చిత్రాన్నము-- హోళిగె -- అతిరసము

చిత్రాన్నము-- హోళిగె -- అతిరసము

https://ajaraamarasukthi.blogspot.com/2024/08/blog-post_29.html

ప్రొద్దుట చిత్రాన్నము అన్న ఒక ప్రచురణ చూసినాను. అక్కడ నా వివరణ సరిపోదేమోనన్న సంశయముతో ఇక్కడ విశధముగా, నాకు తోచిన మేరకు వివరించుచున్నాను. పండుగరోజున

భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయాలు తయారు చేయుట మన సాంప్రదాయము కదా!

పెద్దలు దీవించేటపుడు 10 కాలాల పాటు పచ్చగా వర్దిల్లమంటారు.పచ్చదనము పంటకు సంబంధించినది. పైరు పచ్చగా వుంటే పంట గొప్పగా వుంటుంది.జీవితానికి కోడా అది అన్వయమే కదా! ఇక ఆ పచ్చదనము శుభ సూచకముగా భావించుతారు కాబట్టి తినే ఆహారముకూడా కొంతమేరకైన పచ్చదనము కలిగియుండవలయునను ఉద్దేశ్యముతో వివాహాది శుభాకార్యములలో చప్పిడి పప్పు, మజ్జిగపులుసు, చిత్రాన్నము, పసుపుతో కూడిన నిమ్మరసం చారు, బండ పచ్చడి(కొత్తిమిరి+పచ్చిమిరప+ఉప్పు+బెల్లము అతి కొద్దిగా), హోళిగ (బొబ్బట్టు) లడ్డు మొదలైనవి పూర్వము రాయలసీమ ప్రాంతాలలో శాఖాహార గృహములలో చేసే వారు. కాలం మారిపోయింది. ఇప్పుడు బిరియానీలు,పులావులు,కూర్మాలు ఆ స్తానాలను భర్తీ చేస్తున్నాయి.ఇక అసలు విషయానికి వస్తాము.

1. చిత్రాన్నము : అన్నము తెల్లగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయము. అందులో అనుపానము కలిపి తినడము వాడుక.

ఇందులో పసుపు,చాలా కొద్దిగా ఆవపిండి,కొద్దిగా పసుపు,పచ్చి మిరపపొడి,ఉప్పు తగినంత వేసి , ముందుగానే వేసి పెట్టుకొన్న పోపులోఅన్నముతో కూడా కలిపితే 'చిత్రాన్నము' తయారు. ఇది నిమ్మ పండు రంగు కలిగి కంటికి ఆకర్షణీయముగా వుంటుంది. ఇందులో పసుపు,ఉప్పుతప్ప 'పులిహొర' కు వాడే వస్తువులు, నాకు తెలిసి , వాడరు.

ఇక 'పులిహోర' లోని 'పులి' . తమిళ , మళయాళ భాషలలో మనమనే చింతపండును'  'పుళి' యని కన్నడములో 'హుళి' (వారు '' ను'' గా పలుకుతారు.) అని అంటారు. మనము చింత పండు అంటాము. మరాఠీ లో 'చించ' అంటారు. ఇది మనమాటకు దగ్గర. ఈ వంటకము మనకు పైవారినుండి అంటే చింత పండు  దిగుమతి అయినట్లు తెలియవచ్చుచున్నది.

పుళి = చింతపండు; ఒగిరై = ఓగిరము (ఆహారము ప్రకృతి,ఓగిరము వికృతి.) ఈ పులియోగిరై  రాను రాను పులియోదరై గానూ ఇంకా మారి మారి 'పులిహోర' గానూ మారింది.

2.హోళిగె : దీనినే పోళీ అని అధిక ప్రాంతాలలో అంటారు. కర్నాటకములో  '' కు బదులుగా '' వాడుతారు గనుక అది 'హోళిగె' అయినది. రాయలసీమ ప్రాంతములో ఈ తీపి వంటకాన్ని పై రెండు పేర్లతోనే పిలుస్తారు. బొబ్బట్టు అంటే అక్కడ చాలా మందికి తెలియదు. శుభకార్యాలలో ఇది చేయుట ఆనవాయితీ ఎందుకంటే ఇది కూడా పచ్చదనము కలిగియుంటుంది కాబట్టి.

విజయవాడ,గుంటూరు.తీరప్రాంతాలలో దీనిని బొబ్బట్టు అనే పిలుస్తారు. అక్కడ .హోళిగె, పోళీ తెలియక పోవచ్చు. కర్నాటక లోని కొన్ని ప్రాంతాలలో 'ఒబ్బట్టు' అనుట కూడా కద్దు. ఇందులోనూ శెనగపప్పు,బెల్లము సమపాళ్ళ లో కలిపి పూర్ణము తయారు చేసుకొని తగినన్ని నీళ్ళతోనో,పాలతోనో,పసుపు ఒక చిన్న స్పూను, చిటికెడు ఉప్పు మంచి గోధుమపిండి తోకలిపి ఒక గంటకు పైగా నానబెట్టి, తరువాత పూర్ణపు ముద్దలు  గోధుమ పిండి ఉల్లెలో జొనిపి  దానిని చపాతీ బండ పై బట్టపరిచి దానిపై పోడిపిండిని రాల్చి ఈ వుల్లెని వత్తి పెనము పై కాల్చుతారు.విధానము అంతటా దాదాపు ఒకటే అయినా పేర్లలో మాత్రమె వ్యత్యాసము.

3. అతిరసము: ఇది చేయడము సులభమే గానీ జాగ్రత్త చాలా అవసరము.దాదాపు  3/4 kg బెల్లమి 1 kg బియ్యపుపిండి కాల్చుటకు నూనె ,కావలసినది అంతే. అంతా బెల్లపు పాకము తయారుచేయుటలోను పిండి పాకములో వేసి కలిపి (సాయంకాలముగా కలిపి రాత్రికి అలాగే ఉంచుతారు) తెల్లవారి అతిరసాలు చేస్తారు.

తమిళులు, రాయలక సీమ వారు దీనిని అతిరసం అంటారు. విజయవాడ,గుంటూరు.తీరప్రాంతాలలో దీనిని అరిసె అంటారు.

తమిళులలో అనేకులకు అతిరసం అన్నది సంస్కృత పదమనితెలియదు. నమిలే కొద్దిరసము వూరుటచే బహుశ అతిరసమంటారేమో. మరి ఆంద్ర లో 'అరిసె' అని ఎందుకంటారో వారికి కూడా తెలిసియుండక పోవచ్చు. 'అరిసి'

అన్నది తమిళ పదం అంటే బియ్యము అని అర్థము. అరిసి తో ఈ వంటకము చేస్తారు కావున దీనిని అరిసెలంటారు.

ప్రాంతాలు వేరయినా నాడెంతో సోదరభావము వుండేది. మరి నేడో?

 

స్వస్తి.

Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి