దుష్ట సంహారకారిణీ
భక్తానీక భయ ధ్వంశీ వందే గౌరీం నమామ్యహం ll
స్వస్తి.
Comments
Post a Comment