అంధకాసుర వథ
అంధకాసుర వథ
https://ajaraamarasukthi.blogspot.com/2025/01/2024.html
ప్రకృతి నవవసంత మలయ మారుతీ భరితమై సురుచిర సౌందర్య మయమై దేవతలకే
ఆ అపురూప ఆనందమనుభవింప ఉవ్విళ్ళూరజేయుచున్న, మందరగిరిపై విహారం చేయ పార్వతి
పరమేశ్వరులు సంకల్పించి అక్కడ
విహరిస్తూండగా, శివుడు మహానందపరవశుడై తూర్పు దిక్కు చూస్తూ నిలబడివుండినాడు.
ఓ క్షణంపాటు మోహపరవశ అయిన పార్వతి వెనుక నుండి వెళ్లి
చిలిపిగా, ఆయన కళ్లు మూసింది. దాంతో సమస్త లోకాలకూ చీకటి
కమ్మినట్లయింది.
హటాత్తుగా కమ్మిన ఆ అంధకారానికి పార్వతి కూడా
నివ్వెరపోయింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యాందోళనల వల్ల, అరచేతుల్లో
స్వేదం కమ్మింది.
ఆ సమయంలో శివుని నేత్రాలు మూయబడి అంధకార సంఘటితమైనందున 'అంధకుడు' అనే ఓ గ్రుడ్డి
బాలకుడు ఆ సందర్భమున పరమేశ్వరునికి ఉద్భవించినాడు.
ఇది ఇట్ల ఉంచితే,
హిరణ్యాక్ష - హిరణ్య కశిపులనే ఇద్దరు సోదరులలోను, హిరణ్యకశిపుడికి
ప్రహ్లాదుడనే మహావిష్ణు భక్తుడైన కొడుకు ఉదయించగా, హిరణ్యాక్షుడికి
ఎంతకాలానికీ సంతానం కలుగకపోపోవుటచేత ఆతడు శివునికై తపమాచరించుచున్న తరుణంలో ఈ
బాలకుడు జన్మించడం జరిగింది. చీకటి వల్ల అతడు గ్రుడ్డివానిగా పుట్టినాడు. శివుడాబాలకుని
హిరణ్యాక్షునికి దత్తుగా, ఆతని తపఃఫలితముగా ఇవ్వదలచినాడు. హిరణ్యాక్షుడు మిక్కిలి
సంతోషముతో దానిని మహాప్రసాదముగా
స్వీకరించినాడు. పరమేశ్వరుడు అతని నమ్రతకు సంతసించి ఆ బాలుడు మహా బలుడు అగుటయేగాక
అంధత్వమును బాసి కంటిచూపును కూడా పొందగలదని వరమిచ్చినాడు. హిరణ్యాక్షుడు భూలోకాది
సమస్తలోకాలనూ వశపరుచుకుని దేవతలకు పీడగా పరిణమించినాడు. భూగోళమును సముద్రంలో ముఃచివేయయడానికి
ఉద్యుక్తుడైనాడు. ఆ అకృత్యానికి బాగా నలిగిపోయిన భూదేవి, శ్రీ
మహావిష్ణువుతో మొరపెట్టుకోగా ఆయన వరాహావతారం ఎత్తి, భూదేవిని తన
కోరలపైన నిలిపి, హిరణ్యాక్షుడిని నిర్జించినాడు.
కాలక్రమములో ఆ బాలుడు అందకాసురునిగా పెరుబొంది, తన తండ్రి వరాహావతారియైన శ్రీవిష్ణువు చేతిలో మరణించిన
తరువాత రాజయి, బ్రహ్మనుగూర్చి ఘోరతపంబాచారించి తాను మనసులో
కోరరాని కోరిక కోరినపుడు మాత్రమే మృతుడు కాగలడన్న వరమును పొందినాడు.
సాధుస్వభావి అయిన అంధకుని, జ్ఞాతులంతా దైత్యత్వమును
నూరిపోసి, అతనిని అసురునిజేసి దేవతలపై దండయాత్రకు పురికొల్పినారు.
ఆవిధముగా అంధకుడు దేవతలను జయించినాడు.
ఒకసారి అంధకుడు మందరపర్వతం పై విలాసినులతో విహరిస్తుండగా, అతిలోక
సౌందర్యవతి అయిన ఓ స్త్రీని చూసినట్లు - ఆమె ఓ జడదారికి భార్యగా ఉన్నట్లు - చూడగా
అతడామెను ఎక్కడినుంచో అపహరించి తెచ్చినట్లు కొందరు గూఢచారులు వార్త తెచ్చినారు. అందులో
కొందరు ఆప్తులు మరింత ముందడుగు వేసి, "అసురేంద్రా! ఆ
అతిలోక సౌందర్యరాశి ముందీ విలాసినులు వందమంది కూడా సాటిరారు" అని అతిశయోక్తి
లేకుండానే చెప్పినారు.
ఆ మాటలకు ఆ సుందరీమణులు అలిగి అక్కడినుండి తొలగిపోయినారు.
ఎలాగైనా అంతగొప్ప సుందరిని కూడి తీరాలన్న పట్టుదల అంధకుడికి తీవ్రమైంది.
ఆమె ఓ జడధారి ఆధీనంలోగదా ఉన్నది. ముక్కుమూసుకొని తపమాచరించు
ముని మ్రుచ్చుకేల ముగ్ధ సౌందర్యమని దూరాలోచనాపూరితుడై . అతడిని నయాన - భయాన
బెదిరించి ఆ మానిని లొంగదీసుకోవడానికి తన సమయమును ఒక్క క్షణము వృద్ధాయచేయకుండా
ఆలోచించసాగినాడు. వీరాధి వీరుడను ఆసురేంద్రుడనయిన నేను అంతగా ఆలోచించలేల?...అనుకున్నవాడై, తాను ప్రభువు
గనుక - స్వయంగా వెళ్లడం హీనకార్యం గనుక ముందుగా రాయభారము పంపినాడు.
నిజానికి - తాను రుద్రాంశ సంభూతుడననీ, పార్వతీదేవి తనకు
మాతృదేవత అని గ్రహించలేనంత మదించి అంధకాసురుడు
అన్న పెరు సార్థకము చేసుకొన్నాడు.
ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరునిముందు
వణుకుతూ నిలచిన ఆ రాయభారికి 'పరాక్రమించడం వీర
పురుష లక్షణం. యుద్ధమునకు తలపడుమని తిరుగు రాయబారము పంపినాడు శివుడు. "ఔరా! ఓ జడతాలుపు
కింతధిక్కారమా?" అని యుద్ధ సన్నద్ధుడైనాడు అంధకుడు. భయంకరమైన ఆయుద్ధములో శివుడు తన త్రిశూలంతో అంధకుణ్ణి పైకెత్తి
పట్టుకున్నాడు. అది అతని శరీరంలో మూడుచోట్ల గుచ్చుకొని విలవిల్లాడసాగినాడు. అలా
కొంతసేపు గడిచేసరికి అంధకుడిలోని కామ, క్రోధ, మాత్సర్యములు
అణగిపోయినవి. అసురగుణాలన్నీ అణగి
పోయినందున, పంచప్రాణాలూ ఎగిరి
పోయినవని భావించి అంధకాసురవధకు దేవతలంతా
ఎంతో సంతసించినారు.
ఆ విధముగా త్రిశూలానికి వ్రేళ్లాడుతూ, అంధకుడు తానెవరో, ఎటువంటి కోరరాని
కోరిక కోరినాడో, తన ప్రస్తుత స్థితి ఏమిటో తెలుసుకుని - సామగానంతో సాంబశివుని
సంస్తుతించినాడు. హర్షామోదాలతో సాంబమూర్తి అంధకుని గణాధిపతులలో ఒకనిగా చేసి మన్నించినాడు.
స్వస్తి.
Comments
Post a Comment