కాశికా విశ్వేశ్వర లింగము

ద్వాదశ జ్యోతిర్లింగములలోని 9వ జ్యోతిర్లింగము

కాశికా విశ్వేశ్వర లింగము

https://ajaraamarasukthi.blogspot.com/2024/08/9-1.html


కాశీనాథ అనాథ నేను పథమా కన్పించరాదాయె నే

నాశావేశము మేళవింప శుభదాంశాయుక్త ప్రజ్ఞప్తులన్

కాశీ పట్న విభూతికిన్ కలుపుచున్ కౌతూహలాపేక్షతో

ఈశా తెల్పగ నెంచినాను దయతో ఈడేర్చుమా కోరికన్

   

కాశీ మహానగరము

సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం |

            వారాణసీనాథ మనాథ నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||

ప్రసిద్ధ పుణ్య క్షేత్రములు మూడు విధములు , 1. స్థల, 2. జల, 3. శిల క్షేత్రములు.

1. నైమిశారణ్య స్థల మహత్మ్యమునకు ప్రతీక. (స్థల)

2. గండకి సాలగ్రామములకు ప్రసిద్ధి, అట్లే నర్మద తులా పరీక్షకు నెగ్గిన బాణ లింగములకు ప్రసిద్ధి.(జల)

3.తిరుమల శ్రీనివాసుని క్షేత్రము (శిల)

ఈ మూడింటినీ కలిగినది కాశీ పట్టణము. ఈ ఒక్క మాట చాలు ఆపుణ్యక్షేత్ర ప్రకర్ష లేక మహత్తును తెలుపుటకు.

అట్టి కాశీని, కాశీనాథుని గూర్చి తెలుపుటకు శివుని మదిలో తలచుకొనుచూ, అల్పజ్ఞుడ నైన నేను వ్రాయ సమకట్టినాను. నాకోసము మీరు చదువనక్కరలేదు విశ్వనాథుని కొరకైనా చదువండి. భక్తితో చేసే పనులకు ఫలితముంటుంది.

గంగా నది ఒడ్డున జనులు నివసించిన “కాస్య, కాస, ఖాసా” అని పిలువ బడిన ప్రాంతము చివరకు “కాశీ” లు అయిన వారి నగరము ‘కాశి’ అయినది అని భాషా శాస్త్రజ్ఞులు చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఋగ్వేదం లో ”శున హోత్రుని మనుమడు” ”కాశి ”అనే వాని చేత నిర్మించ బడిన నగరం కనుక కాశీ అనే పేరు వచ్చి నట్లు వుంది .”హావెల్ ”పండితుడు క్రీ.పూ.1400 -1000  ప్రాంతం లో కాశీలు ఇక్కడే వుండే వారని వ్రాసినాడు. స్కాంద పురాణములో కాశీ పరమేశ్వరునిచే నిర్మింపబడినదని తెలియవస్తూ వున్నది. ‘కాశ్యాన్తు మరణాన్ ముక్తి’  "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" – అన్నది శాస్త్రవచనము. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది అని చారిత్రికులు భావిస్తారు. కాశి 5 క్రోసుల కైవారము కలిగిన క్షేత్రము. ఇందుకే దీనిని ‘పంచ క్రోశి’ అంటారు. ఇది నాటి పట్టణ వైశాల్యమును తెలుపుతుంది.

కవిసార్వభౌముడు శ్రీనాథుడు తన 'కాశీ ఖండమున -వివరించిన కాశి 'మాపన ప్రావిధి'

నేను శ్రీనాథుడు రచియించిన కాశీ ఖండమునుండి ఈ పద్యమును గైకొనుటకు ఒక ముఖ్య కారణము ఉన్నది. ఈ పద్యము కాశీని, విశ్వేశ్వరుని గూర్చి తెలుసుకొనుటకు ఒక కొలబద్ద. మాపన ప్రావిధి అన్న మాటకు కొలుచుట అనియే అర్థము. ఆ పద్యము ఏవిధముగా కొలబద్ద అన్నది గమనించుటకు ముందు పద్యము దాని భావమును చూద్దాము.

సీ. చక్రవాళ పరీత సర్వ సర్వంసహా

పరమ తీర్ధములలొ బెరువ కాశి

కాశికా పట్టణ క్రోశ పంచక తీర్ధ

సమితి లో సారంబు జహ్ను కన్య

జహ్ను కన్యా తీర్ధ సముదాయమున యందు

గడు బెద్ద మణికర్ణికా హ్రదంబు

మణికర్ణికా తీర్ధ మజ్జన ఫలము కం

టెను విశ్వనాధు దర్శన మధికమ్ము.

తే.గీ.    విశ్వపతి కంటె గైవల్య విభుని కంటె

గాలకంఠుని కంటె ముక్కంటి కంటె

దీర్ధములు దైవములు లేవు త్రిభువనముల

సత్యమింకను సత్యంబు సంయ మీంద్ర! (123)

తా. ఓ మహర్షీ! (సంయమము : అనుచితమైన, అహితమైన కోర్కెలకు ఆలోచనలకు కళ్ళెం వేసి ,ఉచితమైన వాటివైపు మనస్సును లగ్నం చేయడమే సంయమము . అది కలిగినవాడు సంయమి. అటువంటి వారిలో ఇంద్రునివంటి వాడు సంయమీంద్రుడు.) లోకాలోక సర్వ భూమండలము నందలి పరమ తీర్ధములలో కాశీ పెరువ అనగా గొప్పది. కాశికా నగర పంచ క్రోశ మధ్యమునందుగల తీర్ధ సముదాయములలో జహ్నవి సారభూతమైనది. జహ్నవీ తీర్ధ కదంబములలో మణికర్ణిక మిక్కిలి గొప్పది. మణికర్ణికా తీర్ధ స్నాన ఫలము కంటే, శ్రీ విశ్వనాధుని దర్శన ఫలము గొప్పది.కైవల్య నాధుడైన విశ్వనాధుని కంటే, కాల కంఠుని కంటే, ముక్కంటి కంటే అధికమైన తీర్ధములు,దైవములు భూర్భువస్సువర్లోకములు మూడింటి యందును లేవు. ఇది సత్యము. మరియూ సత్యము.

మొదట కాశీనాథుడగు విశ్వేశుని గూర్చి కొంత గమనిచుదాము. ఈ పద్యమున వరుసగా ఒకదానికంటే ఒకటి, ఒకదానికంటే ఒకటి గా ఏదేది పెద్ద అని చెప్పుకొంటూ పోయి చివరకు అన్నింటికన్నా విశ్వపతి అధికము. అట్టి విశ్వపతి మరియు ఆ విశ్వపతిని పరివేష్ఠించి యున్న తీర్థములు దైవములు తక్క ఈ త్రిభువనములలో వేరు అధికమగు ప్రస్తాపనే లేదు. ఇక కాశీ పట్టణము యొక్క కొలతల గూర్చి మాట్లాడుకొందాము. ఈ ప్రమాణము వ్యాసమహర్షి ‘స్కాంద పురా’ణాంతర్గత  ‘కాశీ ఖండము’ న వర్ణింపబడిన కాశీని గూర్చి మాట్లాడుచున్నాము అన్న విషయము మనము జ్ఞాపకము ఉంచుకొనవలసినది. అంటే ద్వాపరమునకు పూర్వమే, పట్టణములు ఉన్నవి అన్నది మనకు తెలియుచున్నది కదా! మరి వ్యాసులవారు స్కాందపురాణము వ్రాసినది ద్వాపరమునందే కదా! దీనిని బట్టి మన నాగరికత ఎంత పురాతనమైనది అన్నది ఒకపరి ఆలోచించండి. ఇక విషయమునకు వద్దాము.

‘కాశికా పట్టణ క్రోశ పంచక...’ అని పద్యము యొక్క రెండవ పాదములో తెలిపిన  కాశీ వైశాల్యమును గమనించుదాము.

అంటే వ్యాసులవారి కాలమునకు ఈ కాశీపట్టణము ఎంత విస్తారము కలిగియుండినది అన్నది మనము గమనించవలసియున్నది.

మిగిలినది మరొకసారి............................. 

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము-2వ భాగము

పూర్వ కాలముననే కొలతలను పరిమాణము (volume), చతురస్రము (Area), ప్రమాణము (length), ఉన్మానము (weight), గా మన పూర్వులు విభజించియున్నారు. వారికి వ్యాసము (Diameter), వ్యాసార్థము (Radius), π మొదలగు అనేక విషయముల గూర్చి, మనకు తెలిపినారని భ్రమపడుతున్న, నిన్న మొన్నటి ఆంగ్లేయులకన్నా వేల సంవత్సరముల లేక లక్షల సంవత్సరముల  పూర్వమే తెలుసు. ఈ విషయములను మనసున ఉంచుకొని నాటి కొలతల గూర్చి తెలుసుకొందాము.

భాస్కరాచార్యుడు-2 తన ఏకైక ప్రియపుత్రిక నామమున ‘లీలావతి’ యన్న గణిత గ్రంధమును రచించినాడు.

లియొనార్డ్ యులెర్(Leonhard Euler) (1707-1783) పేరుతో చతుర్భుజాలపై యులెర్ యొక్క చతుర్భుజ సిద్ధాంతము లేదా యులెర్ యొక్క చట్టము ఒక కుంభాకార చతుర్భుజము మరియు దాని కర్ణముల మధ్య ఉండే సంబంధాన్ని వివరిస్తుంది. ఇది సమాంతర చతుర్భుజము యొక్క సాధారణీకరణ, దీనిని పైథాగరియన్ సిద్ధాంతము యొక్క సాధారణీకరణగా చూడవచ్చు.  యులెర్  ఈ పైథాగరస్ సిద్ధాంత నిరూపణము సులభశైలిలో చేసిన రీతి భాస్కరాచార్య-2 నుండి తీసుకోన్నదేనేమో. ఎందుకంటే ఆయన యూలెర్ కన్నా ఎన్నో శతాబ్దములు ముందు వాడు, nx^2 + 1 = y^2 అన్న ఈ సమీకరణమును (Equation) ను పెల్స్ (Pell’s) సమీకరణము అంటారు. నిజానికి దీనిని ‘ భాస్కర సమీకరణము’ అనవలసి వుంది. ఎందుకంటే భాస్కరుడు దీనిని 12వ శతాబ్దములో  కనుగొనగా Pell దీనికి 19వ శతాబ్దములో తనపేరు పెట్టుకొన్నాడు కాబట్టి.

పైన తెలిపినది నేను చెప్పవలసినదానితో సంబంధము లేకున్నా మన శాస్త్రజ్ఞుల గొప్పదనము ఈ సందర్భముగా తెలియజేసినాను. వేదకాలము నుండి వచ్చు కొలతల విధానమును ఆయన ‘లీలావతి’లో శ్లోకరూపమున సూత్రీకరించినాడు. ఆసందర్భాములో ఆయన గొప్పదనము తెలుపుతూ పై విషయము చెప్పవలసివచ్చినది.

పై గ్రంధము కల్గిన ఈ రెండు శ్లోకములను పరికించండి.

యవోదరై రంగుళ మష్ట సంఖ్యైర్హస్తోంగులైః షడ్గుణి తైశ్చతుర్భిఃl

హస్తైశ్చతుర్భి ర్భవతీహ దణ్ణః క్రోశః సహస్ర ద్వితయెన తేషామ్||

స్యాద్యోజనం క్రోశ చతుష్ట యేన తథా కరాణాం దశ కేన వంశః

నివర్తనం వింశతి వంశ సంఖ్యైః క్షేత్రం చతుర్భిశ్చ భుజైర్నిబద్ధమ్||

అంశం                            అర్థం

4 యవోదరాలు      =1 అంగుళం

24 అంగుళాలు      =1 హస్తం

4 హస్తాలు             =1 దండం

2000 దండాలు      =1 క్రోసు (1 కోసు)

4 కోసులు              =1 యోజనం

(10 హస్తాలు            =1 వంశం (వెదురు) (బహుశ వెదురు కర్ర సగటు పొడవు 10 హస్తాలుగా తీసుకొన్నట్లు వుంది.)

(20 వంశాలు భుజం కలిగిన చతురస్ర వైశాల్యం అనగా 400 చదరపు వంశాలు=1 నివర్తనం)

ప్రతి యోజనము నాలుగు పరుగులు లేదా నాలుగు కోసులు. కోసు లేదా పరుగు ఎంత దూరం అన్న విషయం మాత్రం ప్రాంతాన్ని బట్టి రెండు మైళ్ళ నుండి రెండున్నర మైళ్ళ దాకా మారుతుంటుంది. రెండున్నర మైలు అంటే ఇంచుమించు ప్రతి యోజనము నాలుగు పరుగులు లేదా నాలుగు కోసులు. ‘క్రోశ’ లేక క్రోసు లేక కోసు లేదా పరుగు ఎంత దూరం అన్న విషయం మాత్రం ప్రాంతాన్ని బట్టి రెండు మైళ్ళ నుండి రెండున్నర మైళ్ళ దాకా మారుతుంటుంది అని పైన చెప్పుకొన్నాము . రెండున్నర మైలు అంటే ఇంచుమించు 3.2 కి.మీ. గా ఊహించ వచ్చును.  ఈ పంచ క్రోశి యాత్ర అన్నది మణికర్ణిక ఘట్టము నుండి మొదలవుతుంది. తిరిగి మణికర్ణిక చేరుట తో ముగుస్తుంది. పంచ క్రోశి అన్నది ఈ విధముగా  లేక్కింపబడుతుంది. చతురస్రము యొక్కభుజము ‘x’ అయితే   వైశాల్యము x2 . అవుతుంది అన్నది మనకు తెలిసిన విషయమే! అంటే కాశీ యొక్క విస్తీర్ణము 5x5=25 అవుతుందన్నమాట. ఈ లెక్క గమనించండి.

మణికర్ణిక నుండి కర్దమేశ్వర్ - 3 క్రో

కర్దమేశ్వర్ నుండి భీంచండి - 5 క్రో

భీం చండి నుండి రామేశ్వర్ - 7 క్రో

రామేశ్వర్ నుండి శివపుర్ - 4క్రో

శివపుర్ నుండి కపిల్ ధార - 3క్రో

కపిల్ ధార నుండి మణికర్ణిక - 3క్రో

మొత్తము 25 క్రోసులు. 1 క్రోసుకు 3.2 కి.మీ. అంటే 8౦ కి.మీ.

విశ్వేశం మాధవం డుండిం దందపాణిం చ భైరవంl

వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాంll

వారణాశి లోని అత్యంత ప్రధాన శివబృందము పైన శ్లోకములో తెలుపబడినది.

పైన తెలియ జేసిన వివరములు అన్నీ చదివిన తరువాత పాఠకులకు సహజముగా వచ్చే సందేహమేమిటి అంటే ద్వాదశ జ్యోతిర్లింగములలోని ప్రధాన జ్యోతిర్లింగమగు విశ్వేశ్వర జ్యోతిర్లింగమును గూర్చి తెలుపకుండా ఈ అవసరము లేని వివరములు ఎందుకు?

ఎందుకంటే నాటి కాశీ యొక్క కైవారము నేటి కొలతలో తెలిపితే కదా సాధారణ పాఠకునికి సాకల్యముగా సమగ్రముగా అర్థమయ్యేది. దీనివలన మనకు మనపూర్వులు అత్యంత ప్రతిభా సంపన్నులని తెలియుట లేదా! మనము పాశ్చాత్యులవద్ద బౌద్ధిక దాస్యము చేయనవసరము లేదు, అన్నది తెలుపుటకు, వ్యాసుని నాటి కాశీ వైశాల్యము నిర్దుష్టముగా తెలియజేయుటకు ఈ వివరమును వ్రాయవలసి వచ్చినది.

ఇతిహాసపురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించినారు. ఈ వాస్తవమును గమనించండి.

వారణాసీ పరిమాణము

తూర్పు దిక్కున "గంగానది" మధ్యభాగము, దక్షిణమున "అసీ" నది, పడమటి దిశయందు "పాశపాణి వినాయకుడు", ఉత్తరమున "వరణానది" అవధిగా కల్గి, ఆ మధ్యనున్న క్షేత్రము "వారాణసి". ఇది దివ్యమును విశేష ఫలసాధనమునైనది.

అవిముక్త పరిమాణము

విశ్వేశ్వర లింగమునుండి నాల్గు దిక్కులందు రెండువందల ధనుస్సుల పరిధిలోపల నున్న ప్రదేశము "అవిముక్తము". ఈ క్షేత్రమునందు ముక్తి అవశ్యము లభించును. ఏ మాత్రము సందేహము లేదు.

అంతర్గృహ పరిమాణము

తూర్పున "మణికర్ణికేశ్వరుడు", దక్షిణమున "బ్రహ్మేశ్వరుడు", పడమటి దిశ యందు "గోకర్ణేశ్వరుడు", ఉత్తరమున "భారభూతేశ్వరుడు" సరిహద్దులుగాగల క్షేత్రము "విశ్వనాథుని గృహము". ఈ క్షేత్రమునే "అంతర్గృహము" అందురు.

కాశి కంటె వారణాసి, వారణాసి కంటె అవిముక్తము, అవిముక్తము కంటె అంతర్గృహము పరిమాణములో చిన్నవి. అనగా కాశీపరిధి లోపల వారాణసి, వారాణసి పరిధిలోపల అవిముక్తము, అవిముక్తము పరిధిలోపల అంతర్గృహము నున్నవని గ్రహించవలెను.

మిగిలినది మరొక మారు.........

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము-3వ భాగము

 భూగోళము  అవతరించిన సమయము లో తొలి కాంతి కిరణం కాశీపై పడింది. అప్పటి నుండి జ్ఞానము మరియు ఆధ్యాత్మిక అంశాల నెలవుగా పుణ్య క్షేత్రమైన కాశీ పేరుగాంచినది. పురాణాలను అనుసరించి, దివోదాసుని కారణముగా, అనేక సంవత్సారాలు ప్రవాసంలో గడిపిన పరమశివుడు వారాణాసికి విచ్చేసి తన నివాసంగా మార్చుకున్నాడని ప్రతీతి. పది అశ్వాలతో కూడిన రథాన్ని దశాశ్వమేథ ఘాట్‌కు పంపడం ద్వారా బ్రహ్మదేవుడు భోళాశంకరునికి స్వాగతం పలికినాడు.


చరిత్ర పుట్టకముందు కాలం నుంచి దేవాలయం ఉన్నట్లుగా చెప్పబడింది. దేవాలయం ప్రాంగణంలోని భవన సముదాయాన్ని పునరుద్ధరించే నిమిత్తం 1776 సంవత్సరంలో అప్పటి ఇండోర్ సంస్థానపు మహారాణి అహల్యాబాయి భారీగా విరాళాలను అందించినారు. దేవాలయ ఊర్థ్వభాగంలో 16 మీటర్ల ఎత్తైన కలశ గోపురాన్ని నిర్మించేందుకు లాహోర్ మహారాజు రంజిత్ సింగ్ నేటి కోలా మానములో 1000 కేజీల స్వర్ణాన్ని విరాళంగా ఇచ్చినారని చెప్పబడింది. 1983 సంవత్సరంలో దేవాలయ నిర్వహణ బాధ్యతలను ఎంతో చక్కని పనితనం ఉట్టిపడే పట్టు చీరలు, ఇత్తడి పాత్రలు, ఆభరణాలు, చెక్కసామాను,


తివాచీలు, గోడకు వేలాడదీసే పటాలు, ఆకర్షణీయమైన దీపపు స్తంభాలు మరియు హిందూ, బౌద్ధ దేవతల బొమ్మలు విరివిగా లభించుతాయి. చౌక్, గొధౌలియా, విశ్వనాధ్ సందు, లహురాబీర్, థటేరి బజార్ ముఖ్యమైన బజారులు. పురాతనమైన వారణాశి నగరంలో నాలుగవ భాగం గంగాతీరంలోనే ఉంది.


వారణాసి క్షేత్రంలో వెలసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనాశ్లోకం చెప్తూ ఉంటారు.


సానందమానందవనే వసంతం, ఆనందకరం హతపాప బృందం


వారాణసీ నాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే!!


ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేని నా బలహీనతను గుర్తెరిగి, ఈశ్వరా, నీవే నన్ను నీవాడుగా స్వీకరించు’ అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే’ – ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేస్తున్నాను’ అని ప్రార్థన చేస్తారు. 


సనాతన ధర్మమున జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు. అసలు కాశి నేను రాను అన్నవాడు కాని, వెళ్ళనన్నవాడు కానీ ఉండడు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనినాడు ఈ పట్టణంలోకి ప్రవేశం చేయలేడు. మొట్టమొదట ఈలోకమునకు ఉపాసనా క్రమమును నేర్పడానికి నిర్గుణము నుంచి 


సగుణమై వెలసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. ఇది పార్వతీ పరమేశ్వరులకు మొట్ట మొదట కనపడింది. వీరు సృష్టి చేయడానికి వచ్చినారు. ఇపుడు వాళ్ళిద్దరూపరబ్రహ్మ స్వరూపూడగు పరమేశ్వరుని జూచి ‘మా కర్తవ్యమేమి?’ అని అడిగినారు.అపుడు ఆయన తపించండి’ అని చెప్పినాడు. నిర్గుణము నుండి సగుణమయిన తర్వాత ఆయన నోటి వెంట పలికిన మొట్టమొదటి మాట తపింపుడు అనేది. అప్పుడు ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగినారు. అప్పుడు ప్రపంచం అంతా నీటితో నిండిపోయి ఉంది. 


శంకరుడు వారణాసిని కలిగన భూభాగమును తన త్రిశూలముతో పైకెత్తి, ఇది ప్రపంచములోని మొదటి నగరమై వారణాసి గా ఖ్యాతిగాంచి, ప్రళయ కాలమున కూడా అకుంఠితముగా ఉండిపోతుంది అని శెలవిచ్చినాడు. అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి. చావడం పుట్టడం ఇంకొకటి తెలియక చచ్చి పుడుతున్న మనకు ఒక గురువు దొరికి ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేసినాడు. అందుచే కాశీ మోక్షపురి అయినది. కాశి భోగపురి కాదు. పాపరాశి దగ్ధమగుటకు శరీరంతో కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగిన వానికి ఈశ్వరుడు మోక్షం ఇస్తాడు.


కాశీ పట్టణానిది విచిత్రమైన స్థితి. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది. విశ్వేశ్వరుడు తీసివేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికి వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. అప్పుడు ఆ వ్యక్తీ మోక్షమును పొందాలి. ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అది జ్ఞానము ఇచ్చే క్షేత్రము. 


అందుకనే అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణం అయింది. అయిదు క్రోసుల కాశీపట్టణం సిద్ధం చేసి ఇక్కడ తపించండి అన్నాడు. శ్రీహరి కూర్చుని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేసినాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టిన చెమట ఆకాశంలో తెల్లటి రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడై ప్రవహించి వెడుతున్న నీళ్ళ వంక చూసి ఆశ్చర్య పోతున్నాడు. 


శ్రీమహావిష్ణువు శరీరమునుండి పుట్టిన తపో వ్యగ్రత చేత కలిగిన జలధార లోతయిన పల్లము ఏర్పడి అందులోనికి ప్రవహింప దోదగినది. ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలం ఒకటి జారి ఆ నీళ్ళలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే ‘మణికర్ణికా తీర్థము’గా ప్రఖ్యాతి చెందినది. బావి వలె యుండిన ఆ ప్రాంతము గంగాప్రవాహములో కలిసిపోయినా, పేరు 


చిరస్మరణీయముగా నిలచిపోయినది.


 ‘వారణ’ ‘అసి’ అని రెండు నదుల సంగమ క్షేత్రం వారణాసి. శంకరుని జటాజూటము మీద పడి అక్కడినుండి క్రిందకి ప్రవహించి వచ్చిన గంగానది ఒరిపిడితో ప్రవహించిన భూమి వారణాసి. అందులోంచి ప్రజాపతులు,


మనువులు, దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థన చేసినారు “‘ఈశ్వరా, ఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు 


కనుక నీవు విశ్వేశ్వర నామంతోను, విశ్వమునకు నాథుడవు గనుక విశ్వనాథుడను నామంతోను పిలవబడతావు’”అని అర్థించినారు. జ్వాజ్వాలాయ రూపుడగు శివుడు తక్షణము లింగరూపము దాల్చగా అది స్వయంభూ జ్యోతిర్లింగమయినది. 


ఈశ్వరుడు సృష్టి చేసినాడు. ఈ సృష్టి నిలబడుటకు ఆహారం అవసరము. అందుకు అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది. తన భర్త విశ్వభర్తయై అక్కడ


కూర్చుంటే అన్నపూర్ణయై తాను అందరికీ  అన్నము పెట్టడానికి ప్రకృతిగా మారింది.


మిగిలినది మరొక మారు.....



9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము-4వ భాగము

భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః’ అన్నారు వాల్మీకి రామాయణంలో. శంకరుని శరీరమును తాకి క్రింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది. గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలు పెట్టి వారణాసీ క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖి అయింది. మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడివడి జీవ స్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాము. ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం, దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానమునకు వెళ్ళడం. మనమందరమూ అలానే తిరుగుతున్నాము. మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది. గంగ కాశీలో ఉత్తరమునకు తిరిగింది. కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాం. పరమశివుడు మహాజ్ఞాని. ఆయన అనురాగమును నలుగురు చూరగొన్నారు – గౌరీదేవి, గంగాదేవి, కాశీపట్టణం, దాక్షారామం. కాశీ మోక్షపురి. పెద్దలయిన వారు ముందు సన్మార్గమున నడచి చూపిస్తే వెనకనున్న వాళ్లు దానిని అనుసరించి పావనులౌతారు. అందుకని వ్యాసుని అటువంటి పరీక్షకు నిలబడగలిగిన వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక ఏడురోజుల పాటు ఆయనకు అన్నము దొరకకుండా చేసినాడు. వ్యాసుడికి అక్కసు పుట్టింది. తనకు కాశీలో అన్నము దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు. కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా! వ్యాసుడు శాపజలమును పటుకోగానే గభాలున అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి ఒక  స్త్రీ మూర్తి బయటకు వచ్చి “నీ మనశ్శుద్ధిని లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టినాడు. కాశీని శపిద్డామనుకున్నావా? అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు. ఒకసారి గంగానదికి వెళ్లి స్నానం చేసి మధ్యాహ్నకాలంలో చెయ్యవలసిన సంధ్యావందనము చేసి శివలింగమునకు అభిషేకము చేసుకుని నీ శిష్యులతో రా. అన్నం పెడతాను’ అన్నది. వ్యాసుడు వెళ్లి గంగాస్నానం చేసి సంధ్యావందనం, అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చినాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూర్చున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనపడలేదు. ఈవేళ కూడా మనకు భోజనం లేదు, అని అనుకొని ఆపోశన నీళ్ళు చేత్తో పట్టుకునే సరికి పొగలు కక్కుతున్న అన్నం, కూరలు భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు అన్నిటితో నెయ్యి అభిఘారం చెయ్యబడిన విస్తరి కనపడింది. వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోశనం పట్టివేసినారు. అమ్మవారు వచ్చి ‘మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చుండమని చెప్పింది. వారు అలాగే కూర్చున్నారు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడావిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలి పొమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్లిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అపుడు శంకరుని తీసుకు వచ్చింది. అపుడు శంకరుడు ‘వ్యాసా, నీవు ప్రాజ్ఞుడవని, ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు నిలువలేకపోగా నాచేత నిర్మింపబడి కొన్ని కోట్లమందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసీ పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయినావు. కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో’ అన్నాడు. వ్యాసుడు అగస్త్య మహర్షితో చెప్పుకున్నాడు.

వెనక్కి తిరిగి బాధలో అయ్యో కాశీ విడిచి పెట్టి వెళ్లిపోవడమా? అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అపుడు వెనక నుంచి అమ్మవారు ‘వ్యాసా, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఆరాటపడినావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించవలెను. నీకు ఈశ్వరానుగ్రహము కలుగవలెనంటే, గంగకు ఆవలి ఒడ్డున చేరి పరమేశ్వరుని సేవించుకొమ్మని జగన్మాత పలికింది. తదాజ్ఞను ఔదల ధరించి వ్యాసుడు అచట నివాసము ఏర్పరచుకొనుటచే ఆ ప్రదేశమునకు ‘వ్యాస కాశీ’ అన్న పేరు స్థిరమైనది.

ఇక ఇక్కడ దివోదాసుని వృత్తాంతము క్లుప్తముగా తెలియబరచుతానుపూర్వము ఈ ప్రపంచమున అధర్మం పెరిగి ధర్మం సన్నగిల్లుతున్న సమయంలో సృష్టికర్తయైన చతుర్ముఖ బ్రహ్మ తిరిగి ధర్మస్థాపన చేయదలచి, ధర్మాత్ముడు, క్షత్రియ వంశజుడు అయిన రిపుంజయుడు బ్రహ్మనుద్దేశిచి యఙ్ఞం ప్రారంభించగా, అతని భక్తికి మెచ్చిన బ్రహ్మ అతని ఎదుట ప్రత్యక్షమయి 

" రిపుంజయా! ప్రపంచమున అధర్మమూ, అన్యాయమూ బాగా పెరిగి అల్లకల్లోలమైపోయింది  నీవు వెంటనే రాజ్య పాలన చేపట్టి, ఈ జగత్తుకు సార్వభౌముడవై పాలించుము’ అనగా అప్పుడు రిపుంజయుడు బ్రహ్మదేవుని " ఓ బ్రహ్మదేవా! మీ కోరిక మేరకు నేను రాజ్యపాలన చేస్తాను కానీ. నా రాజ్యమునకు కాశీ పురము రాజధాని కావాలి. నా రాజ్యములో దేవతలకు చోటు ఉండకూడదు. నేను సర్వంసహాదికారము కలిగి ఈ ధరాతలమును 

పరిపాలించుతాను’ అని అన్నాడు. బ్రహ్మదేవుడు ఈ షరతుకు సరేనంటూ కాశీని వీడుటకు విశ్వేశుని  మాత్రము ఒప్పించవలసి వస్తుందంటూ అంతర్థానమయినాడు. బ్రహ్మ మరియు ఇతర దేవతల విజ్ఞప్తులను త్రోసిపుచ్చలేక భారమైన హృదయముతో, ఈశ్వరీ సమేతమగు సకల పరివారముతో మంధర పర్వతమును చేరినాడు, కానీ మనసు కాశీని వీడలేదు. ఆనాటి నుండి రిపుంజయుడు దివోదాసుడనే నామముతో కాశీ నగర కేంద్రముగా ఈ ప్రపంచాన్ని పాలించుట మొదలుపెట్టినాడు. దివోదాసుడు తన రాజ్యాన్ని న్యాయబద్ధంగా, ఎటువంటి బాధలు లేక అద్భుతంగా పాలిస్తున్నాడు. తన రాజ్యానికి కావలసిన ప్రతి ఒక్కటీ తనే సృష్టిస్తూ తన ప్రజలను పోషించసాగినాడు. పరమేశ్వరుడు దివోదాసుడి కారణంగా కాశీలో అడుగే పెట్టలేకపోయినాడు. రోజరోజుకూ దివోదాసునికి గర్వం పెరిగిపోసాగింది. ఎలాగైన దివోదాసుని దారిలోకి తేవాలని నిర్ణయించిన పరమశివుడు పార్వతీదేవి రూపాలైన 64 మంది దేవతలను దివోదాసుని రాజ్యానికి పంపినాడు. కానీ కాశీ నగర సౌందర్యము మరియు దివోదాసుడి నీతిమంతమైన పాలన చూసి ఆ దేవతలందరూ ఏమి చేయలేక మరలిపోయినారు. ఈ విఫలయత్నం తరువాత పరమశివుడు సూర్యదేవుని పంపినాడు. సూర్యదేవుడు ఒక జ్యోతిష్యుని రూపములో కాశీకి చేరినాడు. కానీ ఆయన కూడా ఏమీ చేయలేకపోయినాడు.


మిగిలినది వేరొకమారు.........

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము-5వ భాగము


తరువాత బ్రహ్మదేవుడు ఒక సన్యాసి రూపంలో కాశీకి వళ్ళి దివోదాసుని చేత అశ్వమేధ యాగం చేయించినాడు. ఆ సందర్భమున చివరి ప్రయత్నముగా పరమేశ్వరుడు శ్రీమహావిష్ణువు తోనూ, తన కుమారుడైన గణపతితోను కలిసి ఒక ఉపాయము నాలోచించినాడు. దాని ప్రకారముగా వినాయకుడు కాశీ నగరానికి ఒక జ్యోతిష్యుడి రూపంలో అద్భుత మైన కాంతి పుంజంతో ఒంటి నిండా విభూతి రేఖలు, సింధూరపు రంగు పట్టు బట్ట, శాలువ ధరించి, లావుపాటి శరీరముతో దివోదాసుని రాజధానియగు కాశీని చేరినాడు. తన వాక్కు నిజం అవుతుందని చెప్పుతూ జనాన్ని ఆకర్షించినాడు. 


జరిగిందీ, జరుగుతున్నది, జరుగ బోయేదీ అన్నీ ఖచ్ఛితం గా చెప్పి అందరి మనసుల్ని ఆకట్టుకొన్నాడు. ఇలా వినాయకుడి జ్యోతిష ప్రతిభ రాజ ఆస్థానానికి కూడా చేరింది. రాణి కోరిక పై రాజు ఆయన్ను ఊరేగింపుగా ఆస్థానానికి గౌరవంగా రప్పించినాడు. వారి ఆతిధ్యాన్ని పొంది నాలుగు వేదాలు, 


సకల శాస్త్రాలు, పురాణాల విషయాలన్నీ వారికి బోధించి మెప్పు పొందినాడు వినాయకుడు. ఈ వినాయకుడే డుంఠి వినాయకునిగా కాశీన పేరు గాంచినాడు.  ఒక ఏకాంత ప్రదేశంలో డుంఠి వినాయకునితో చక్రవర్తి "మాకు ఈ ప్రజా పాలన తప్ప ఇంకా ఏమీ పని లేదా! ఏదైనా ఉంటె ఆజ్ఞాపిస్తే చేస్తాను" అన్నాడు. అప్పుడు డుంఠి మీరు సమయానికి తగ్గ మాటే అన్నారు. మీ లాగా ఇంతకు ముందెవ్వరూ ఇంత ధర్మబద్ధముగా, పరిపాలన చేయలేదు. భవిష్యత్తులో కూడా చేయబోరు. ఏది ఏమయినా వచ్చే రోజులు మంచివి కావు. నేటికి సరిగ్గా పద్దెనిమిదో రోజున మీ జీవితానికి ఒక సుముహూర్తం వస్తోంది. ఒక తేజో విరాజితుడగు బ్రాహ్మణోత్తముడు మీ దర్శనం కోరివస్తాడు. ఆయన చెప్పి నట్లు నడుచుకోండి. మీ జన్మ చరితార్ధమయ్యే రోజు ఆ రోజే. అని చెప్పి డుంఠి వేడలిపోయినాడు. శివాఙ్ఞ మేరకు కాశీ రాజైన దివోదాసుణ్ణి కాశీ నుండి పంపించివేయడానికి శ్రీ మహవిష్ణువే ఆ బ్రహ్మణుని రూపంలో కాశీకి వచ్చినాడు. ఆయన తన వేదాంతముతో, దివోదాసుని మనసును వైరగ్యం వైపుకు మరల్చగలిగినాడు. అప్పుడు దివోదాసుడు తన కుమారినికి రాజ్యమునప్పగించి తాను అడవులలోకి వెళ్ళి సమాధి చెంది శివునిలో లీనమయినాడు. అలా శివ కార్యం పూర్తి చేసిన నారాయణుడు, కాశీ నగర అందాలను చూస్తూ నగరమంతా విహరిస్తూ, అక్కడి గంగా తీరంలోని పంచగంగా ఘాట్ కు చేరుకున్నాడు. అదే సమయంలో ఆ ఘాట్ వద్ద 'అగ్ని బిందు' అనే పేరు గల ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. శ్రీ మహా విష్ణువును చూసిన అగ్ని బిందు భక్తి పారవశ్యంలో నారాయణుని పలు విధాలుగా కీర్తించి,స్తోత్రం చేసినాడు. మహర్షి అగ్నిబిందు భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ఋషిని ఏదైనా వరమును కోరుకొమ్మన్నాడు. అప్పుడు అగ్నిబిందు "నారాయణా! నీవు బిందుమాధవునిగా ఈ ప్రదేశంలోనే ఉండి భక్తులను అనుగ్రహించు." అని అన్నాడు. అగ్నిబిందునకు కోరిన వరమును ఇచ్చిన నారాయణుడు, తాను ఎప్పుడూ ఈ పంచగంగా ఘట్టముననే ఉంటానని అనుగ్రహించినాడు. 

పరమేశ్వరుడు తిరిగీ కాశీపతి అయినాడు.

మిగిలినది మరొక మారు...... 

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము-6వ భాగము

మనం కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కాలభైరవుని దర్శిస్తాము. కాలభైరవుని అనుగ్రహం ఉంటే తప్ప కాశీ పట్టణంలోకి ప్రవేశించలేము. ఈ కాలభైరవుడు ఎవరు? ఒకానొకప్పుడు బ్రహ్మగారికి అయిదు తలలు ఉండేవి. శంకరునికి కూడా అయిదు తలలు ఉండేవి. బ్రహ్మగారికి అహంకారము కలిగింది. తాను ఈశ్వరుడితో సమానమని అనుకున్నాడు. శంకరుని ధిక్కరించి మాట్లాడినాడు. వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుడిని సృష్టించినాడు. ఆ కాలభైరవుడు తన చిటికెనవ్రేలి గోటితో బ్రహ్మగారి అయిదు తలలలో ఒక తలను పువ్వును గిల్లినట్లు గిల్లివేసినాడు. ఆయనను అనగా కాలభైరవుని పరమేశ్వరుడు  వారణాసి పట్టణమునకు క్ష్ట్రేపాలకుని చేసినాడు.  కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం చాలా ఉత్తమము, అది యాత్రకు పూర్ణత్వమును చేకూర్చుతుంది. 

కాశీ పట్టణంలో సూర్యశక్తి ఒకచోట కేంద్రీకృతమై ఉన్నది. దీనిని లోలార్కుడు అని పిలుస్తారు. కాశీలో మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశములలో ఇది ఒకటి. ఈ విషయమును ఒక పాశ్చాత్యుడు ఎంత చక్కగా నిరూపించినాడో చూడండి.

US Colorado University Professor John M.Melville, (Astro Physicist),

అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞుడు, స్కాంద పురాణములోని కాశీ ఖండములో వర్ణించిన విధముగా రేఖాగణిత సహకారముతో తాను ఎంతయో శ్రమించి, విశ్వనాథ జ్యోతిర్లింగము కేంద్రముగా, 12 సూర్య మందిరములను ఎంతెంత దూరములో ఏ విధముగా నిర్మింపబడినాయి అన్న ఒక పటము గీచుకొని, అందలి నిజానిజములను పరిశీలించుటకై 1994 లో మనదేశములోని కాశీ నగరమునకు వచ్చుట తటస్తించినది. అక్కడ ఆయన వారణాశి హిందూ విశ్వవిద్యాలయమునండలి శ్రీ P B సింగ్ అన్న ఆచార్యుని కలసి ఆయనకు విషయమంతా చెప్పి సహాయము కోరినాడు.

అందులకు సమ్మతించి ఆయన John M Melville కి సహకరిప దొడగినాడు. ఇరువురు ఆ చిత్రపటము సహాయముతో మొత్తము కాశీ పురము తిరిగి కాశీ ఖండములో వున్న ఆలయములు, ఆయన చిత్రపటము ప్రకారమూ సరిగా అదే స్థానములలో యుండుట గుర్తించి అచ్చెరువందినారు.

Professor John తన వెంట cosmic energy (వైశ్విక చైతన్య శక్తి) కొలువగలిగే radars (మార్గ దర్శనులను) మరియు GPS (Global Positioning System) ల ద్వారా ఈ ప్రదేశములు ఉనికిని ఆయన తెలుసుకొనగలిగినాడు. అసలు ఈ GPS అంటే ఏమిటి అన్నది చాలా మితముగా తెలిపే ప్రయత్నము చేస్తాను తెలియని వారి కోసము.

ఏదైనా ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమించేది గ్రహం. గ్రహం చుట్టూ పరిభ్రమించే  

యంత్రపరికరాన్ని ఉపగ్రహం (Satellite) అంటారు అన్నది మనకు తెలిసినదే! భూమి చుట్టూ పరిభ్రమించేందుకు ప్రయోగించిన యంత్రాలను (Machines)

మనము  కృత్రిమ ఉపగ్రహాలుగా వ్యవహరిస్తూవుంటాము. ఇలాంటి కృతిమ ఉపగ్రహములెన్నో మన భూమి చుట్టూ, ఇతర గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఎన్నో రకాలుగా సేవలందిస్తూ ఈ కృత్రిమ ఉపగ్రహాలు మానవ 

వనరులై మన మేధస్సుకు అద్దము పట్టుచున్నవి. కొన్ని ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతూ వాతావరణానికి సంబంధించిన ఛాయాచట్రములు(Photographs) తీస్తూ ముందస్తు హెచ్చరికలు అందిస్తున్నాయి.  మరికొన్ని ఉపగ్రహాలు ఇతర గ్రహాలు,సూర్యుడు, కృష్ణబిలాలు (Black holes),ఫోటోలు తీస్తూ విశ్వ రహస్యాలను ఛేదించేందుకు తోడ్పడుతున్నాయి. చాలా ఉపగ్రహాలు అనేకములగు సంపర్క సమాచారములకు (Communications) ఉపయోగ  పడుతున్నాయి. మన ఇళ్ళలో కూర్చుని వేర్వేరు దూరదర్శని వాహినుల (TV Channels) లో వివిధ కార్యక్రమాలు (Programmes)  చూస్తున్నాము. ప్రపంచములోని నలుమూలల నుండి దూరవాణి పిలుపులకు (Phone Calls) కు, కలన యంత్రములకు (Computers)కు అంతర్జాలమునకు(Internet) అనుసంధానానికి ఎన్నో అవసరాలకు ఉపగ్రహాలే ఆధారము. గోళస్థాన గ్రాహకము (Global Positioning System) (GPS) అన్నది కూడా ఇందులో ఒక భాగమే! సమగ్రమైన పరిశీలన పరిశోధన జరిగిన తరువాత ఆయన తన అభిప్రాయమును ఈ విధముగా తెలియజేసినాడు.

Each of the 12 sun temples were located in such a way that it indicated the movement speed and intensity of light during the apparent movement of the sun across the 12 signs of zodiac.

సాపేక్ష సూర్య భ్రమణములో 12 రాశులలోనూ, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క నెల ఆయన ఉంటాడు అన్నది మనకు తెలిసిన విషయమే! ఆసమయములో సూర్యుని యొక్క కాంతి కదలిక, వేగము, తీవ్రత, ఆయా సూర్యదేవాలయము పై ప్రతిఫలించుచున్నదట. ఈ దేవాలయములను ఏ రాజూ కట్టించిన దాఖలాలులేవు. ఈ క్షేత్రము అత్యంత పురాణ ప్రసిద్ధము 

అయినది కాబట్టి ఈ దేవాలయాలు ఏ ఋషులు మునులు కట్టినవో అయివుందవలసినదే! 

మరి వారిలో ఇంత గణితశాస్త్రజ్ఞత వుండినది అంటే ఎన్నివేల సంవత్సరముల క్రిందటనే మనవారు ఎంతటి విజ్ఞాన ప్రజ్ఞావంతులో తెలియవస్తూ వున్నది.

Professor John M Melville తన ఆశ్చర్యమును ప్రకటించుతూ ఈ విధముగా అంటూవున్నాడు. 

It is a mystery how the ancient Indians had fixed the site for these temples by mathematical calculation, through intuition or meditation.

అంటే  ఈవిధముగా ప్రత్యేకతను సంతరించుకొన్న స్థలములను, ఆ మహనీయులు ఎటువంటి యంత్ర పరికరముల సహాయము లేకనే, గుర్తించుటకు కారణము, భారతీయుల గణితశాస్త్ర 

విజ్ఞానమా, ధ్యానమా లేక జ్ఞానమా! అన్నది అర్థముకాక బ్బురపడుచున్నానన్నాడు. నిరంతర ధ్యాన మగ్నము కల్గిన సాధకునికి 

‘రుతంభర ప్రజ్ఞ’ అన్నది అలవడుతుందట. అది ఇటువంటి మహత్తర శక్తులను సాధకునికి కలుగజేస్తుంది. అట్టి మహానుభావులకు, ఇటువంటి ప్రతిభ అతీంద్రియ జ్ఞానము ద్వారా అబ్బుతుందని మన శాస్త్రములు తెలియజేయుచున్నాయి.

ఈ విషయము తెలిసిన తరువాతనైనా పాఠకులు తమకున్న పరిధిలో పదిమందికి తెలియజేసి మన దేశమునకు, మన ఋషులకు వాసి వన్నె తెస్తారని ఆశించుతాను.

మరొకమారు మరికొంత..........

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము-7వ భాగము

తులసీఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసీఘాట్ ఎదురుగుండా ఉన్నగోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది. ద్వాదశాదిత్యుల శక్తి ఆ చక్రం మీద ఉంది. ఎప్పుడెప్పుడు కాశీ వెడదామా అని తాపత్రయపడి కాశీ వచ్చి వెలసిన సూర్యశక్తి అక్కడ ఉన్న చక్రం మీద ఉన్నది. కనుక దానిని లోలార్కుడు అని పిలుస్తారు. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ – తులసీ ఘాట్ గోడమీద ఉన్న లోలార్క బింబమునకు, ఆ చక్రమునకు గంగాస్నానం చేసి నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది అని అనుభవించినవారి నమ్మకము.

కాశీ పట్టణమును వారాహి కూడా రక్షిస్తుంది. రాజేంద్రప్రసాద్ ఘాట్లో స్నానం చేసి ప్రక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే అక్కడ మీకు వారాహి దేవాలయం కనపడుతుంది. వారాహి సరస్వతీ స్వరూపం. అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వ సైన్యాధిపతి. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీ పట్టణంలో తిరుగుతుంది. ఇక తెల్లవారుతుందనగా ఇంకా చీకటి ఉండగానే మరల దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీ పట్టణంలో వారాహి మూర్తి చాలా ఎత్తు ఉంటుంది. అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారు ఝామున బిక్కుబిక్కుమంటూ వెళతారు. అసలు అమ్మవారిని పైనుంచి క్రిందకు పూర్ణంగా చూడలేరు. అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపలే పూజ పూర్తిచేసి నైవేద్యం పెట్టేస్తారు. ఆవిడ పగటిపూట పడుకుంటుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం కప్పు(Slab) మీద కన్నములుంటాయి. కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంది. మీరు పూర్ణంగా చూడలేరని, అలా చూడడానికి శక్తి సరిపోదని మిమ్మల్ని దేవాలయంలోకి పంపరు. అందుకని మీరు వారాహిని పైన కన్నంలోంచి మాత్రమేచూడవలసి ఉంటుంది. వారాహి కదిలే తల్లి. ఆ వారాహీ దర్శనమును మీరు వారణాసీ పట్టణంలో చెస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది. వారాహి వీర్యసమృద్ధిని ఈయగలిగిన తల్లి. కేవలం కామ్యముచేత నష్టం అయిపోకుండా ఈశ్వరానుగ్రహం వైపు బుద్ధి శక్తిని ప్రవేశపెట్టగలిగిన తల్లి.

 కాశీలోని దర్శనీయ స్థలములలో ఆదికేశవుని ఆలయం. ఎన్నో విష్ణ్వాలయములు ఉన్నాయి. కానీ మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరుచుకున్న విష్ణ్వాలయమునకు ఆదికేశవాలయం అని పేరు. దానిని ప్రతిఒక్కరూ దర్శనం చేసుకోవాలి.

తరువాత డుంఠి గణపతిని దర్శించాలి. సాధారణంగా గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. కానీ ఒక్క కాశీ పట్టణంలో ఉన్న డుంఠి గణపతి తొండం ఎడమవైపు తిరిగి ఉంటుంది. ఎడమ వైపు తొండం తిరిగి ఉన్నవాడు కాబట్టి డుంఠి గణపతి అని పేరు. డుంఠి గణపతి దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి.

అక్కడ హరికేశుడు అనే ఒక యక్షుడు ఈశ్వరానుగ్రహం చేత ప్రమథగణములలో చేరి, ప్రమథగణములకు నాయకుడై రెండవ క్షేత్రపాలకునిగా ఆ స్థితిని పొందినాడు. ఆయన చేతిలో వెండి కట్టుతో ఉన్న బెత్తం పట్టుకుని ఉంటాడు. విభూతి పెట్టుకుని రుద్రాక్షలను సవరించుకుంటూ ఉంటాడు. పాపాత్ములకు భయంకరంగా కనపడతాడు. ఈశ్వర భక్తులకు ప్రసన్నమూర్తిగా కనపడుతాడు.

కాశీవిశ్వేశ్వర క్షేత్రంలో ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మంటపం అని ఒక మంటపం ఉంది. కాశీకి సంబంధించిన చిత్రం ఏమిటంటే విశ్వేశ్వరుడి దర్శనం చేసి అక్కడే ఉన్న గంగలో ఉన్న నీళ్ళు తీసుకు వెళ్లి, ఆయన తలమీద పోసేస్తే చాలు, ఆయనకు ప్రత్యేకముగా వేరేమీ తీసుకు వెళ్ళనవసరం లేదు. మనం అక్కడి ముక్తి మంటపంలో కూర్చుని ఏదో ఒక శివకథ చెప్పుకుని వారణాసి విడిచిపెట్టాలి అన్నది ఒక నియమము. వారణాసి ఊరికే వెళ్లి వచ్చేయడం కాదు. మణికర్ణికా ఘట్టంలో స్నానము భక్తులకు తప్పనిసరి.

వారణాసి గురించి చెప్పుకున్నప్పుడు తప్పకుండా రెండింటిని గురించి ప్రస్తావన చేయవలసి ఉంటుంది. కాశీలో మనము విశాలాక్షి అమ్మవారిని తప్పక దర్శనము చేసుకొనవలసి యుంటుంది. అక్కడే మహానుభావుడు శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు. కాశీవిశ్వేశ్వరుడి దేవాలయంలోంచి బయటకు వస్తే ఎడమ ప్రక్కన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలోకి లోపలికి వెళితే కుడిచేతి పక్క ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. ఆ శ్రీచక్రంతో కూడిన శివలింగమును తన చేత లలితా సహస్ర స్తోత్రమునకు భాష్యం అమ్మవారు వ్రాయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యులవారు ప్రతిష్ఠ చేసినారు. దానియందు అయ్య, అమ్మ కలిసి ఉన్నారు. ఆ శివలింగం దగ్గరకు వెళ్లి నమస్కరిస్తే ఆ తల్లి ఎంతగానో పొంగిపోతుందట.

‘కాశ్యాంతు మరణాన్ ముక్తిః’ – కాశీలో చనిపోతే చాలు మోక్షం వస్తుంది. ఆయుర్దాయముముగిసి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టి అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్న స్థితిలో మరణించునాతడు బెంగ పెట్టుకోకుండా ఉండడానికి గానూ పార్వతీదేవి వాని వద్దకువచ్చి కూర్చుని తన పమిటతో ఆ తనికివిసురుతుంది. వాడు సేదతీరి ఏ బాధలేని స్థితిని పొందుతాడు. అప్పుడు డుంఠి గణపతి వచ్చి పక్కన కూర్చుని ఊపిరి అందక కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర తడిపెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాడు. అపుడు ఆ వ్యక్తి ఎంతగానో సేదతీరుతాడు. భృంగి వచ్చి లలాటమునందు మంచి సువాసనలు వెదజల్లే మారేడు దళములను నాసికము వద్ద ఉంచుతాడు. స్వామివారు వచ్చి నవ్వుతూ చూస్తారు. అలా అవసాన దశకు చేరుకొని వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతమునకు స్వామి కుడిచెవిలో ప్రణవమును ఉపదేశం చేస్తాడట. ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయన యందే లయమవుతున్నాయి. జన్మ జన్మల పాపములను నశింపజేయగలిగిన కాశీ మన భరతఖండంలో ఉంది. అది ఎన్నో ప్రాణులు ఈశ్వరునిలో కలిసిపోవుటకు దోహదపడుతున్న దివ్యక్షేత్రము. సర్వ జగత్తు లయం అయిపోతున్నా తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమ పావనమయిన భూమి.

సానందమానందవనే వసంతం ఆనందకందం హృత్ పాపబృందంl

వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యేll

మరొకమారు 8వ భాగము -------

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము – 8వ భాగము

మహమ్మదీయ పాలకుల దేవాలయ పైశాచిక విధ్వంసకాండ

క్రీ.శ 1194 లో, ఒట్టోమన్ ముస్లిం ఆక్రమణదారుడు కుతుబుద్దీన్ ఐబాక్ పాలనా కాలములో కాశీలోని అనేక  ఆలయాలు కూల్చివేయబడినాయి. ఈతని తరువాత పాలించిన ముస్లిముల కాలములో కూడా ఎన్నో ఆలయాలు విధ్వంసము కాబడినాయి.  విద్యా రాజధానిగా వారణాశి మధ్యయుగ కాలంలో కూడా  ప్రసిద్ధి చెందియుండినది. ఫిరోజ్ షా క్రీ.శ 1376 లో మిగిలిన పురాతన మందిరాలను, క్రీ.శ 1496 లో సికందర్ లోధి చేత కూల్చివేయించినాడు. ఈ సమయంలో సూఫీ ఉద్యమము ప్రారంభమయి  అతిపెద్ద శాంతిదూతలుగా పరిగణించబడిన కబీర్ దాస్  మరియు సంత్ రవిదాస్ గారలు  హిందూ-ముస్లిం ఐక్యత కొరకు ఎంతో కృషి చేసినారు.       

కాశీ విశ్వేశ్వరాలయము-జ్ఞానవాపి మసీదు

కోల్కతా లోని ఏషియాటిక్ లైబ్రరీ లో మనము 1669 లో ఔరంగజేబు తనసేనానికి, కాశీ విశ్వనాథుని ఆలయము ధ్వంసము చేయ ఇచ్చిన ఫర్మానా చూడవచ్చు.  ఆతని ఆజ్ఞ ప్రకారమే మందిరము ద్వంసముజేసి అదేచోటున మసీదు కట్టటము సంభవించినది. ఆసమయమున విశ్వనాథ భక్తుడగు పూజారి స్వామి జ్యోతిర్లింగమును గుండెకు ఆనించుకొని జ్ఞానవాపి (అనగా జ్ఞాన దాతయగు బావి) లో దూకినాడట. అందుచే అసలయిన జ్యోతిర్లింగము ఇప్పటికీ జ్ఞానవాపిలోనే ఉండిపొయినది. కానీ ఆ బావి మసీదు యొక్క ప్రాకారములో ఉన్నది. ఇప్పటికీ, ఇప్పుడున్న మందిరములోనే నిలిచిపోయిన నంది, మసీదు కట్టడము మునుపు విశ్వనాథ లింగము ఉన్న స్థానము వైపే చూచుచుండుట  మనము చూడవచ్చు. అసలు కాశీ అన్న పేరునే తొలగించి ‘మొహమ్మదాబాదు’ అన్న పేరును ఆ పట్టణమునకు పెట్ట ప్రయత్నిచినాడు ఔరంగజేబు  కానీ ఆతని పప్పులు ఉడకలేదు. ఈ సందర్భముగా కవిరాజ్ చంద్రభాన్ కాశ్మీరీ, ఔరంగజేబుకు ఒక లేఖ ఈవిధముగా వ్రాసినాడు “ఏ శహన్ షా మేరె మందిర్ కా కరిష్మా దేఖ్. ఇస్ కే గిర్నేకే బాద్ భీ తేరే ఖుదా కా ఘర్ బంతా హై”. ధైర్యముగా ఔరంగాజేబునకే ఎంత గొప్ప మాట వ్రాసినాడో చూడండి. పడగోట్టించిన ఆలయమును 108 సంవత్సరముల తరువాత ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ కట్టించినది. కాష్మీరునకు రాజయిన రంజీత్ సింహుడు 1853 లో తాను సిఖ్ఖు మతస్థుడయి ఉండి కూడా గోపురములకు బంగారు తాపడము చేయించినాడు. ఇప్పటికీ ఈ గుడి మసీదు ప్రక్కన నిలిచి మన దుర్భాగ్యమును గుర్తుచేస్తూనే ఉన్నది. చీనా యాత్రికుడు యువాన్ త్సువాంగ్ క్రీ.శ. 627-642 ల నడుమ మన దేశమును సందర్శించినపుడు వ్రాసిన ‘కాశీయాత్ర ఉపాఖ్యానము’ లో  నూరడుగుల ఎత్తు మందిరములో కాశీనాథుని జ్యోతిర్లింగము విరాజమానమాయి ఉండినట్లు తెలియవచ్చుచున్నది. ఇది చాలదన్నట్లు మహమ్మదీయులు లో మసీదుకు చుట్టూ ఉన్న ప్రాంతమంతా తమదేనని కోర్టు లో వ్యాజ్యము వేసినారు. 1936 లో చారిత్రిక ధార్మిక వాస్తవిక ఆధారాల కారణముగా ఈ వ్యాజ్యము వీగి పోయింది. ముస్లీములు హై కోర్టుకు పోయినా 1942 లో వారి తీర్పు కూడా వారికి ప్రతికూలముగానే వచ్చినది.

1669 లో ఔరంగజేబు వారణాసి మీదుగా, తనకు తోడుగానున్న హిందూ మిత్ర రాజులతో కూడి బంగాల్ పోతూ వుండినాడట. హిందూ రాజ పత్నులు వారణాశి లో గంగా స్నానము చేయ సంకల్పించుట చేత ఒక 5 మైళ్ళ దూరములో మజిలీ వేయ ఆజ్ఞాపించినాడట ఉదాత్త హ్రుదయుడగు ఔరంగజేబు. రాజ పత్నులు పల్లకీలలో వెళ్లి స్నానాదులు చేసి తిరిగీ స్థావరము చేరి చూస్తే కచ్చ్ రాణి తిరిగిరాలేదన్న సంగతి గ్రహించినారట. అపుడు ఔరంగజేబు తన సేనానాయకుని పనిచి ఆమెను వెదకి పిలుచుకురమ్మని చెప్పినాడట.

అతను ఆలయమునకు వెళ్లి రాణి కొరకు వెదకుతూ వుంటే ఆమె అతనికి ఒక మూలాన ఎక్కడో ఏడుస్తూ కనిపించినదట. ఆతను కారణమడిగితే విశ్వనాథుని మందిర అర్చకుడు తన శీలమును దోచుకొన్నట్లు చెప్పినదట. ఆమాటను ఆ సేనానాయకుడు ఔరంగజేబు చెవిని వేసినంతనే, అతడు ఆగ్రహోదగ్రుడై మందిరమును ధ్వంసము చేయించి మసీదును నిర్మింపజేసినాడట.

మార్క్సిస్టులు మహమ్మదీయులు కల్పించిన ఈ కట్టు కథలోని నిజానిజాలను ఒకపరి పరికించుదాము.

1.       బ్రాహ్మణ అర్చకులు ఎప్పుడూ సత్వగుణ సంపన్నులు. అందులోనూ దేవాలయ ప్రాంగణములో, అందులోను విశ్వనాథ జ్యోతిర్లింగము సమక్షమున ఇంత నీఛ కార్యమునకు గడంగుతాడా? అసలు అట్టి నీచుని గుణము సాటి అర్చకులకు ముందే తెలిసి ఆతనికి ఉద్వాసన చెప్పియుండరా!

2.    భక్తుల రాకపోకలు జరుగు సమయములో ఆ అర్చకునికి అసలు ఏకాంతము ఎట్లు లభించింది. దేవాలయములో రహస్య ప్రదేశములు ఉండవు కదా!

3.    ఇక ఆరాణి రాలేదన్న వెంటనే ఆమె భర్త స్వయముగా తాను బయలుదేరి పోడా? ఎవరో పరాయి వాడిని పంపుతాడా!

4.    హిందూరాజులు, ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఆలయమునే విద్వంసము చేయమని చెబుతారా? అట్లు చెప్పుటయే గాక ఆస్తలములో మసీదు కట్టించమని కోరుతారా?

5.    ఈ విషయమునకు సంబంధించిన చారిత్రిక ఆధారము ఇప్పటివరకూ ఏదయినా దొరకినదా!

6.    కోల్కతా లోని ‘ఏషియాటిక్ లైబ్రరీ’ లో ఏప్రిల్ 1667 లో ఔరంగజేబు మందిర విధ్వంసము చేయుటకు నొసగిన ఆదేశపత్రము అతని అవినీతికినీ అతని దుష్ట బుద్ధికినీ నిలువుటద్దమై నిలుచుచున్నది. మరి 1669 జరిగినట్లు చెప్పబడే పై కాకమ్మ కథ అవాస్తవమని మనకు అర్థమగుట లేదా!

ఇందులోని ఏ సందేహమునకూ జవాబు లేకుండా ఈ కాల్పనిక కథను నమ్మ వీలవుతుందా!

9వ భాగము మరొకమారు.......
9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము – 9వ భాగము

బిందుమాధవాలయము-ఆలంఘీర్ మసీదు

ఇప్పటి వరకు దొరకిన చారిత్రిక ఆధారాల ప్రకారము బిందు-మాధవ ఆలయం - “క్రీ.శ. ఐదవ శతాబ్దము  నుండి వారణాసిలోని అతి ముఖ్యమైన విష్ణు ఆలయము,  మత్స్య పురాణములో, ఆది కేశవ దేవాలయముతోబాటూ, వారణాసిలోని ఐదు ముఖ్యమైన తీర్థాలలో ఇది కూడా ఒకటిగా పేర్కొనబడింది. ఇది ప్రాకృతిక భీభత్సములు జరిగిన ప్రతిసారీ పునర్నిర్మించబడినది.  16 వ శతాబ్దంలో అంబర్‌కు చెందిన రాజా మాన్ సింగ్ నిర్మించిన గొప్ప ఆలయంలో తిరిగీ బిందుమాధవుని పునఃప్రతిష్ఠ ఘనంగా జరిగినది.

రంజాన్  నెల 20/13 సెప్టెంబర్ 1682, రికార్డుల ప్రకారము, ఈ ఆలయాన్ని కూల్చివేసి, ఇక్కడ ఒక మసీదును నిర్మించమని ఔరంగజేబు

ఫర్మాన్ జారీ చేయుట జరిగినది. ఈ జారీ చేసిన, పర్షియన్ భాషలోని, ఫర్మాన్ ను దేవాలయము యొక్క స్థానములో కట్టించిన మసీదుకు ఎడమ వైపు  నేటికీ చూడవచ్చు. ఫర్మాన్ అందుకొన్న బనారస్ దివాన్ రఫీ-ఉల్-అమిన్, ఆలయమును నేలమట్టము చేసిన తరువాత  "ఆదేశాలకు అనుగుణంగా,  నంద్-మాధో (బిందు-మాధవ్) ఆలయాన్ని కూల్చివేసినట్లు నివేదిక పంపుతూ ఈ వ్యవహారమును గూర్చి ఇంకా ఆదేశాలకై  ఎదురు చూస్తున్నట్లు తెలియజేసినాడు. అక్కడ ఒక మసీదు నిర్మించాలని చక్రవర్తి ఆదేశించినాడు. ఆ ఆదేశముల మేరకే ఆ మసీదు కట్టించబడినది. దీనిని ఆలంఘీర్ మసీదని, ధరేరా మసీదని అంటారు.

ప్రస్తుత ఆలయాన్ని 19 వ శతాబ్దంలో ఔంధ్ (సతారా, మహారాష్ట్ర) రాజా నిర్మించారు. ఈ ఆలయం దక్షిణ భారతీయులలో ఎంతో గౌరవించబడింది; బిందు-మాధవ దేవాలయమును  దక్షిణ భారతదేశములోని విష్ణు-కంచిగా భక్తులు గౌరవిస్తారు. ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు, ముఖ్యంగా మార్చి నెలలో.  

బిందు మాధవ విగ్రహము నేడు ఆలయచ్ఛాయలే లేని  ఒక సాధారణ గృహములో వెలసియున్నది, భవనం యొక్క వెలుపలి భాగం వారణాసి సందులలోని ఇతర ఇళ్ళలాగానే  ఉంటుంది. ఎటువంటి అలంకారాలూ లేని విశాలమైన గదిలో సాలిగ్రామ శిలతో తయారు చేయబడిన ఈ విగ్రహము ప్రతిష్ఠింపబడి యుంటుంది.

'అన్నపూర్ణ ఇంటిలోనే అన్నమే కరువాయెనా' అన్నట్లు ధర్మబద్ధమగు మన దేవాలయములను పడగొట్టి మసీదులు కట్టించుకొన్నా, వంటి మీద వాలిన ఈగవలె దులుపుకొంటున్నాము.

 కాశీపుర ప్రాధాన్యత ప్రత్యేకత

విశ్వేశం మాధవం ఢుండిం దండపాణించ భైరవంl

వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాంll

కాశీ ప్రపంచానికి అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక సుందర నగరము మరియు ఆధ్యాత్మిక రాజధాని. స్వయంగా పార్వతీ సమేతుడై శివుడు స్వయంగా నివాసముంటాడని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి.  ప్రళయకాలంలో కూడా మునుగని అతి ప్రాచీన పట్టణము. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పై కెత్తి కాపాడతాడని ప్రతీతి. కాశీ భువి పై ఉన్న సప్త మోక్షదాయక క్షేత్రములలో అతి ముఖ్యమైనది మరియు ద్వాదశ జోతిర్లింగాలలో శ్రేష్ఠమైనది.  కాశీలో గంగా స్నానం, మొదట విశ్వనాథుడు, బిందు మాధవ దర్శనం, డుంఠి గణపతి, దండపాణి, కాలభైరవ దర్శనము అత్యంత శ్రేయస్కరము.  ఒకప్పుడు 72 వేల ఆలయములు కల్గిన కాశీ క్షేత్రము, స్కందుడు, గంగానది, అమ్మవారు అన్నపూర్ణ, మణికర్ణికా ఘట్టము అత్యంత ప్రాముఖ్యమయినవని పైన చెప్పిన శ్లోకము తెలియజేయుచున్నది. లోకమాత  విశాలాక్షి కూడా అత్యంత దర్శనీయమయిన మహిమాన్విత విగ్రహము.  

1. కాశీ విశ్వనాధుని దేవాలయము 2. అన్నపూర్ణాలయము 3. విశాలాక్షి ఆలయము 4. కాల భైరవాలయము 5. మృత్యుంజయేశ్వరాలయము 6. సారనాథ్ మందిరము 7. వ్యాస కాశి 8. దండపాణి మందిరము 9. చింతామణి గణపతి మందిరము 10. బిర్లా మందిరము 11. సంకట విమోచన హనుమాన్ మందిరము 12. శ్రీ త్రిదేవి మందిరము 13. దుర్గా మందిరము 14. తులసి మానస మందిరము 15. గవ్వలమ్మ మందిరము 16. కేదారేశ్వర మందిరము 17. తిలబండేశ్వరాలయము 18. జంగన్ వాడి మఠ్ 19.గంగా హారతి 20. బిందు మాధవుడు 21. వారాహిదేవి 22. దత్తమందిరము (దత్తపీఠము ) ఇలా కాశీలో ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. ఇవి అతి కొంచెము మాత్రమే. మానవ శరీరములోనే 72 వేల నాడుల ప్రతీకగా ఇక్కడ 72 వేల మందిరములు వెలసియుండేవట.

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడని అంటారు. కాశీలో మరణించిన వారికి యమ బాధ తప్పి పునర్జన్మ ఉండదట.  డుంఠి గణపతి, కాలభైరవుడు కాశీలో మరణించిన ఒక్కొక ప్రాణి యొక్క చిట్టా చిత్రగుప్తుని వద్దనుండి తెప్పించుకొని పరిశీలించి యమ యాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తారట. కాబట్టే కాశీలో కాలభైరవ దర్శనం తరవాత పూజారులు వీపుపై కొట్టి, దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా, పాపాలు అంటకుండా రక్షగా నల్లని కాశీ దారం కడతారు. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. కాబట్టే జీవిత చరమాంకమును చాలా మంది కాశీలో గడుపుతారు. మరణించిన వారి అస్తికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే మోక్షప్రాప్తిని పొందుతాడు.

గోముఖం నుండి బయలు దేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘట్టముల (ఘాట్) దూరం జరగలేదు. కాశీ లో కొన్ని వింతలు : కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలకు వాసన పట్టదు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న చిన్న దులు, గొందులు కలిగి ఆ సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికి జాడ దొరక కుండా ఉంటుంది. కారణము ఏమిటంటే దేవాలయములు ముస్లిముల వాత పడకుండా ఉండుటకు. అయినా వారి దౌష్ట్యానికి దేవాలయములు విద్వంసము కాక తప్పలేదు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీలో అనేక పరిశోధనలు జరిపి ఆశ్చర్య పోయినారు. అప్పటి తపస్సంపన్నులు శక్తి పాతము వున్న చోటల్లా మందిరాలు నిర్మించినారు. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది. విశ్వనాథుని అభిషేకించిన తరవాత భక్తుల చేతి రేఖలు మారి పోతాయని అంటారు. విశాలాక్షి అమ్మవారిది శక్తి పీఠము. జగమంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశీ. ప్రపంచంలో అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీ లో వున్నది. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు, ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి అందులో కొన్ని :- 1) దశాశ్వమేధఘాట్:- బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. ఇప్పటికీ రోజూ సాయంకాల సమయంలో విశేషమైన గంగా హారతి జరుగుతున్నది. ఈ హారతి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఎంతటి వారికైనా ఇక్కడ భక్తి పరవళ్ళు తొక్కుతుంది. ప్రయాగ్ ఘాట్: ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా, సరస్వతి నదులు కలుస్తాయి. 3) సోమేశ్వర్ ఘాట్: చంద్రుని చేత నిర్మితమైనది. మీర్ ఘాట్: సతీదేవీ కన్ను పడిన స్థలం. ఇక్కడే యముడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. 

నేపాలీ ఘాట్:- పశుపతినాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు. 

మణి కర్ణికా ఘాట్: ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించినాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట. 

విశ్వేశ్వర్ ఘాట్:  ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్య తప్పస్సు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుని దర్శిస్తారు. 

పంచగంగా ఘాట్: ఇక్కడే భూగర్భం నుండి గంగలో ఐదునదులు కలుస్తాయి. గాయ్ ఘాట్: ఇక్కడ గోపూజ జరుగుతుంది. 

తులసి ఘాట్: తులసిదాస్ సాధన చేసి రామచరితమానస్ లిఖించమని శివుని ఆదేశం పొందిన స్థలము. 

హనుమాన్ ఘాట్: ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వానర రూపములో వస్తుంటాడని అంటారు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండము ఉన్నది. ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించినారు. 

అస్సిఘాట్: పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపిన ఖడ్గమును ఇక్కడ వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థంగా ఉద్బవించింది.  

హరిశ్చంద్రఘాట్: సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహనం చేసే కూలీగా పని చేసి, దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు, ఈ రోజు వరకు కుడా ఇక్కడ ఎప్పుడూ శవాలను కాలుస్తూ ఉంటారు. 

మానససరోవర్ ఘాట్: ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుందని ఐతిహ్యము. 

నారద ఘాట్: నారదుడు లింగం స్థాపించినాడు. 

చౌతస్సిఘాట్: ఇక్కడే స్కందపురాణం ప్రకారం 84 యోగినిలు తపస్సు చేసినారు. ఇది దత్తాత్రేయునికి ఇష్టమైన స్థలం, ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 84 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయని అంటారు.  

రాణామహల్ ఘాట్: ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నము చేసుకున్నాడని అంటారు. 

అహల్యా బాయి ఘాట్: ఈమె కారణం గానే మనం ఈ రోజు కాశీ విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము. కాశీ లోని గంగానది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి. పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది. కానీ మహమ్మదీయుల దండ యాత్ర కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసినారు ఎంతో సుందరంగా ఉండే క్షేత్రాన్ని విద్వంసం చేయగా మిగిలిన కాశీని ప్రస్తుతం మనము చూస్తున్నాము. కాశీ. విశ్వనాథ, బిందు మాధవముతో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చివేసి అదే స్థలంలో మసీదులు నిర్మించినారు. నేటికీ విశ్వనాథ మందిరంలో నంది మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థము (వాపి అనగా దిగుడు బావి అని అర్థము) ఉంటుంది. మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించినారు. కాశీ పుణ్యక్షేత్రం గురించి, ఇక్కడి మహత్మ్యా ల గురించి స్వయంగా అనుభవిస్తే తప్ప చెబితే అర్ధం అయ్యేది కాదు. మచ్చుకు రెండు మూడు ప్రస్థావించుతాను.

10 వ భాగము  మరొకసారి.........

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము – 10వ భాగము

 జగద్గురు శంకరుల కాశీ వాసము

శంకరులవారు కాశీలోవున్నకాలములో  ఒకనాడు వ్యాసమహర్షి స్వయంగా ఆచార్యులవారిని అనుగ్రహించాలనుకొన్నారు. ఈశ్వరావతారమైన శంకరులకు ఉపదేశం చేయవలసినదిగా శ్రీ గోవిందభగత్పాదులవారికి ఆజ్ఞాపించినవారు వ్యాసులే. వారు శంకరభాష్యము లోకోపకారకమైన మహాగ్రంథమని లోకము గ్రహించేలా చెయ్యాలనుకొన్నారు. శంకరభాష్యము ప్రశస్తమైనదని నలుగురూ తెలుసుకొనవలెనంటే, దానిపై కొన్ని ఆక్షేపాలు లేవదీయాలి, శంకరులు వానికి అన్నిటికి సమాధానాలు చెప్పాలి; అప్పుడే దాని ప్రశస్తి లోకానికి వెల్లడి అవుతుంది అని ఆయన తలపోసినాడు. అందుచే వ్యాసులు ఒకనాడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఆచార్యులవారి వద్దకు వచ్చి వారి భాష్య రచనపై జటిలమైన వాదమును లేవనెత్తినారు. వ్యాసులవారి ఆక్షేపణలకు ఆచార్యులవారు సమాధానాలు చెపుతున్నారు. వ్యాసులవారు ఆచార్యులవారి సమాధానాలలోని సూక్ష్మాంశాలను తిరిగి ఆక్షేపిస్తున్నారు. ఆచార్యులవారు వానికి యుక్తియుక్తంగా సమాధానాలు చెపుతున్నారు. ఇలా జరిగే వాదప్రతివాదాలు పరమ సూక్ష్మాంశాలపై సాగుతూ అన్యులకు అర్థంకాని క్లిష్టస్థితికి చేరుకొన్నాయి. ఈ వాదప్రతివాదములు చూచి ప్రక్కనున్న శిష్యులు, ఇతరులుకూడా ఒకరి మొగాలు ఒకరు చూచుకొన సాగినారు. వృద్ధబ్రాహ్మణ రూపములో ఉన్న వ్యాసుని వాదం పొంగిన గంగలా పరుగెడుతూ ఉంటే ఆచార్యులవారి ప్రతివాదం సాగరగంభీరమై అలరారుతోంది. అపుడు ఆచార్యుల శిష్యులైన పద్మపాదులవారు 'ఉద్దండవాదన కొనసాగించే యీ వృద్దబ్రాహ్మణుడెవరై ఉంటాడు?' అని జ్ఞానదృష్టితో పరింకించి, 'ఈ వచ్చినవాడు వ్యాసుడు' అని గ్రహించి, వెంటనే

'శంకర శ్శంకర స్సాక్షాత్‌ వ్యాసో నారాయణ స్స్వయం|

తయో ర్వివాదే సంప్రాప్తే కింకరః కింకరో మ్యహం||'

శంకరులు శంకరావతారము, వ్యాసులు నారాయణావతారము అయినవారు. వారు వాదిస్తూ ఉంటే కింకరుడైన నేనేమి చేయగలను? అని పలికి, వాస్తవముగా ఈ భాష్యము మీహృదయములోని అభిప్రాయలనే అనుసరిస్తూ ఉంటే మీరు నిజరూపం ధరించాలి' అని వ్యాసులవారిని ఆర్థించేరు. తత్‌క్షణమే వ్యాసులు నిజరూపం ధరించినారు.

అపుడు శంకరులు - నేను వచ్చిన పని పూర్తి అయింది, పదునారేడులు నిండినవి, ఇక నేను పోవాలి, అనుగ్రహించండి' - అని వ్యాసులతో పలికినారు. దానికి వ్యాసులవారు నేను మరియొక పదునారేండ్లు అనుగ్రహించు చున్నాను;  భాష్యరచన మాత్రము చాలదు, దానిలోని సిద్ధాంతములను భరత ఖండమున ప్రచారము చెయ్యవలెను, ఎటుదిరిగీ కొందరు ఏవో ఆక్షేపణలు తప్పక లేవదీస్తారు, వానికి సమాధానాలు చెప్పాలి; భాష్యవిషయాలను సిద్ధాంతీకరించాలి' - అన్నారు. శంకరులు దానికి అంగీకరించినారు. వ్యాసుల కోరికను తీర్చుటకై వారు దిగ్విజయము గావించినారు.

మరొక విషయము. శంకరులు కాశీనగరంలో ఉన్న సమయంలో వారిని ఆశ్రయించి శిష్యులైనవారిలో పద్మపాదాచార్యులవారు ఒకరు. వారికి ఈ పేరు ఏర్పడడానికి కారణమైన కథ ఒకటి ఉన్నది.

ఒక నాడు పద్మపాదులవారు గంగ కావలి యొడ్డు, శంకరులు గంగ కీవలియొడ్డున ఉన్నారు. ఆ సమయంలో శంకరులు గంగలో స్నానం చేసినారు. వారి బట్టలు తడిసి ఉన్నాయి. వారు ధరించవలసిన పొడిబట్టలు ఆవలి యొడ్డున పద్మపాదులదగ్గర ఉన్నాయి. శంకరులు పద్మపాదుల గురుభక్తిని లోకానికి చాటదలచి - 'ఆ వస్త్రములు తీసికొని రమ్మని' - ఆజ్ఞాపించినారు. పద్మపాదులకు గురువు ఆజ్ఞవినగానే గంగ విషయము, దాని లోతు, వేగము అన్నీ మరచిపోయేరు. ఆయన వస్త్రములు చేతబట్టుకొని నేలమీద నడచినటులే గంగలోకూడా నడవసాగినారు. అప్పుడు గంగ వారి పాదాలక్రింద పద్మాలను వికసంపజేస్తూ వచ్చింది. అనగా వారి పాదాలు గంగమీదకాక గంగలో ఆయన పాదములక్రింద వికసించిన  పద్మములపై పడుతూ వచ్చినవి.

 ఈ విధంగా వారు గంగను దాటి గురువును సమీపించినారు. ఇది చూచిన వారంతా వారి గురుభక్తిని కొనియాడేరు. ఆ నాటినుండియు పద్మములచే భరింపబడిన పాదములుకలవారైనందున వారికి 'పద్మపాదులు' అని పేరు ఏర్పడినది.

 గంగదాటి వచ్చిన పద్మపాదులను జూచి - 'మీరుగంగను ఎలా దాటినారు?' - అని ప్రశ్నించగా వారు - ఏ ఆచార్యుని స్మరిస్తే సంసారసాగరమే మోకాటిలోతుగా మారుతుందో, ఆ ఆచార్యుల ఆజ్ఞాపాలనలో గంగ అడ్డు కాలేదంటే ఆశ్చర్యమెందుకు? అని బదులు పలికినారట.

11వ భాగము  మరొక మారు .........

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము – 11వ భాగము

 జగద్గురు శంకరుల కాశీ వాసము

కాశీలో జరిగిన తోటకవృత్తాంతమును ఇపుడు చూద్దాము.

ఆదిశంకరులవారిని నుతిస్తూ వారి నలుగురు ప్రథమ శిష్యులలో ఒకరైన, ఆనందగిరి అన్న పూర్వ నామము కలిగి, శంకరులచేత ప్రతిష్ఠింపబడిన ఉత్తరామ్నాయ పీఠమునకు మొదటి పీఠాధిపతియైన తోటకాచార్యులవారు, ఆపేరును ఎట్లు సార్థకము చేసుకొన్నారో తెలుసుకొందాము. ఆయన శంకరులవారి శిష్యులయిన కొత్తలలో మందమతిగా వుండేవారట. అందుచే అందరూ ఆయనను 'గిరి' అని 'అచల' అని పిలిచేవారట. అంటే వారి దృష్టిలో ఆయన అంత మొద్దు. కాశీలో, ఒకనాడు శంకరులవారు ఆనందగిరి యొక్క అచంచల భక్తిని మిగత శిష్యులకు చూపనెంచి, ఆవల ఒడ్డుననున్న తన ఆరవేసిన బట్టలను తెమ్మన్నాడు. 

శిష్యులు ఆలస్యమును సహించలేక పాఠము చెప్పమని శంకరులవారిని తొందర చేసినారు. శంకరులవారు తమ తపః శక్తితో ఆనందగిరిని సకల వేదశాస్త్ర పండితుని గావించినాడు.

బట్టలు తెచ్చి నిలిచిన ఆనందగిరి పారవశ్యముతో తదేకముగా గురువును చూస్తూ, కష్టమగు తోటక వృత్తములో, గురుస్తోత్రమును ఎనిమిది శ్లోకములలో చేసినాడు. అదే తోటకాష్టకముగా ప్రసిద్ధినందినది. ఆయన అప్పటినుండి తోటకాచార్యులుగా పిలువబడినారు.

ఇపుడు కాశీలో శంకరులవారు జగతికి అందించిన అనర్ఘ రత్నమగు ‘మనీషా 

పంచాకము’ను గూర్చి తెలుసుకొందాము.

ఒకనాడు ఆచార్యులవారు గంగాస్నానానికి బయలుదేరినారు. అపుడొక ఛండాలుడు వారికి ఎదురుగా నాలుగు కుక్కలతో సమీపించినాడు. ఆచార్యుల శిష్యులు ఆతనిని దూరంగా తొలగమన్నారు. కాని అతను తొలగక ఆచార్యులవారిని ప్రశ్నించినాడు.

అన్నమయా దన్నమయం, అధవాచై తన్యమేవ చైతన్యాత్‌|

ద్విజవరదూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛేతి?||

- మనీషా పంచకం.

బ్రాహ్మణోత్తమా! దేనిని తొలగు మనుచున్నారు?

విప్రో2యం శ్వపచో2య మిత్యపి మహాన్‌కో2యం విభేదభ్రమః|

అంటూ ఆ మాలవాడు మీరు శిష్యులకు వేదాంతమే కదా బోధిస్తున్నారు! వేదాంతం - 'వాడు వేరు, వీడు వేరు' అని చెపుతూ ఉన్నదా? గీతలో భగవానులు -

విద్యా వినయంసంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని|

శునిచైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః||

అని కదా చెప్పినారు. ఈ భేదభ్రాంతి మీకు ఎలా అలవడింది? మీరు 'అహం బ్రహ్మస్మి, శివో2హం' అని పలుకుతూ ఉంటారుకదా! వానికి అర్థం ఏమిటి? అని ప్రశ్నించినాడు.

బింబ ప్రతిబింబవాదము, అవిచ్ఛిన్నవాదము అని రెండు వాదములున్నవి. ఈ రెండును పరమాత్మకును మనకును భేదము లేదని నిరూపించును.

దోసెడు నీళ్ళు నేలపై చల్లినామనుకొందాము. అపుడు అవి ఎన్నో జలకణాలై నేలమీద పడతాయి. ఆ జలకణాలు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవిగా ఉంటాయి. ఆకాశంమీద సూర్యుడొక్కడే ఉన్నాడు. ఆ ఒక్క సూర్యుడూ ఈ చిన్న పెద్ద జలకణాలలో చిన్నవానిగా పెద్దవానిగా ప్రతిబింబిస్తూ ఉంటాడు. ఆ జలకణాలు నేలలో ఇంకిపోతే ప్రతిబింబాలున్నూ అంతరిస్తాయి. ఆకాశము లోని సూర్యబింబము ఒక్కటే మిగులుతుంది. అలాగే పరమాత్మ అంతఃకరణోపాధుల యందు ప్రతిబింబిస్తాడు. ఆ ఉపాధుల భేదాల ననుసరించి ప్రతిబింబ భేదాలు ఉంటాయి. ఉపాధియైన అంతఃకరణము అనగా మనస్సు లేకపోతే యీ ప్రతిబింబము ఉండదు. బింబమైన పరమాత్మయే నిలిచి దీపిస్తాడు. మనస్సు ప్రవాహం వంటిది. ప్రవాహం అంటే సంతతమైన గమనము కలిగియుంటుంది. మనస్సు యొక్క యీ గమనాన్ని నిలిపితే మనస్సు ఉండదు. ప్రతిబింబం ఉండదు. బింబమైన పరమాత్మ అద్వయమై, అవ్యయమై భాసిస్తాడు. ఇది స్థూలముగా బింబ ప్రతిబింబవాదము.

ఇక అవిచ్ఛిన్నవాదము. అది కూడా పైవిషయాన్నే నిరూపిస్తుంది కాని విధానము వేరు. బావిలో నీరున్నది. అందులో నుండి ఒక ఘటము నిండుగ నీరు తీసినామని అనుకొందాముము, ఘటములోని నీరు బావిలోని నీరు ఒక్కటే కాని ఉపాధిభేదం ఉన్నది. ఆకాశం అంతటా ఉన్నది. అంతటా ఉన్న ఆకాశాన్ని మహాకాశం అంటారు. ఘటంలోని ఆకాశాన్ని ఘటాకాశం అంటారు. ఘటం ఉన్నంతవరకు ఘటాకాశం మహాకాశం వేరువేరుగా కనిపిస్తాయి కాని ఘటం పగిలిపోగానే ఒక్కమహాకాశమే గోచరిస్తుంది. అలాగే ఉపాధి భేదాన్ని బట్టి అనగా మనసుయొక్క వ్యత్యసస్థితిని బట్టి పరమాత్మకూడా వ్యత్యాసంగా కనిపిస్తూ ఉంటాడు. ఘటం పగులగానే ఘటాకాశ మహాకాశాలు ఒక్కటైనట్లు మనస్సు నశించగానే అద్వయమైన పరమాత్మ గోచరిస్తాడు. ఇది అవిచ్ఛిన్నవాదం.

ఈ రెండు వాదాలను బుద్ధియందుంచుకొనియే ఆ ఛండాలుడు ఆచార్యులవారితో తర్కమునకు దిగినాడు.

సూర్యుడు పవిత్రమమైన గంగయందుప్రకాశించినట్లే చండాలవాటికయందున్ను ప్రకాశిస్తున్నాడు. రెండు ప్రకాశాలకు తేడా ఉన్నదా! బంగారుబిందె, మట్టికడవ రెండింటిలోనూ ఆకాశం ఉన్నది, ఈ రెండు ఆకాశాలకు భేదం ఉన్నదా!

అలాగే సర్వశరీరాలలోనూ ఒకే ఒకవస్తువు భాసిస్తోంది. ఆ వస్తువు ఆనందమయమైనది. అది పూర్ణమైనది. సముద్రమును పోలినది. వాస్తవానికి ఆ పరిపూర్ణవస్తువును సముద్రముతో పోల్చడం తగదు. ఏమంటే సముద్రం లేని చోటు చాలా ఉన్నది? కాని ఈ వస్తువు లేనిచోటు లేదు. మన ఎరుకలో సముద్రాన్ని మించి పూర్ణమైన వస్తువు లేదు కనుక దానితో పోలుస్తున్నాము. ఆ ఛండాలుడు పేర్కొన్న వస్తువు ఙ్ఞాన సముద్రము లేక ఆనంద సముద్రము అయినది. జ్ఞాన ప్రాప్తి జరిగితే ఆనంద సాగరమున ఒలలాడుచున్నట్లే! నిరవధికమైన ప్రేమతో మరియు చైతన్యముతో నిండినదియే ఆనంద సాగరము. అందులో అలలు లేవు కారణం ఏమంటే - లోకంలోని సముద్రం విషయములో దానికంటే భిన్నమైన భూప్రదేశం ఉన్నది, అందుచే అందు అలలు పుట్టడానికి అవకాశం ఉంది. కాని యీ ఆనందమయ వస్తువు లేనిచోటులేదు. దీనికి వెలితిలేదు. ఇది అంతటా నిండి ఉన్నది. అందుచే ఇచ్చట అలలుపుట్టే అవకాశమే లేదు. ఇట్టి వస్తువులో వ్యత్యాసం ఏమిటి? అని ఆ ఛండాలుడు ఆచార్యులవారిని ప్రశ్నించినాడు.

ఈ ప్రశ్నకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి సమాధానం చెప్పవలెనని మనము భావిస్తాము. కాని ప్రశ్న ఙ్ఞానవిధానంలో వేయబడిందికాబట్టి ఆచార్యులవారు కూడా జ్ఞానవిధానంలోనే సమాధానం చెప్పినారు.

ఆచార్యులవారు అన్నారు కదా!- 'తాము ఇంతటి మహాపురుషులని నాకు ఇప్పుడు గోచరమైనది. నేను ఇప్పుడు బ్రాహ్మణుడైనా సరే చండాలుడైనా సరే అతడు బ్రహ్మవేత్త అయితే నాకు గురువే'- అన్న వాస్తవాన్ని తెలుసుకొన్నాను అని సవినయముగా ఆ బ్రహ్మవేత్తయగు ఛండాలునికి నమస్కరించినాడు. అప్పుడు ఆదిశంకరులద్వారా పురుడు పోసుకోన్నదే ‘మనీషా పంచకము’. జ్ఞానస్థితిలో చండాలుడు చండాలుడుకాడు, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు, అని వేదం ఉద్ఘాటిస్తోంది అన్న ఈ విషయమునే వివరణాత్మకముగా శ్రీశంకరులు మనీషాపంచకము' అన్న పంచశ్లోకావళిని  మనకు అందించినారు.9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము – 11వ భాగము

 జగద్గురు శంకరుల కాశీ వాసము

కాశీలో జరిగిన తోటకవృత్తాంతమును ఇపుడు చూద్దాము.

ఆదిశంకరులవారిని నుతిస్తూ వారి నలుగురు ప్రథమ శిష్యులలో ఒకరైన, ఆనందగిరి అన్న పూర్వ నామము కలిగి, శంకరులచేత ప్రతిష్ఠింపబడిన ఉత్తరామ్నాయ పీఠమునకు మొదటి పీఠాధిపతియైన తోటకాచార్యులవారు, ఆపేరును ఎట్లు సార్థకము చేసుకొన్నారో తెలుసుకొందాము. ఆయన శంకరులవారి శిష్యులయిన కొత్తలలో మందమతిగా వుండేవారట. అందుచే అందరూ ఆయనను 'గిరి' అని 'అచల' అని పిలిచేవారట. అంటే వారి దృష్టిలో ఆయన అంత మొద్దు. కాశీలో, ఒకనాడు శంకరులవారు ఆనందగిరి యొక్క అచంచల భక్తిని మిగత శిష్యులకు చూపనెంచి, ఆవల ఒడ్డుననున్న తన ఆరవేసిన బట్టలను తెమ్మన్నాడు. 

శిష్యులు ఆలస్యమును సహించలేక పాఠము చెప్పమని శంకరులవారిని తొందర చేసినారు. శంకరులవారు తమ తపః శక్తితో ఆనందగిరిని సకల వేదశాస్త్ర పండితుని గావించినాడు.

బట్టలు తెచ్చి నిలిచిన ఆనందగిరి పారవశ్యముతో తదేకముగా గురువును చూస్తూ, కష్టమగు తోటక వృత్తములో, గురుస్తోత్రమును ఎనిమిది శ్లోకములలో చేసినాడు. అదే తోటకాష్టకముగా ప్రసిద్ధినందినది. ఆయన అప్పటినుండి తోటకాచార్యులుగా పిలువబడినారు.

ఇపుడు కాశీలో శంకరులవారు జగతికి అందించిన అనర్ఘ రత్నమగు ‘మనీషా 

పంచాకము’ను గూర్చి తెలుసుకొందాము.

ఒకనాడు ఆచార్యులవారు గంగాస్నానానికి బయలుదేరినారు. అపుడొక ఛండాలుడు వారికి ఎదురుగా నాలుగు కుక్కలతో సమీపించినాడు. ఆచార్యుల శిష్యులు ఆతనిని దూరంగా తొలగమన్నారు. కాని అతను తొలగక ఆచార్యులవారిని ప్రశ్నించినాడు.

అన్నమయా దన్నమయం, అధవాచై తన్యమేవ చైతన్యాత్‌|

ద్విజవరదూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛేతి?||

- మనీషా పంచకం.

బ్రాహ్మణోత్తమా! దేనిని తొలగు మనుచున్నారు?

విప్రో2యం శ్వపచో2య మిత్యపి మహాన్‌కో2యం విభేదభ్రమః|

అంటూ ఆ మాలవాడు మీరు శిష్యులకు వేదాంతమే కదా బోధిస్తున్నారు! వేదాంతం - 'వాడు వేరు, వీడు వేరు' అని చెపుతూ ఉన్నదా? గీతలో భగవానులు -

విద్యా వినయంసంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని|

శునిచైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః||

అని కదా చెప్పినారు. ఈ భేదభ్రాంతి మీకు ఎలా అలవడింది? మీరు 'అహం బ్రహ్మస్మి, శివో2హం' అని పలుకుతూ ఉంటారుకదా! వానికి అర్థం ఏమిటి? అని ప్రశ్నించినాడు.

బింబ ప్రతిబింబవాదము, అవిచ్ఛిన్నవాదము అని రెండు వాదములున్నవి. ఈ రెండును పరమాత్మకును మనకును భేదము లేదని నిరూపించును.

దోసెడు నీళ్ళు నేలపై చల్లినామనుకొందాము. అపుడు అవి ఎన్నో జలకణాలై నేలమీద పడతాయి. ఆ జలకణాలు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవిగా ఉంటాయి. ఆకాశంమీద సూర్యుడొక్కడే ఉన్నాడు. ఆ ఒక్క సూర్యుడూ ఈ చిన్న పెద్ద జలకణాలలో చిన్నవానిగా పెద్దవానిగా ప్రతిబింబిస్తూ ఉంటాడు. ఆ జలకణాలు నేలలో ఇంకిపోతే ప్రతిబింబాలున్నూ అంతరిస్తాయి. ఆకాశము లోని సూర్యబింబము ఒక్కటే మిగులుతుంది. అలాగే పరమాత్మ అంతఃకరణోపాధుల యందు ప్రతిబింబిస్తాడు. ఆ ఉపాధుల భేదాల ననుసరించి ప్రతిబింబ భేదాలు ఉంటాయి. ఉపాధియైన అంతఃకరణము అనగా మనస్సు లేకపోతే యీ ప్రతిబింబము ఉండదు. బింబమైన పరమాత్మయే నిలిచి దీపిస్తాడు. మనస్సు ప్రవాహం వంటిది. ప్రవాహం అంటే సంతతమైన గమనము కలిగియుంటుంది. మనస్సు యొక్క యీ గమనాన్ని నిలిపితే మనస్సు ఉండదు. ప్రతిబింబం ఉండదు. బింబమైన పరమాత్మ అద్వయమై, అవ్యయమై భాసిస్తాడు. ఇది స్థూలముగా బింబ ప్రతిబింబవాదము.

ఇక అవిచ్ఛిన్నవాదము. అది కూడా పైవిషయాన్నే నిరూపిస్తుంది కాని విధానము వేరు. బావిలో నీరున్నది. అందులో నుండి ఒక ఘటము నిండుగ నీరు తీసినామని అనుకొందాముము, ఘటములోని నీరు బావిలోని నీరు ఒక్కటే కాని ఉపాధిభేదం ఉన్నది. ఆకాశం అంతటా ఉన్నది. అంతటా ఉన్న ఆకాశాన్ని మహాకాశం అంటారు. ఘటంలోని ఆకాశాన్ని ఘటాకాశం అంటారు. ఘటం ఉన్నంతవరకు ఘటాకాశం మహాకాశం వేరువేరుగా కనిపిస్తాయి కాని ఘటం పగిలిపోగానే ఒక్కమహాకాశమే గోచరిస్తుంది. అలాగే ఉపాధి భేదాన్ని బట్టి అనగా మనసుయొక్క వ్యత్యసస్థితిని బట్టి పరమాత్మకూడా వ్యత్యాసంగా కనిపిస్తూ ఉంటాడు. ఘటం పగులగానే ఘటాకాశ మహాకాశాలు ఒక్కటైనట్లు మనస్సు నశించగానే అద్వయమైన పరమాత్మ గోచరిస్తాడు. ఇది అవిచ్ఛిన్నవాదం.

ఈ రెండు వాదాలను బుద్ధియందుంచుకొనియే ఆ ఛండాలుడు ఆచార్యులవారితో తర్కమునకు దిగినాడు.

సూర్యుడు పవిత్రమమైన గంగయందుప్రకాశించినట్లే చండాలవాటికయందున్ను ప్రకాశిస్తున్నాడు. రెండు ప్రకాశాలకు తేడా ఉన్నదా! బంగారుబిందె, మట్టికడవ రెండింటిలోనూ ఆకాశం ఉన్నది, ఈ రెండు ఆకాశాలకు భేదం ఉన్నదా!

అలాగే సర్వశరీరాలలోనూ ఒకే ఒకవస్తువు భాసిస్తోంది. ఆ వస్తువు ఆనందమయమైనది. అది పూర్ణమైనది. సముద్రమును పోలినది. వాస్తవానికి ఆ పరిపూర్ణవస్తువును సముద్రముతో పోల్చడం తగదు. ఏమంటే సముద్రం లేని చోటు చాలా ఉన్నది? కాని ఈ వస్తువు లేనిచోటు లేదు. మన ఎరుకలో సముద్రాన్ని మించి పూర్ణమైన వస్తువు లేదు కనుక దానితో పోలుస్తున్నాము. ఆ ఛండాలుడు పేర్కొన్న వస్తువు ఙ్ఞాన సముద్రము లేక ఆనంద సముద్రము అయినది. జ్ఞాన ప్రాప్తి జరిగితే ఆనంద సాగరమున ఒలలాడుచున్నట్లే! నిరవధికమైన ప్రేమతో మరియు చైతన్యముతో నిండినదియే ఆనంద సాగరము. అందులో అలలు లేవు కారణం ఏమంటే - లోకంలోని సముద్రం విషయములో దానికంటే భిన్నమైన భూప్రదేశం ఉన్నది, అందుచే అందు అలలు పుట్టడానికి అవకాశం ఉంది. కాని యీ ఆనందమయ వస్తువు లేనిచోటులేదు. దీనికి వెలితిలేదు. ఇది అంతటా నిండి ఉన్నది. అందుచే ఇచ్చట అలలుపుట్టే అవకాశమే లేదు. ఇట్టి వస్తువులో వ్యత్యాసం ఏమిటి? అని ఆ ఛండాలుడు ఆచార్యులవారిని ప్రశ్నించినాడు.

ఈ ప్రశ్నకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి సమాధానం చెప్పవలెనని మనము భావిస్తాము. కాని ప్రశ్న ఙ్ఞానవిధానంలో వేయబడిందికాబట్టి ఆచార్యులవారు కూడా జ్ఞానవిధానంలోనే సమాధానం చెప్పినారు.

ఆచార్యులవారు అన్నారు కదా!- 'తాము ఇంతటి మహాపురుషులని నాకు ఇప్పుడు గోచరమైనది. నేను ఇప్పుడు బ్రాహ్మణుడైనా సరే చండాలుడైనా సరే అతడు బ్రహ్మవేత్త అయితే నాకు గురువే'- అన్న వాస్తవాన్ని తెలుసుకొన్నాను అని సవినయముగా ఆ బ్రహ్మవేత్తయగు ఛండాలునికి నమస్కరించినాడు. అప్పుడు ఆదిశంకరులద్వారా పురుడు పోసుకోన్నదే ‘మనీషా పంచకము’. జ్ఞానస్థితిలో చండాలుడు చండాలుడుకాడు, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు, అని వేదం ఉద్ఘాటిస్తోంది అన్న ఈ విషయమునే వివరణాత్మకముగా శ్రీశంకరులు మనీషాపంచకము' అన్న పంచశ్లోకావళిని  మనకు అందించినారు.

12వ భాగము మరొకమారు..........

9వ జ్యోతిర్లింగము – కాశికా విశ్వేశ్వర లింగము 12వ భాగము

చకార కుక్షి

భోజరాజు ఆస్థాన కవిపండిత మూర్ధన్యుడైన కాళీదాసునకు కాశీ పట్టణమున జరిగిన ఈ ఉదంతమును చదవండి.

కవికులగురువుగా గణుతికెక్కిన  సంస్కృత మహాపండితుడు మహాకవి కాళిదాసు. ఈ కాళీదాస మహాశయుని రెండవ కాళీదాసనవచ్చును. రఘువంశ కుమారసంభావాడి కావ్యములు వ్రాసిన కాళీదాసు విక్రమార్కుని ఆస్థాన నవరత్నములలో ఒకడు. ఈ రెండవ కాళిదాసు  కాళికా వరప్రసాదితుడు.

ఒక సందర్భంలో ఈ రెండవ కాళిదాసు కాశీకి పోతాడు. ఎందుకు ఎప్పుడు ఎవరితో అన్న ప్రశ్నలు దయతో వేయవద్దు. చాటువులలో ఆ వివరాలు నేనెక్కడా గుర్తించలేదు. కాళిదాసు కాజోలు (ప్రసిద్ధ హిందీ నటి) కాయస్త వంశజులటనే అని ఒక పాఠకుడు అడిగినాడు. నా ఉద్దేశ్యములో వారిని  కలుపుచున్నది ఏకై''బంధమే. చాటువులు చదివేటపుడు చరిత్రలోకి దయతో పొవద్దు. ఆయన చరిత్రను గూర్చి మరొకసారి ఎప్పుడైనా ముచ్చటించుకొందాము.

మహాభారత రచయిత అయిన వేదవ్యాసుని విగ్రహము చూసి, ఆ విగ్రహము బొడ్డులో వ్రేలు పెట్టి, ఈయన "చకార కుక్షి" అని ప్రక్కవ్యక్తితో హేళనగా అన్నాడట మన కాళీదాసు. అంటే పొట్ట (కుక్షి) నిండా ''కారములున్నవాడు అని అర్ధం. వ్యాసులవారికి కోపము వచ్చింది, దానితో కాళీదాసు వ్రేలు వ్యాసవిగ్రహపు బొబొడ్డులోనే ఇరుక్కుపోయింది.

దీనికి కారణం ఒకటుంది.

మహాభారతం వ్యాసుల వారు చెబుతూ వుంటే వినాయకుడు వ్రాయడానికి ఒప్పుకొంటాడు. అయితే వినాయకుడు వ్యాసునికి ఆపకుండా చెప్పాలని ఒక షరతు పెడతాడు. వ్యాసుడు తెలివిగా క్లిష్టమైన సమాసాలతో శ్లోకాలు చెప్పడం మొదలు పెడతాడు.  అవి అర్థం చేసుకోవడానికి వినాయకుడు స్వల్ప వ్యవధి తీసుకొనేవాడు. వానిని వ్యాస ఘట్టములు అంటారు. ఆ కాస్త సమయాన్ని వ్యాసుడు తరువాత శ్లోకం తయారు చేసుకోవడానికి ఉపయోగించుకునేవాడు.

వినాయకుని వేగమునకు సరిదీటుగా శ్లోకములను చెప్పుటకు గానూ వ్యాసులవారు 'చ కారము’లను ఎక్కువగానేవాడవలసి వచ్చేది. వారి వేగము మనము ఊహించుకోలేము. అందుకే మహా పండితుడైనకాళిదాసు ఆయనను చకార కుక్షి అని ఆక్షేపిస్తాడు.  దానికి కోపమొచ్చిన వ్యాసుడు కాళిదాసును ఒక్క చకారం కూడ లేకుండా ద్రౌపదికి, పాండవులకు గల బాంధవ్యాన్ని శ్లోకరూపములో చెబితే గాని వ్రేలు వదలనని చెబుతాడు. "రక్షించినారు స్వామీ!" అని కాళిదాసు ఈ దిగువశ్లోకము చెబుతాడు.

ద్రౌపత్యా పాండుతనయాః పతిదేవరభావుకాఃl

నదేవరో ధర్మరాజః సహదేవో నభావుకఃll

ధర్మరాజు మరిది కాడు, సహదేవుడు బావ కాడు అని ఒక్క 'చకారం' వాడకుండా ఈ చమత్కార శ్లోకము చెప్పినాడు కాళీదాసు.  వ్యాసుడు సంతసిల్లి కాళీదాసును దీవించి పంపుతాడు.

మనము కాళిదాసు దండి భారవిని గూర్చి ఎంతో గొప్పగా చెప్పుకొన్నాము చెప్పుకొంటూ వుంటాము . అసలు ఈ శ్లోకము చూడండి.

ఉపమా కాళిదాసస్య భారవే రర్థ గౌరవహ:l

దండిన్యా పద లాలిత్యం మాఘై సంతి త్రయో గుణఃll

మాఘ కవి శిశుపాలవధ అన్న ఒక్క కావ్యమే వ్రాసినది. మిగతవి ఏవయినా వ్రాసినాడేమో నాకు తెలియదు.  కాళీదాసు ఉపమాలంకారములు, భారవి యొక్క అర్థ గౌరవము, దండి యొక్క పదలాలిత్యము ఆ కావ్యమునకు సొంతమట. ఆయనెంత గొప్పవాడో చూడండి.

అంతంత పౌరాణిక చారిత్రిక పురుషులు నడయాడిన ప్రాంతము కాశి.

మరొక మారు 'త్రైలింగ స్వామి' వారిని గూర్చి తెలుపుతాను.......

9వ జ్యోతిర్లింగము కాశికా విశ్వేశ్వర లింగము 12  వ భాగము

త్రైలింగ స్వామి

మన తెలుగువాడై యుండికూడా తెలుగువారిచే అధికముగా గుర్తించబడని త్రైలింగ స్వామిని గూర్చి ఈ విశ్వనాథ జ్యోతిర్లింగము అన్న శీర్షిక క్రింద వ్రాయుట అసంగతముగా నేను అనుకోనుటలేదు. ఎందువల్ల అంటారేమో ఈయన , మహా మహిమాన్వితుడై , మహా మహులచే మహానీయు డనిపించుకొని విశ్వనాథునిలో లీనమైన వారు. (సినిమాలలో చూపే విధముగా కాదు). వారి పాదదోయికి సాష్టాంగ ప్రణామముల నాచరించుదాము.

మనకు ప్రేమానంద తెలుసు, నిత్యానంద తెలుసు, బాలసాయి తెలుసు, అసారాం తెలుసు,పీర్ బాబా తెలుసు కానీ నిజమైన యోగుల గూర్చి తెలియదు. ఎందుకంటే ప్రచార సాధనాలకు కావలసిన మసాలాలు నిజాయితీ లో  వుండవు. ఒక స్వామి రామకృష్ణ, స్వామి వివేకానంద, రమణ మహర్షి,స్వామి శివానంద,లాహిరీ మహాశయులు ఈ విధంగా చెప్పుకొంటూపోతే చేంతాడంత అయ్యే ఈ మహనీయుల గూర్చి మన వార్తా పత్రికలలో, దుర్దర్శనులలో(దూర దర్శనులలో) బహు తక్కువగా వింటాము. ఈ జాబితాలోఒక మహారత్నమే త్రైలింగ స్వామి. ఇప్పుడు, మన తెలుగు వాడయి వుండి మనలో ఎక్కువమందికి తెలియని,తెలిసినా తలువని,తలచినా  తెలుపని ఆ మహనీయుని గూర్చి తెలుసుకొందాము.

పుట్టింది తెలుగు నాట నయినా ,ఆయన జీవితములో అధిక శాతము కాశీ లోనే గడిచింది .ఆయన చూపించిన మహిమలు పొందిన సిద్దులు, దివ్య విభూతులు అనేకం,అపారం, అనంతం . ఆయన అసలు పేరు శివ రామయ్య. విశాఖ పట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామము లో జన్మించినారు. తండ్రి నరసింహారావు, తల్లి విద్యావతి, సంపన్న బ్రాహ్మణ కుటుంబము. ఆయన జననం  19 -12 -1607   తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుండి వింత కాంతి ఈ బాలుడి మీద పడటం ఆమె చూసి యోగ్యుడవుతాడు అనుకొంది. చిన్నప్పటి నుండి ఐహిక వాంఛల  మీద కోరిక లేదు. నలభై ఏళ్ళకు తండ్రి, యాభై రెండో ఏట తల్లి చని పోవడం జరిగింది. శ్మశానాన్నే ఇల్లు గా చేసుకొని ఆస్తిని అంతా సవతి తమ్ముడు శ్రీధరుడికి ఇచ్చి, అక్కడే ఇంకో ఇరవై ఏళ్ళ దాకా గడిపి హటాత్తుగా స్వగ్రామం వదిలి తన 72వ ఏట పాటియాలా సంస్థానం లో వున్న బస్తర్ చేరి అక్కడ భాగీరధి స్వామి తో పుష్కర తీర్దానికి వెళ్ళి ఆయనతో సన్యాస దీక్ష గడించి గణపతి స్వామి అనే దీక్షా నామమును స్వీకరించినాడు. గురు సమక్షం లో పదేళ్ళు సాధన చేసి అద్భుత శక్తుల్ని సంపాదించు కొన్నాడు. సిద్ధులు పొందిన కాలమునుండి ఆయన దిగంబరుడే! ఆయనకు అప్పుడు 78 సంవత్సరాలు ******వయసు. గురువు మరణించిన తర్వాత తీర్ధ యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరినాడు. అచ్చట ఆయన చూపిన  లీలలకు ఆశ్చర్య చకితులై ఆయనను అపర రామలింగేశ్వరుడేయని  కొనియాడినారు అక్కడివారు. అక్కడి నుండి నేపాల్ చేరి అక్కడ అడవి లో తపస్సు చేసుకొంటూవుంటే ఒక పులి వచ్చి ఆయనకు ఎదురుగా చేష్టలుడిగి కూర్చొనివుండి పోయినది. రాజుగారి బంధువు ఈ దృశ్యాన్ని చూసి  పులిని చంపటానికి ప్రయత్నిస్తే వలదన్నాడు ఆయన. నేపాల్ రాజుకు ఆవిషయము తెలుపగా ఆయన వచ్చి సాష్టాంగ దండ ప్రణామము నాచరించి అనేక కానుక లిస్తే వలదని  జంతు హింస చేయ వద్దన్న హితవు చెప్పి అక్కడి నుండి టిబెట్, తరువాత మానస సరోవరం సందర్శించి, దారిలో ఎన్నో అద్భుతాలను చూపి హిమాలయాలలో చాలా కాలము తపస్సు చేసి నర్మదా నదీ తీరముచేరి అందు మార్కండేయ ఆశ్రమం లో” “ఖాఖీ బాబా” అనే అహోరాత్రాలు తపస్సు చేసే యోగిని దర్శించినాడు. ఒక రోజు తెల్లవారు ఝామున నర్మదా నది లో నీటికి బదులు పాలు ప్రవహిస్తున్నట్లు ఈయన దానిని తాగుతున్నట్లు ఖాఖీ బాబా చూసి ఆయన మహిమ ను గుర్తించడం జరిగింది. ఆవిషయము స్వామికి తెలిపితే తనను వదలి వెళ్ళిపోతాడని మిన్నకుండినాడు. అయినా ఈయన ఒక చోటునుండే వాడు కాదు గదా!

           1733 లో  ప్రయాగ చేరినారు. తపో నిష్ఠలో ఉండగా ఒక సారి కుంభ వృష్టి కురుస్తోంటే శిష్యుడు రామ తారణ భట్టా చార్య, ఆశ్రమం లోకి పోదామని చెప్పినా కదల లేదు. దూరం లో ఒక పడవ మునిగి పోతోందని దాన్ని రక్షించాలని సంజ్ఞ చేయడమే కాకుండా, అతడు అక్కడికి వెళ్ళే లోపున పడవ మునుగు తుంటే, స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించినాడు. ఆశ్చర్య పడటము శిష్యుని  వంతైనది.

  ఊరూరు తిరుగుతూ వీరు 1737 లో తన 130వ ఏట కాశీ చేరడము జరిగింది. అంతే ! తాను, జీవాత్మను పరమాత్మ సాయుజ్యము చేర్చేవరకు అంటే 150 సంవత్సరములు కాశీ లోనే గడపడము జరిగింది. ఆయనది 300 పౌన్ల బరువైన భారీ విగ్రహము. గడ్డాలు, మీసాలు పెరిగి దీర్ఘ శరీరముతో దిశమొలతో. మెడలో పెద్ద రుద్రాక్ష మాలతో, బాన కడుపుతో కాశీ నగర వీధుల్లో సంచరించే వాడు. క్షురకులెవరైనా తనకు క్షురకర్మ చేస్తే చేయించుకొనేవాడు. గంటల కొలదీ గంగా జలం పై పద్మాసనం లో తేలి ఉండే వాడు లేదంటే గంటల కొద్దీ నీటిలోనే మునిగియుండే వాడు. ప్రాణాయామమంటే శ్వాస నియంత్రణ. రేచక (గాలిని బయటికి వదలడం), పూరక (లోనికి పీల్చడం), కుంభక (లోపలి ప్రాణ వాయువును అలానే నిలిపి ఉంచడం ) హృదయాన్ని పరిపుష్టం చెయ్యడానికి, మనస్సును ఒకే విషయం మీద లగ్నం చేయడానికి ప్రాణాయామం ఉపకరిస్తుంది. ఇందులో ఆ మహనీయుడు పరాకాష్ట నందుకోగలిగినాడు కాబట్టి ఆయనకు ఆ విద్యలు సిద్ధించినాయి. కుష్టు రోగులకు సేవ చేసి వారిని ఆదరించినాడు స్వామి. వేద వ్యాస ఆశ్రమం చేరి అక్కడ సీతానాథ బంధోపాధ్యాయుని క్షయ వ్యాధి పోగొట్టి, హనుమాన్ ఘాట్ చేరినాడు. కొంత కాలము తరువాత అక్కడినుండి దశాశ్వమేధ ఘాట్ కు తన మకామును మార్చినాడు ఆ మహనీయుడు.  ఒక మరాఠీగృహిణి రోజూ విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తూ ఈ దిగంబర స్వామిని చూసి ఏవగించు కొనేది .ఆమె భర్తకు రాచపుండు. ఆవిడ శ్రేయోభిలాషులెందరో ఆమెను దిగంబరస్వామి శరణు వేడమన్నారు. తాను ఏవగించుకొనే వ్యక్తిని శరణు కోరడము ఆమెకు మింగుడు పడలేదు. భర్త వ్యాధి ముదర జొచ్చింది. గత్యంతరాలన్నీ తలుపులు మూసివేయడముతో స్వామిని శరణు కోరక తప్పలేదు. కానీ తాను తూల నాడిన ఆయన దగ్గరకు వెళ్ళటానికి సందేహించింది. చివరికి వెళ్లి ఆయన కాళ్ళమీద పడింది. దయామయుడైన ఆయన ఇచ్చిన విభూతి తో జబ్బు మాయ మైంది.

                  కాశీ మహా నగరం లో ఎందరో వెద విద్వాంసులయిన తెలుగు వారు ఉపాధ్యాయులు గా అధ్యాపకులు గావుండేవారు. వారు ఈ దిగంబర స్వామి తెలుగు వాడని గుర్తించినారు. వారు ఆయనకు ”త్రైలింగ స్వామి ”అనే పేరు పెట్టినారు. తెనుగు దేశము అంటే త్రిలింగ దేశమే కదా! అప్పటి నుండి ఆయనకు ఆపేరే స్థిరపడి పోయినది. 1800  లో తన స్థావరమును దశాశ్వ మేధ ఘాట్ నుండి బిందు మాధవానికి మార్చినారు.

ఎప్పుడూ మౌనమే, ధ్యానమే, తపస్సు యోగ సమాధిలో ఉండటమే! అందుకే ఆయనను ”మౌన బాబా” అన్నారు .ఆనోటా ఈనోటా స్వామివారి మహాత్మ్యము ప్రాకి కాశీ రాజును చేరింది. ఆయన గంగా నదిలో వున్నారని తెలిసి తన పడవలో ఆప్రాంతము చేరినారు. స్వామిని గుర్తించి పడవలోనికి సాదరముగా ఆహ్వానించినారు. స్వామి అందులో కూర్చున్న తరువాత వారితో ముచ్చటిస్తూ బ్రిటీషు వారు తన గొప్పదనమునకు బహుమతిగా ఇచ్చిన ఖడ్గమును స్వామికి చూపింప దలచి ఆయన చేతికందివ్వబోతే అది జారి గంగలో పడిపోయింది. వెంటనే అంత లోతుకు దిగి దానిని తెచ్చేవారున్నా అంత సులభముగా దొరకరుకదా! వారు వచ్చేవరకు కత్తి గంగలో వున్న చోటనే ఉండిపోవదు కదా! ఖిన్నుడయిన రాజును చూసి స్వామి పడవలో కూర్చొనియుంటూనే తన చేతిని గంగలోపలికి పోనివ్వజేసినాడు. ఆచేయి ఎంత లోతుకుపోయినదో మనకు తెలియదు కానీ అది బయటికి మాత్రం రెండు ఒకే విధమైన కత్తులతో వచ్చింది. తన కత్తిని తీసుకొమ్మని రాజును అడిగితే ఆయన అది గుర్తించలేక పోయినాడట. స్వామి రాజుకత్తిని రాజుకు ఇచ్చి రెండవ కత్తిని తిరిగీ గంగలో పారవేసినాడట.

దిగంబరంగా తిరగటం కొంత మందికి నచ్చక స్వామిపై  కేసు పెట్టినారు ఆయన గొప్పదనము ఆ మూర్ఖులు. కోర్టు లో కేసు నడిచింది. ఆయన్ను బంధించి తీసుకొని రమ్మని న్యాయాధీశుని ఉత్తరువు. రాజు తలచితే దెబ్బలకు కొదువా! స్వామిని తక్షణము న్యాయస్థానములో ప్రవేశ పెట్టినారు. ఆయన మహిమలను అధికారులు న్యాయపతికి వివరించినా ఆయన పెడచెవిని పెట్టటము జరిగింది, కారణము అతను ఆంగ్లేయుడు. స్వామి శుద్ధ శాఖాహారియని తెలిసిన ఆ న్యాయాధిపుడు  మాంసము స్వామి తింటే శిక్షించను అన్నాడు.  స్వామి సైగలతో తాను తినే దాన్ని మేజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించినాడు. జవాబు వచ్చేలోపలే  తన చేతి లో మల విసర్జన చేసుకొని నోట్లో వేసుకొని ఆ మహానుభావుడు తినివేయుట జరిగినది. విడ్డూరమైన విషయము ఏమిటంటే  దుర్గంధమునకు బదులు సుగంధ పరిమళం కోర్టు అంతా వ్యాపించింది. మతి పోయింది న్యాయాధీశునకు! స్వామి మహిమను గ్రహించిన న్యాయపతి వారు దిగంబరముగా తిరగవచ్చునన్న తీర్పును ఇచ్చివేయడము జరిగింది.

ఒక సారి ఒక ఆకతాయి ఆయన బజారులో వెళ్తూవుంటే మర్మాంగాన్ని గుంజినాడు. అది అలాగే కొన్ని గజాలు సాగింది. వాడు భయ పడి పారి పోయినాడు. దుండగులు కొందరు ఆయనకు సున్నపు తేటనిచ్చి పాలు అని చెప్పినారు. స్వామి ఎటువంటి తటపటాయింపు లేకుండా శుభ్రంగా త్రాగినాడు. ఆ దుండగుని కడుపు మండనారంభించింది. వాడు తప్పు తెలుసుకొని స్వామి పాదాలపై వాలినాడు. స్వామి వానితో " ఇప్పుడు తెలిసినదా నీవు నేను వేరుకాదని" సైగలతో అన్నారు. దుండగీడు చెంపలు వేసుకొని స్వామికి సాగిలబడి మ్రొక్కి క్షమాపణ చెప్పుకొని అచటనుండి నిష్క్రమించినాడు. స్వామి మింగిన దానిని మూత్ర రూపమున విసర్జించినారు.

త్రైలింగ స్వామి వారి మరికొన్ని విశేషాలతో మరొక సారి

 

9వ జ్యోతిర్లింగము కాశికా విశ్వేశ్వర లింగము 13  వ భాగము

త్రైలింగ స్వామి-2

              శ్రీ రామ కృష్ణ పరమ హంస 1868 లో కాశీ వచ్చి నప్పుడు తన మేనల్లుడు హృదయనాథ్ తో కలిసి మౌన  స్వామిని దర్శించినారు. ఆయనకు స్వామివారు  నశ్యం వేసుకొనే కాయ అంటే పొడుంకాయ కానుకగా ఇచ్చినారట. పరమ హంస స్వామిని” ఈశ్వరుడు ఏకమా అనేకమా ”అని ప్రశిస్తే -సమాధి స్తితి లో ఏకం అనీ ,వ్యావహారిక దృష్టి లో అనేకం అని సైగల తోనే చెప్పినారట స్వామి. పరమ హంస స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించారు. ఇద్దరూ మహా పురుషులే.పరమ హంసలే. ఒకరి విషయం రెండో వారికి తెలుసు .ఎన్నో అద్భుతాలు చేసిన రామ కృష్ణులు స్వామిని అంతగా గౌరవించినారంటే మన త్రైలింగ స్వామి ఎంతటి మహిమాన్వితుడో మనకు అర్థమౌతుంది. స్వామిని ”నడయాడే విశ్వనాధుడు ”అని చెప్పినారట పరమ హంస.

వేరొకమారు  అర్ధ మణుగు పాయసము అంటే 5.6 కిలోల పాయసము వండించి తీసుకొని వెళ్లి స్వామికి అందించి తిని పించినారట.

మరొక సారి రాజ ఘాట్ నుండి విద్యానంద స్వామి అనే యతి వీరిని దర్శించటానికి కేదార్ ఘాట్ లో ఉన్న  స్వామి దగ్గరకు  వచ్చినారు .ఇద్దరూ గాఢంగా ఆలింగనం చేసుకొన్నారు. కాసేపట్లో అందరు చూస్తుండ గానే ఇద్దరూ మాయమైనారు. అరగంట తర్వాత స్వామి మాత్రమే తిరిగి వచ్చినారు. తాను ఆయన్ను రాజ ఘాట్ లో దింపి వచ్చినట్లు సైగలతోనే చెప్పి స్వామి అందరి సందేహాల్ని తీర్చినారు . అంటే ఆయన అష్టసిద్ధులు గడించిన మహిమాన్వితుడు అన్న విషయము మనకు అర్థమౌతుంది.

వారణాశికి వచ్చిన మరొక మహనీయుడైన లాహిరీ మహాశయుని గూర్చి త్రైలింగ స్వామివారు నాలుగు మాటలు చెప్పుటకు తమ మౌనము వీడినారు. వారి శిష్యులు వెంటనే " స్వామీ! సర్వ సంగ పరిత్యాగులై పరమేశ్వరానుగహము బడసిన మీరు ఒక సామాన్య సంసారి కొరకు మౌనము వీడుటయా!" అన్నారు. అందుకు స్వామివారు ఈ విధంగా తమ శిష్యులకు శెలవిచ్చినారు " ఏమాత్రము నొప్పి కలిగించకుండా తల్లి పిల్లి తన కూనలను ఎక్కడ వుంచితే అక్కడ యిమిడి పోతాయి. లాహిరీ మహాశయులు కూడా అటువంటి యొక పిల్లికూన వంటివారు. తల్లి ఆదేశము ప్రకారము ఆయన సంసారమన్న స్థావరములో ఇమిడి పోయినారు. నేను సర్వసంగ పరిత్యాగినై సాధించినది వారు సంసారములో వుంటూనే సాధించ గలిగినారు. వారిని గూర్చి మాట్లాడుట నాకు అమ్మ యొసగిన వరము" అన్నాడు. ఇప్పుడు నేను వ్రాసిన వారి మహాత్మ్యములను గూర్చి కూడా అనేక విధములుగా వారిని గూర్చి లోకులు చెప్పుకొంటారు. కానీ వారి మహత్తును గూర్చిన అనుమానము మాత్రము ఎవ్వరికీ లేదు.

పంచ గంగా ఘట్టం లో చిన్న భూగృహం నిర్మింపజేసుకొని  32 ఏళ్ళు సేవ చేసి ఆయన విగ్రహాన్ని చేయించాలని రెండు నెలల గడువు కావాలని కోరితే మరణాన్ని వాయిదా వేసుకొని, భక్తుడైన మంగళ దాస్ కోర్కె తీర్చి భూగృహం చేరి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు యోగ సమాధిలో ఉండి, తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకొని యోగాసనం లో కూర్చుండి, బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించుకొని 26 -12 -1887 న సర్వజిత్తు నామ  సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమ వారం  స్వామి తమ ఇహ జీవితాన్ని చాలించు కొన్నారు .ఆయన శరీరాన్ని చెక్క పెట్టె లో పెట్టి ఆయన కోరిన విధముగానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది దాక ఊరేగించి గంగా నదీ ప్రవాహం లో వదిలినారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం పూజా జరుగుతాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ ఘాట్ లోని మఠం లో జరగటం విశేషము. పతంజలి యోగములో విభూతి పాదములో చెప్పిన అణిమాది అష్ట సిద్ధులు, కుంభక యోగములో త్రైలింగ స్వామి సిద్ధింప జేసుకొన్నారు. ఆయన సంస్కృతం లో రాసిన ”మహా వాక్య రత్నావళి ”కి వ్యాఖ్యను బెంగాలి లో వ్రాసినారు .కాని మన తెలుగు వారి దృష్టి దాని మీదికి పోలేదు. 280 సంవత్సరాలు జీవించి, స్వచ్చంద మరణాన్ని పొంది, యోగ సిద్దులలో త్రివిక్రములై  ఆశ్రిత జన కల్ప వృక్షమై మౌనముద్రాలంకారులై తెలుగు వారై ఉండి ఉత్తర దేశం లో అందులోను కాశీ మహా క్షేత్రం లో బ్రహ్మ రధం పట్టించుకొన్న త్రైలింగ యోగి నామ ఉచ్చారణ చాలు మనం తరించ టానికి.

త్రైలింగ స్వామినేనమః

ఈ విధముగా చెప్పుకొంటూ పోతే కాశీ మహాత్మ్యము కమనీయ సాగారమౌతుంది. అందుకే స్కాంద పురాణాంతర్గతమగు ‘కాశీ ఖండము’ను కవిసార్వభౌముడగు శ్రీనాథుడు ప్రతెఎక కావ్యముగా వ్రాసినాడు.

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథంl

జగన్నాథనాథం సదానందభాజంl

భవద్భవ్యభూతేశ్వరం భూతనాథంl

శివం శంకరం శంభు మీశాన మీడేll

అందుకే అక్షరము ముక్క రాని నేను కాశీని గూర్చి పైవ్యాసమును భక్తిశ్రద్ధలతో వ్రాయుటకు నాచిత్తము మొత్తము వారణాశిపై నిల్పుచూ ఆ కాశీనాథుని ఈ విధముగా ప్రార్థించి వ్రాయుట మొదలుపెట్టినాను.

అల్పుడ నేను నాదు మతి అల్పము అల్పము భావ సంపదల్

శిల్పము రీతి నిల్పగల చింతన మాసె మనస్సునందు, నా

కల్పన వాయువాహమగు కప్రము భంగిని ఆవిరవ్వగా

తెల్పగ సాధ్యమెట్లగును తెల్పుము త్ర్యంబక కాశికేశుడా

 స్వస్తి.


Comments

Popular posts from this blog

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి