వేదాంత అధ్యయనము-అర్హత

 

వేదాంత అధ్యయనము-అర్హత

https://ajaraamarasukthi.blogspot.com/2024/12/36.html

(శృంగేరి శారదా పీఠం 36వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి అనుగ్రహ భాషణమును నేను ఆకళింపు చేసుకున్న రీతిలో నా మనోభావన మీ ముందు ఉంచుచున్నాను.)

భరత ఖండమునందు వేదాంత ధోరణిలో మాట్లాడని వారు లేరు , అది పండితుడే కానీ పామరుడేకానీ. కానీ వేదాంతమునభ్యసించి సాధించినవారు సకృత్తు. ఇక వేదాంత ఉపన్యాసాలు చేయుటలో ఎంతోమంది పందితులనబడేవారు utube లో మనకు పుంఖానుపుంఖాలుగా అగుపించుతూనే ఉంటారు. ఆవిధముగా తమ వాగ్విలసనముతో ప్రభుత్వము ఒసంగు పదములను శిరౌర్యముగనెంధాచి, వద్దంటూనే గ్రహించే వాళ్ళూ ఉంటారు. ఇది ఒక వర్గమైతే కీర్తి కండూతి లేని మహా పండితులూ లేకపోలేదు. కానీ సాధకులు కనిపించరు.

ఇక నా విషయమునకు వస్తే :

జ్ఞానము లేదు సుంతయును జ్ఞాత్వము పొందగ శక్తిలేదు నా

స్థానము మూర్ఖచిత్తతతి సంగతి యందున గల్గు గాంచగా

ఐనను స్వామి పాదముల నాత్మ దలంచి తలొంచి శ్రద్ధతో

భానుని బోలె నాగురువు భాసము గూర్చగ వ్రాయ బూనితిన్ 

అనేకమంది అనేక పండితులద్వారా వేదాంతం వింటూనే ఉన్నారు. ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రములలో, భగవద్గీతలో, ఆ వేదాంత తత్త్వం అనేది చాలా విస్తారంగా చెప్పబడింవుంది. దానిని మనం వింటూనే ఉన్నాము, కానీ ఆ తత్త్వం ఎంతమందికి సరిగా వంటబట్టిండి అన్నది అక్షరమెరుగని నాకు యక్ష ప్రశ్నే!  ఎంతమంది  ఆ తత్త్వాన్ని పట్టుదలతో సాధించగలుగుచున్నారా? ఆవేదాంత సిద్దాంతములను  అనుష్ఠించ ప్రయత్నించుచున్నారా? అని అంటే దానికి జవాబు ఇవ్వడం చాలా కష్టమే! ఎందుకంటే ఎన్నిసార్లు ఆ వేదాంతోపన్యాసాలు విన్నా ఆతత్త్వం సరిగా వంటబట్టడం లేదు. ఎందుకని? ఎవరిది లోపం? చెప్పేవాళ్ళది లోపమా? వినే వాళ్ళది లోపమా? చెప్పేవాళ్ళు పాపం వేదాంతంలో చాలా పరిశ్రమ చేసే చెబుతున్నారు. చేయకుండా చెప్పే వాళ్ళ విషయం చెప్పనే అవసరము లేదు.  నీలకంఠ దీక్షితులవారు  చెప్పినట్లు " ఆకౌమారాత్ గురుచరణ శుశ్రూషయా బ్రహ్మవిద్యా స్వాస్థాయాస్థాం అహః మహతీం అర్జితం కౌశలం యత్" బాల్యం నుంచి గురుకులవాసం చేసి గురు శుశ్రూష చేసి ఆ గురువుల ముఖవారిజము నుండి   వేదాంత తత్త్వాన్ని చక్కగా తెలుసుకొని ఆవేదాంతంలో పాండిత్యం సంపాదించిన పండితులు చెప్పినప్పటికీ ఎందుకు వంటబట్టడం లేదంటే మనకు వేదాంత శ్రవణ అధికారం రాలేదు. దేనికైనా ఒక యోగ్యత అనేది కావాలి. అ ఆ లు రాని వానిని అమరం చెప్పమన్నట్లుంటుంది అది. అలాగే మనకు  కూడా వేదాంతము  సరిగా వంటబట్టాలంటే సోపానక్రమము కల్గిన విద్యా విధానమును అనుసరించవలసియుంటుంది. దానికి కొంత యోగ్యత మనం సంపాదించుకోవాలి. ఆ యోగ్యతకు సంస్కారము మూలము. ఆ సంక్రమణమునకు ఆద్యులు తలిదండ్రులు.

 

కఠోపనిషత్తులో ఈ విధముగా చెప్పబడినది.

"నా విరతో దుశ్చరితాత్ నా శాంతో నా సమాహితః!

నాశాంత మానసోవాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్!!"

దుశ్చరితాత్ అవిరతః యేనం న ఆప్నుయాత్ - మనం ఆ మంత్రార్థాన్ని సులభమైన భాషలో తెలిపితే చెడ్డ అలవాట్లు వీడని వాడు దీనిని తెలుసుకొనజాలడు. శాస్త్రం దేనిని నిషేధించిందో దానినే మనం చాలా అపేక్షిస్తున్నాము అనగా కోరుకొంటున్నాము. ఇది లోకంలో 90 శాతము మంది అనుసరించే విషయము.

         ప్రాయో నేతి శృతి విషయతా విశ్వ మాధుర్య హేతుః" అన్నారు కదా! "న్యాయయాగర్థా అపి కిం అధికం లభ్యం ఉన్మార్గ వృత్యా"- డబ్బు సంపాదించడము  ప్రతి ఒక్కరి అవసరము. దానిని ఎవరూ కాదన వీలులేదు . కానీ దానికి ఒక రీతి ఒక పరిమితి ఉంటుంది. "న్యాయోపార్జిత విత్తేన కర్తవ్యం హ్యాత్మరక్షణం" - న్యాయమైన మార్గము ధనార్జనకు ఒకటి ఉంటుంది. దానిని వదిలిపెట్టి అన్యాయమార్గంతో ఏదైతే సంపాదిస్తున్నామో అది క్షణికానందమే కానీ శాశ్వతముకాదు. న్యాయమార్గంలో సంపాదించినా, అన్యాయ మార్గంలో సంపాదించినా మనము  తినేది ఎంత-కడుపు నిండేంత. అన్యాయంగా ఎక్కువ సంపాదించిన వాడు ఎంతవిలువైన ఆహారమునుతిన్నా దుర్గంధ భూయిష్టమైన మకిలమై మంటిలో కలువవలసినదేకదా! అటువంటప్పుడు అన్యాయ మార్గంలో సంపాదించి కేవలం పాపాన్ని మూటగట్టుకుంటున్నాము తప్ప అన్యతా కాదు. ఎంతసేపటికీ ఇంకా కావాలి, ఇంకా కావాలి ఆనుకొనుట తప్ప ఇంకొద్దు, ఇకచాలు అన్న ఆలోచనలు రావు.  భర్తృహరి శుభాషతములలోని ఈ నీతి పద్య రత్నమును చూడండి.

మిగిలినది మరొకమారు .....

వేదాంత అధ్యయనము-అర్హత-2

ప్రాణాఘాతాన్నివృత్తిః పరధనహరణే సంయమః సత్యవాక్యం

కాలే శక్త్యా ప్రదానం యువతిజనకథా మూకభావః పరేషామ్‌l

తృష్ణా స్రోతో విభంగో గురుషు చ వినయః సర్వ భూతానుకంపా

సామాన్యః సర్వ శాస్త్రేష్వనుపహత విధిః శ్రేయసామేష పంథాఃll

దాని తెనుగుసేత ఏనుగు లక్ష్మణకవి గారు ఈ క్రింది విధముగా చేసినారు:

పరహింసా పరకీయ విత్త హరణాభావంబు, సత్యవ్రతా

దరమున్,దాన పరత్వమన్య వనితో దంతోక్తి మూకత్వమున్‌,

బరతృష్ణాఝర భంజనంబు గురు నమ్రత్వ బునున్  భ్రాణభృ

త్కరుణాశాస్త్ర సమత్వసద్విధులు  భద్ర ప్రాప్తికిన్‌ మార్గముల్‌

ఇతర జీవ జాలమును హింస చేయకుండా ఉండుట , పరులకు చెందిన వాటిని దోచుకొను ఆలోచన చేయకుండుట,నిత్యసత్య వచనము, వీలైనంత వరకూ అర్హులకు  దానము చేయుట,పర వనితా పరిహాస ప్రసంగ రాహిత్యము,అర్హతను మించిన   ఆశ కలిగియుండకపోవటము, గురువుల పట్ల వినయ విధేయతలతో మెలగడము , సకల  ప్రాణుల పట్ల దయతో వ్యవహరించుట,అన్నవి  మానవులకు శ్రేయోదాయకములు. ఈ దిగువన జగద్గురువులు భారతీతీర్థ స్వామి వారి గురువులు శ్రీ హరీ శ్రీ అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఈ దిగువన తెలిపిన శ్లోకమును ఉతంకిన్చేవారు:

దారా ఇమే మే' 'తనయా ఇమే మే'

'గృహా ఇమే మే' 'పశవశ్చ మేమే'

ఇత్థం నరో మేషసమానధర్మ:

మేమేకర: కాలవృకేణ నీత:

సంస్కృతంలో మే అనగా నాకు అని అర్థము, ఈ ‘మేమే’ అని మేకపోతులాగా అరుస్తూ చివరకు మృత్యువు రూపమైన తోడేలుతో గ్రహించబడుచున్నాము అన్నది గ్రహించకుండా స్వార్థము ఆలోచనకు అడ్డుకట్ట వేయగా మృత్యువు అనబడు తోడేలుకు ఆహారమగుచున్నాము. దీనివలన మనకు ఎలాంటి ప్రయోజనమూ సమకూరదు. ఈ మనిషియొక్క ఆశకు అంతులేదు. ఆంధ్రమహా భాగవతము అష్టమ స్కందములో బాలిచక్రవర్తితో వామనుడు ఈ విధముగా అంటాడు:

 వ్యాప్తింజెందక వగవక

ప్రాప్తంబగు లేశమైనఁ బదివే లనుచున్

దృప్తింజెందని మనుజుఁడు

సప్తద్వీపముల నయినఁ జక్కంబడునే?

ప్రాప్తమున  ఏది వ్రాయబడి ఉంటే అదెమానకు దక్కుతుంది.ఎక్కువ వస్తే పొంగిపోనూ అక్కరలేదు తక్కువ వస్తే క్రుంగిపోనూ అక్కరలేదు. ప్రాప్తించయినదే  పదివేలుగా భావించి తృప్తి పడనివారికి సప్తద్వీపముల  సంపదలు వచ్చినా తృప్తి చెందడు.

ఎంత సంపాదించినా నాకు చాలు అనేవాడు కనిపించుటఇంచుమించుగా ఎనిమిదవ వింతయే! అత్యాశకు పోయేకవడ్డీ అహర్నిశలూ పాపచింతన, పాపిష్టి కార్యములు చేయుట తప్ప, తద్వారా  కేవలం పాపము  మూటగట్టుకొనుట తప్ప వేరేమీ రాబోదు. అలాగే "భార్యా భోగాదపి కిం అధికం పణ్యకాంతాసు భోగ్యం" వైధాదన్నాదపి కిం అధికం పర్యుదస్తేషు భోజ్యం" – ఇల్లాలు ఉండగా భోగ కాంతా పరిష్వంగ మవసరమా! ఇంట్లో అమ్మయో, భార్యయో  వంట చేసి ఈశ్వర నైవేద్యం చేసి దానిని భుజిస్తే అది పవిత్రమైనది అవుతుంది. కానీ సామాన్యముగా అనేకులు హోటలుకు  పోయి తింటే అక్కడ ఉండే రుచి ఇంట్లో మా అమ్మో, ఆవిడో చేస్తే ఉండదండీ అంటారు. దానిని శాస్త్రం నిషేధం చేసింది. "నాపణీయమన్నమస్నీయాత్" - అన్నవిక్రయం చేసే చోట అన్నం తినకూడదు. ఇది శాస్త్రంలో ఉన్న విషయం. ఈవిధంగా మనిషియొక్క ప్రవృత్తులను చూస్తూంటే శాస్త్రం దేనిని నిషేధించిందో అదే చాలా రుచిగా ఉన్నది అంటే చెప్పేది ఏముంటుంది. ఇదే దుశ్చరితం అంటే! ఈ దుశ్చరితాన్ని ఎవడైతే నిలిపి వేస్తాడో వాడికి ఒక యోగ్యత కలుగుతుంది. అలా నిలిపివేసే వ్యక్తికి మనసు పరిశుద్ధముగా ఉండాలి. అపరిశుద్ధమైన మనసు గలిగినవానిని ఈ దుశ్చరితంనుంచి ఆపడానికి వీలుకాదు. పరిశుద్ధమైన మనస్సు ఉన్నవాడు ఈ దుశ్చరితము నుండి బయటకు రాగలుగుతాడు. ఇవి కేవలం ఉదాహరణకు మాత్రమే! ఇటువంటివి అనేకం ఉన్నాయి మనిషి జీవితంలో. అవన్నీ మనం వివరిస్తే అనేకమంది మనస్సులకు  కష్టమైతుంది. కాబట్టి ఎవడైతే చెడు అలవాట్లను మాని సదభ్యాసములను చేఅలవరచుకొంటాడో అనగా శాస్త్రము నిషేధించినటువంటి విషయాల జోలికి పోకుండా ఉంటాడో వాడు ఈ సదభ్యాసమునకు అధికారి అవుతాడు. ఇంద్రియనిగ్రహం లేనటువంటి వాడు టువంటి వాడికి ఈ వేదాంతంలో అధికారం రాదు.ఈవిధంగా ఎవడైతే శాస్త్రంలో చెప్పినటువంటి యోగ్యతను సంపాదించుకుంటాడో, ఎటువంటి దుశ్చరితం, దురభ్యాసం లేకుండా, ఇంద్రియ లౌల్యం లేకుండా ఇంద్రియనిగ్రహం కలిగిఉండి దేనిలోనూ ఆశలేకుండా ఉంటాడో అటువంటి వాడికి వేదాంత శాస్త్రం వినే యోగ్యత వస్తుంది. భగవంతుడు భగవద్గీతలో పరమాత్మ  ఈవిధముగా చెప్పుచున్నాడు -

"ఇదం తే నాతపస్కాయ నా భక్తాయ కదాచనl

నచా శుశ్రూషవే వాక్యం న చ మాం యోభ్య సూయతిll

పరమాత్మ చెప్పుచున్నాడు “నీకు ఉపదేశించిన ఈ శాస్త్రాన్ని తపస్సు లేనటువంటి వాడికి ఇవ్వకూడదు. తపస్సు అనగా అనేక అర్థాలు ఉన్నాయి. తప ఆలోచనే - ఆలోచనజ్ఞానం లేని వాడికి ఇవ్వకూడదు అని ఒక అర్థం. "మనసశ్చేంద్రియాణాం చ హయ ఐకాగ్ర్యం పరమం తపః" - ఏకాగ్రమమైన మనస్సు లేనివాడికి ఇది ఇవ్వకూడదు అని ఒక అర్థం. ’నియమేషు తపశ్శబ్దః" ఆపస్థంబుల వారి ధర్మసూత్రంలో తపశ్శబ్దం నియమములందు వర్తిస్తుంది అని అన్నారు. కాబట్టి నియమములు లేని వాడికి చెప్పకూడదు. ఎవడికైతే భగవంతుని యందు భక్తి లేదో వాడికి చెప్పకూడదు. ఎవడైతే గురుశుశ్రూష అనేది చేయడో వాడికిక్ చెప్పకూడదు. ఎవడైతే భగవంతుని ద్వేషిస్తాడో వాడికి చెప్పకూడదు. శంకరులన్నారు - భగవంతుడు మద్భక్తో, మాన్నమస్కురు అని తన ప్రశస్తే చేసుకున్నాడు. ఆత్మ ప్రశంశ చేసుకున్న ఆయనేం భగవంతుడు? అని ఎవడైతే భగవంతుని ద్వేషిస్తాడో అటువంటి వాడికి చెప్పదగదు. "ఇదమ సర్వశీర్షమశిష్యాయ నదేయం" "యో యది మోహాద్దాస్యతి స ఆపీయాన్ భవతి" ప్రతి ఒక్కదాంట్లోనూ దానికి ఒక అధికారి అనేవాడు ఉంటాడు. వాడికే దీనిని చెప్పాలి. ఏ విషయాన్ని తీసుకున్నా అక్కడ చివరికి ఇదొక మాటి ఉండనే ఉంటుంది. అలాగే వేదాంతానికి తగినటువంటి అధికారం మనకి లేనంకు వల్ల ఎన్నిమాట్లు మనం ఆ వేదాంతాన్ని విన్నా అది మనకు వంటబట్టడం లేదు. జగన్నాథ పండిత రాయలవారు ప్పుచున్నాడు.తమ రసగంగాధరం అన్న కావ్యములో ఈ విధముగా తెలిపినారు:

మిగిలినది చివరి భాగములో......

వేదాంత అధ్యయనము-అర్హత-3

నిష్ణాతోపిచ వేదాంతే వైరాగ్యంనైతి దుర్జనఃl

చిరం జలనిధౌమగ్నౌమైనాక మీతి మార్దవంll

ఎంత వేదాంతము  విన్నా  అపరిపక్వమైన  మనస్సు కలవాడికి వైరాగ్యం అనేది రాదు. దానికి దృష్టాంతం ఆయన ఈ విధముగా చెప్పుచున్నాడు. ఏదైనా ఒక పదార్థాన్ని నీళ్ళల్లో వేస్తే అది మెత్తబడుతుంది సామాన్యంగా. కానీ మైనాక పర్వతం వేల యేండ్లు సముద్రంలో ఉన్నప్పటికీ యేమాత్రం మెత్తబడలేదు. అలాగే ఎంత వేదాంతం విన్నా చిత్తశుద్ధి లేనటువంటి వాడికి వైరాగ్యం రాదు. కాబట్టి మన అందరికీ వేదాంతం సరిగా అవగాహన కావాలంటే ముందర మనయొక్క చిత్తము  పరిశుద్ధము కావాలి. మనస్సు పరిశుద్ధం కావాలి. మనస్సులో ఉన్న కల్మషములు తొలగిపోవాలి. ఎప్పటివరకు ఆ కల్మషములు అలా ఉంటాయో అప్పటివరకు మనకు వేదాంతం అర్థం కాదు. అర్థం కానందువల్ల దానిలో చెప్పిన శాసనాలు అనుష్ఠానం చేయడానికి వీలుకావు. అసలు విషయమే అర్థం కానివాడు శాసనానుష్ఠానం ఏం చేస్తాడు? ఆశాసనానుష్ఠానం చేయకపోవడం వల్ల మనకు ఫలితం రావడం లేదు. ఈవిధంగా మన పరిస్థితి త్రిశంకువు లాగా ఉన్నది. "ఈశ్వరానుగ్రహా దేవ పుంసాం అద్వైత వాసనా" అని చెప్పి వేదాంతం వినాలనే ఆసక్తి ఉన్నది మనకి జన్మాంతర పుణ్యం వల్ల. అంతవరకు మంచి జరిగింది. పరిపూర్ణమైన యోగ్యత అనేది ఉపలబ్ధం కాలేదు. దానికి చిత్తం పరిశుద్ధం కావాలి. మనస్సులో కామక్రోధాలు దూరం కావాలి. మనకు ఎంత వింటున్నా ఎన్ని పుస్తకాలు చదువుతున్నా మనస్సులో ఉన్న కామక్రోధాలు మాత్రం తగ్గడం లేదు. ఈ కామక్రోధాల ప్రభావం వల్ల ఏ  అకృత్యములు  చేయుటకైనా సిద్ధపడుతున్నాము. వేదాంతోపన్యాసములు  వినుటకు ఉద్దేశించబడినవి కావు. విన్న తర్వాత యథాప్రకారంగా కామక్రోధములకు వశుడై తదనుగుణంగా ప్రవర్తిస్తే ఏమీ ఉపయోగము లేదు. ఒకచోట శంకరులను ప్రశ్నించారు. - "మీరు చెప్తున్నారు ఈ జీవబ్రహ్మైక్యం అనేది పరమ సిద్ధాంతము  అదే చారమాసిద్ధాంతము కూడా!. ప్రతి ఒక్కడూ దీనిని సాక్షాత్కరింపజేసుకోవాలి అని చెప్తున్నారు. మిగతా వాళ్ళ విషయం వదిలిపెట్టండి. మరి పండితులకు కూడా ఈ సాక్షాత్కారం రావడం లేదే? ఏమంటారు? అని అంటే దానికి శంకరులు "శృణుతేషాం పాండిత్యం యత్ క్షేత్ర ఏవ ఆత్మదర్శనం" అన్నారు, అంటే “నాయనా నీవు ఏ పండితుల గురించి మాట్లాడుతున్నావు? ఈ శరీరాన్నే ఆత్మ అనుకొనే పండితుల గురించా? వారికి ఈ అనుభవం రాకపోవటం వాస్తవమే. పారిభాషికమైన పాండిత్యం వాళ్ళది. నిజంగా పండ అంటే ఆత్మజ్ఞానం. "సా యేషాం సంజాతా తే పండితాః" అటువంటి పండితులకు బ్రహ్మ సాక్షాత్కారం ఉన్నది అనడంలో సందేహమే లేదు. వేదాంతం మనకి అవగాహన కావాలి అంటే చిత్తం పరిశుద్ధం కావాలి. దానికి మనం కృషి చేయాలి. వీలైనంత మన చిత్తంలో నుంచి కామక్రోధములను దూరం చేయాలి. ఎందుకంటే అతి శత్రువులుగా అవి మన అంతఃకరణము లో కూర్చున్నాయి. బయటి శత్రువుల వల్ల మనకు అంతపెద్ద ఉపద్రవం కలుగదు. భగవంతుడు భగవద్గీతలో ఈ శరీర అంతఃకరణంలోనే ఉన్నటువంటి కామక్రోధములనే శత్రువుతనిమనసును లను పారద్రోలమని అన్నాడు. ఎందుకంటే ఈ కామక్రోధములతో కూడిన వాడికి వాడి జ్ఞానం ఆవృతమైపోతుంది, అనగా అతని మనసును ఆవహించి, ఆక్రమించి, అధిరోహించి అచేతనునిచేసి ఆడించుతాయి. మంచి చెడు అన్న తారతమ్యమునెరుగక  అటువంటివాడు తప్పులు చేస్తునే ఉండిపోతున్నాడు. మరి పెద్దపెద్ద వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు కదా! అంటే ఆసమయంలో వారియొక్క జ్ఞానం ఆచ్ఛాదితమైపోతున్నది. వాటిని దూరం చేస్తేనే కానీ మనకు యోగ్యత రాదు. అందుకు మనం ప్రయత్నం చేయాలి. ఇవాళ ప్రయత్నం చేస్తే రేపే సిద్ధిస్తుంది అని చెప్పడానికి వీలులేదు. ప్రయత్నం మొదలు పెడదాము అని అంటే భవిష్యత్తులో  ఏదో ఒకరోజుకు అది సిద్ధిస్తుంది. కానీ ప్రయత్నమే మొదలుపెట్టని వానికి ఎన్నటికి సిద్ధిస్తుంది? అందువల్ల కామక్రోధములను దూరం చేసుకొని చిత్తమును పరిశుద్ధమును చేసుకున్నవాడు వేదాంత తత్త్వాన్ని సరిగా అర్థం చేసుకోగలుగుతాడు. అప్పుడు వేదాంతంలో చెప్పిన సాధనానుష్ఠానం చేసి ఆ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. ఇదే రాజమార్గం. దీనిని మనం సరిగా అర్థం చేసుకోవాలి. దానికి భగవదనుగ్రహం కావాలి. భగవంతా! నాయొక్క మనస్సు పరిశుద్ధమయేట్లు చెయ్యి! నామనస్సులోని కామక్రోధములు దూరమయ్యేట్లు చెయ్యి! నన్ను తత్త్వజ్ఞానానికి అధికారిని చెయ్యి! అని మనం భగవంతుని ప్రార్థించాలి. ఆ భగవంతుని కృపవల్ల మనయొక్క చిత్తం పరిశుద్ధమై తత్త్వజ్ఞానానికి చేరువైతాము. అందరికీ భగవంతుడు ఆ విధమైన అనుగ్రహం చేసి అందరినీ కాపాడుగాక! అని భగవంతుని ప్రార్థిస్తున్నాను, అని జగద్గురువులు తమ అనుగ్రహ భాషణమును ముగించినారు.

వారి మాటలను అక్షర రూపములో ఉంచితే ఔత్సాహికులు పడే పడే చదువవచ్చునన్నది నా ఉద్దేశ్యము. ముదిమి మీద పడిన తరువాత ఈ ఆధునిక ప్రచార సాధనాలు వచ్చినాయి. అందుచే వానిని పూర్తిగా ఉపయోగించుకోలేను. అట్లని నా చేతనైనంత మేరకు వానినివాడి  పెద్దల మాటలను మీకు తెలుపకుండానూ ఉండలేను. ఈరచనలో ఏవిధమైన తప్పులు దొరలియుండినా అవి స్వయంకృతములు.

క్షంతవ్యుడను.

స్వస్తి.

 

 


Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి