సాళ్వ దంతవక్త్రుల వధ

 సాళ్వ దంతవక్త్రుల వధ

https://ajaraamarasukthi.blogspot.com/2024/07/blog-post_14.html


 ఇందుగల భాగవత పద్యములు శ్రీయుతులు భాగవత గణనాధ్యాయి గారి అంతర్జాల భాగవతము నుండి తీసుకొనబడినవి. వారికి కృతజ్ఞుడను,.

సాళ్వ దేశపు రాజు సాళ్వుడు. సాళ్వ దేశమును పరిపాలించిన రాజులందరూ సాళ్వుని గానే వ్యవహరించబడినారు.  వీరిలో రుజుమార్గమున నడచినవారూ ఉన్నారు దుష్ట సాంగత్యముతో దుర్మరణము పాలయిన వారూ ఉన్నారు. ఈ రెండవ కోవకు చెందినా వారిలో మనము మాట్లాడుకోబోయే సాళ్వుడు ఈ రెండవ కోవకు చెందినవాడు. శ్రీకృష్ణుని దైవత్వమును గుర్తించక ఆహంకారియై శ్రీకృష్ణుని, రుక్మిణిని గోమ్పోవు సమయమున రుక్మితో చేతులు కలిపి, ఎదిరించినవారిలో ఒకడు ఈ సాళ్వుడు. రుక్మికి జరిగిన శృంగభంగమునకు ఎంతగానో పరితపించి రుక్మిని  సమర్థించిన జరాసంధాది రాజులముందు కృష్ణునే కాక   మొత్తము యడువంశామునే నాశనము చేస్తానని శపథము చేసి ఒకానొక కీకారన్యమున ప్రవేశించి తగిన స్థలమును ఎన్నుకొని శివదీక్షాతత్పరుడై, ఒక పిడికిలి అవనీరజమును మాత్రము రోజునకొకపరి భుజించి కఠోర నియమ నిష్ఠలతో సంవత్సన్తర్దానమైనాడు ర కాలము తపమాచరించి శంకరుని ప్రసన్నము చేసుకున్నాడు. పరమశివుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మనగా ఒక బలిష్ఠమైన విమానమును ప్రసాదించమని కోరుకున్నాడు. శివుడు తథాస్తు అని మయునికి  ఆ కార్యమును ఒప్పజెప్పి అంతర్దానమైనాడు ఆ విశ్వనాథుడు. మయుడు అత్యంత బలిష్ఠమైన 'సౌభకము'అన్న విమానమును నిర్మించి సాళ్వుని కిచ్చి తనదారిన తానూ పోయినాడు. వరగర్వము బలదర్పము గలిగి అహంకారముచేత కన్నూమిన్నూ కానని సాళ్వుడు ద్వారకపై దండెత్తి ఇంచుమించు మరుభూమిని చేయుటయేగాక ధనకనకవస్తూ వాహనములతోబాటూ మానినీ మానములను కూడా అపహరించినాడు. అంతటితో వదలిపెట్టకుండ విమానం ఎక్కి సాళ్వుడు ఆకాశంలోకి ఎగిరి అక్కడ నుండి చర్నా(చిల్ల)కోలల్లా ఉన్న తీగలు, గడ్డిపోచలు, చెట్లు, కొమ్మలు, రాళ్ళు, బాణాలు వరసపెట్టి కురిపిస్తూ ద్వారకావాసులను బాధించాడు. దట్టమైన దుమ్ము ధూళితో ఇసుకరేణువులతో కూడిన సుడిగాలులు విమానము వలన వీచునట్లుగా చేస్తూ కల్లోలపరచినాడు.

అది చూసి మహాప్రభావశాలి రథికశ్రేష్ఠుడు అయిన రుక్మిణీ పుత్రుడు ప్రద్యుమ్నుడు ప్రజలకు ధైర్యం చెప్పి, మీనకేతనము ప్రకాశిస్తున్న ఉన్నతమైన రథమునెక్కి, మహోత్సాహముతో అస్త్రశస్త్రాలను ధరించి, సైన్య సమేతముగా యుద్ధభూమికి బయలుదేరినాడు. ఆ మహావీరునికి అన్నివిధములా అండదండగా మహా భుజబల పరాక్రమవంతులైన గదుడు, భానువిందుడు, శుకుడు, సాత్యకి, సారణుడు, చారుదేష్ణుడు, సాంబుడు, ప్రద్యుమ్నుని నందననుడు అనిరుద్ధుడు, శఫల్కుని పుత్రుడు అక్రూరుడు మున్నగు యాదవవీరులందరూ కృతవర్మ నాయకత్వంతో యుద్ధభూమికి బయలుదేరీనారు.

మిగిలినది మరోరోజు......

 సాళ్వదంతవక్త్రుల వధ-2 

దేవ దానవ యుద్దమును మరిపించే  ఆ సంకుల సమరములో విస్తారమైన ధనుష్టంకారములు, మదగజ ఘీంకారములు, భటుల హూంకారములు, భేరీ భాంకారములు, వీరుల దురహంకారములు, శతృసంక్షోభకారములై  కర్ణ ద్రోణికలను శ్రోణికలుగా మార్చివేసినాయి. ఈ సందర్భమును వర్ణించుతూ మన పోతనామాత్యుడు ఎంత చక్కని పద్యమును వ్రాసినాడో చదవండి.

 రిరింఖారథనేమి సద్భటపదవ్యాఘట్టనోద్ధూత దు
స్తధూళీపటలప్రభూత నిబిడధ్వాంతప్రవిధ్వంస కృ
త్క శాతాసి గదాది హేతిరుచు లాకాశంబు నిండన్ వియ
చ్చ దృక్కుల్‌ మిఱుమిట్లు గొల్ప సమరోత్సాహంబు సంధిల్లఁగన్

గుఱ్ఱాల గిట్టల తాకిడికి, రథచక్రాల ఒరిపిడికి, భటుల పాదఘట్టనలకు లేచిన ధూళి ఆకాశం అంతా నిండి చీకట్లు వ్యాపించినాయి. ఆ చీకట్లను పోగొడుతూ సైన్యము చేతుల నలంకరించిన కత్తులు గదలు మున్నగు ఆయుధాల కాంతులు ఆయుద్ధమును తిలకించు వియచ్చరుల అనగా దేవతల  చూపులకు మిరుమిట్లు గొలుపుతూ ఆకాశం నిండా వ్యాపించినాయట.

 

ఆ సాళ్వుని సౌభకము యొక్క విన్యాసములను మహనీయుడు బమ్మెర పోతన మనకన్నులకు కట్టినట్లు చూపుచున్నాడు, వీక్షించండి.

కమాటు నభమునఁ బ్రకటంబుగాఁ దోఁచు-
  
నొకమాటు ధరణిపై నొయ్య నిలుచు
నొకమాటు శైలమస్తకమున వర్తించు-
  
నొకపరిఁ జరియించు నుదధినడుమ
నొక్క తోయంబున నొక్కటియై యుండు-
  
నొక్కెడఁ గనుఁగొనఁ బెక్కు లగును
నొకమాటు సాల్వసంయుక్తమై పొడసూపు-
  
నొక తోయ మన్నియు నుడిగి తోఁచు

 

నొక్కతేప కొఱవి యుడుగక త్రిప్పిన
తి మహోగ్రవృత్తిఁ గానవచ్చు
ఱియుఁ బెక్కుగతుల రివరుల్‌ గలఁగంగఁ
దిరిగె సౌభకంబు ధీవరేణ్య!

 

  ఆ సౌభకవిమానము  తన మాయా ప్రభావముతో ఒకమారు ఆకాశంలో కనపడుతుంది; ఒకమారు భూమి మీద నిలబడుతుంది; ఒకమారు కొండశిఖరం మీద తిరుగుతుంది; ఒకమారు సముద్రమధ్యంలో విహరిస్తుంది; ఒకసారి ఒక్కటిగా, మరుక్షణంలో అనేక రూపాలతో ప్రత్యక్షమవుతుంది; ఒక పర్యాయము సాల్వుడితో కూడి చూపట్టుతుంది; ఒకమారు ఏమీ లేకుండా కనపడుతుంది; ఒకమారు కొఱవి తిప్పినట్లుగా భయంకరంగా దర్శనమిస్తుంది; ఈ విధంగా ఆ విమానం శత్రువులు కలవరపడేటట్లు పెక్కువిధాలుగా తిరిగింది.

ఇవ్విధంబున యదుసాళ్వబలంబులు చలంబునఁ బరస్పర జయకాంక్షలం దలపడి పోరు పూర్వపశ్చిమ సముద్రంబుల వడువున నిరువదియేడు దినంబు లతిఘోరంబుగాఁ బోరునెడ నింద్రప్రస్థపురంబు నుండి ద్వారకానగరంబునకు నగధరుండు సనుదేర ముందటం గానవచ్చు దుర్నిమిత్తంబులం గనుంకొని కృష్ణుండు దారుకునితో తాము ఏమి ఆపత్తును చూడబోవుచున్నామో అని నిట్టూర్చినాడు. రథమును వేగాపరుప దారుకునికి నాజ్ఞ యోసంగి రాబోవు ఆపదను గూర్చి ఆలోచించ దోడగినాడు శ్రీకృష్ణుడు.

మిగిలినది మరోమారు........

సాళ్వదంతవక్త్రుల వధ-3

 

రథము ద్వారకను సమీపించగా ప్రచండ యుద్ధము జరుగుచున్నదని తెలుసుకొని అల్లది సాళ్వునకు యడుసేనకు అని గ్రహించినాడు శ్రీకృష్ణుడు.

 

ప్రద్యుమ్ననికి, సాళ్వుని మంత్రి ద్యుమునికి మధ్య జరిగిన యుద్ధములో ద్యుముని యమసదనమునకు పంపినాడు  ప్రద్యుమ్నుడు. యుద్ధరంగము మొత్తము భీభత్స భయానక ఓతప్రోతమై  భాసిల్లినది. ఎవరూ తగ్గకుండా 27 రోజులపాటు సంకుల సమరముము కొనసాగినది. ఇంద్రప్రస్థపురం నుండి ద్వారకకు వస్తున్న శ్రీకృష్ణుడు శత్రువులతో యుద్ధం చేస్తున్న యాదవ వీరులను, ఆకాశవీధిలో వున్న సౌభక విమానమును, అందులో వున్నసాళ్వుని చూసినాడు. తన రథాన్ని సౌభకము వద్దకు పోనివ్వమన్నాడు సారథియైన దారుకుని.ఇది గమనించి సాళ్వుడు పరాక్రమంతో ఒక్కసారి ముందుకు దూకి, తనవద్దనున్న బలోపేతమైన శక్తి ఆయుధాన్ని దారుకునిపై ప్రయోగించినాడు. దాన్ని శ్రీకృష్ణుడు పొడి చేసి నేలకూల్చాడు తన అస్త్రములతో! ఇక తన శస్త్ర సముదాయముతో అలుగులతో అనేక విధముల సాళ్వుని బాధించినాడు శ్రీకృష్ణుడు. మాటల యుద్ధానికి దిగిన సాల్వుడు, తన స్నేహితుడు శిశుపాలుని శ్రీకృష్ణుడు సంహరించినందుకు మరియు రుక్మిణిని రాక్షస శైలి పాణిగ్రహణము  చేసినందులకు హీనమగు భాషలో నిందించినా డు. శ్రీకృష్ణుడు అప్పుడు విసిరిన గదాఘాతమునకు మూర్ఛిల్లబోయి తమాయించుకొని తన సౌభకముతో సహా పారిపోయినాడు సాళ్వుడు.

ఆయుద్ధము శ్రీకృష్ణునకు. పోతన మాటలలో, ఈ విధముగా తోచినది.

 మిణుఁగుఱు లెల్లెడం జెదరమింటను మంటలు పర్వ; ఘంటికా
ఘణ భూరినిస్వన నికాయమునన్ హరిదంతరాళముల్‌
ణఁ; మహోగ్రశక్తిఁ గొని వారక దారుకుమీఁద వైవ దా
రుగతి నింగినుండి నిజరోచులతోఁ బడు చుక్కకైవడిన్.

 

నిప్పురవ్వలు అంతటా చెదరిపడేలా; అకాశం అంతా మంటలు వ్యాపించేలా; గంటలశబ్దంతో దిగ్గజాలు వణికేలా; సాళ్వుడు భయంకరమైన శక్తి అనే ఆయుధాన్ని కృష్ణుడి రథసారథి అయిన దారుకుడి మీద ప్రయోగించినాడు. అది ఆకాశం నుండి రాలిపడే కాంతిమంతమైన నక్షత్రంలా దూసుకు వస్తోంది. అంతటి వేగముతో దూసుకు వస్తూవున్న ఆ శక్తిని శ్రీకృష్ణుడు ఒక్క బాణంతో మార్గమధ్యలోనే పొడిపొడి చేసి నేలరాల్చినాడు.

శ్రీకృష్ణ సాళ్వుల నడుమ ద్వంద్వయుద్ధము అతిభీకరముగా జరుగుచుండగా సాళ్వుడు శ్రీకృష్ణుని ఎదుట నిలిచి తనకు శ్రీకృష్ణునితో కలిగిన వైరమును గూర్చి ఈ విధముగా తెలుపుచున్నాడు:

"ళినదళాక్ష! మత్సఖుఁడు నాఁ దగు చైద్యుఁడు గోరినట్టి కో
లి నవినీతిమైఁ దగవుమాలి వరించితి; వంతఁ బోక దో
ర్బమున ధర్మనందును సభాస్థలి నేమఱి యున్న వాని న
చ్చమునఁ జంపి తట్టి కలుషంబున నేఁడు రణాంగణంబునన్.

 

పద్మాక్షుడవగు ఓ కృష్ణా! నా కాప్తమిత్రుడగు చేదిరాజు శిశుపాలుడు కోరుకున్న కన్యకను నీవు నీతిహీనుడవు అయి పరిగ్రహించినావు. అది చాలక ధర్మరాజు యాగ సభలో ఏమరుపాటుగా ఉన్న మిత్రుని పగబట్టి చంపినావు. అంతటి తప్పుచేసిన నీవు ఇప్పుడు రణరంగంలో బెదిరి పారిపోకుండా నా ఎదుట ధైర్యంగా నిలబడితే నా మిత్రుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను నా కర్కశ బాణాగ్ని జ్వాలలలో ముంచి పగతీర్చుకుంటాను." అని పలికి అలుగులను ధనుస్సహాయముతో కృష్ణుని ఎడమ భుజమునకు తగులునట్లు విసరి ఆయన చాపమును చేజార్చినాడు. ఆగ్రహోదగ్రుడైన శ్రీకృష్ణపరమాత్ముడు వీరిపై సుదర్శనమును వదలి అంబరమున నిలచిన దివిజ ప్రేక్షక్లాకు ఆనందము కలిగించినాడు, ఈ విధముగా సాళ్వవధ జరిగిపోయినది.

 

అసలు ఈ పోరును కాస్త విశధీకరించితే బాగా ఉంటుందని తలచి ఈ దిగువన మరికాస్త విషయ విస్తారము చేయుచున్నాను.

మిగిలినది ఇంకొకమారు........

సాళ్వదంతవక్త్రుల వధ-4

యుద్ధము జరుగుచుండగా, ఒక వ్యక్తి ఆకాశం నుండి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, ఆయన తండ్రియైన వసుదేవుని సాళ్వుడు పట్టి బంధించి తీసుకుపోయినాడని చెప్పినాడు. శ్రీకృష్ణుడు కొంత తడవు చింతించినాడు. తదుపరి ఇది సాళ్వుని మాయగాక అన్యథా కాదని తెలుసుకొన్నాడు. ఇంతలో సాళ్వుడు తన మాయా బలంతో మళ్లీ కృష్ణుడి ముందుకు వచ్చి తాను బంధించి తెచ్చిన మాయా వసుదేవుని చూపిస్తూ, సాళ్వుడు, శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగనే మాయా వసుదేవుడి తల నరికి, అచ్చటనే పడవేసి, తన దారిన సౌభక విమానములో వెళ్లిపోయయినాడు. జరిగినదంతా మిధ్య అని యాదవ వీరులు, అన్నీ తెలిసిన కృష్ణుడికి తెలియజేసినారు. ఇక శ్రీకృష్ణుడు సాళ్వుని చంపి తీరాలని నిశ్చయించుకున్నాడు. తీవ్ర బాణ వర్షంతో ఆకాశమంతా కప్పివేసినాడు. సాళ్వుని కిరీటాన్ని, ధనుస్సును, కవచాన్ని ముక్కలు ముక్కలు చేసినాడు. గద విసరి విమానాన్ని పొడి పొడి చేసినాడు. అది నేల కూలింది. దాన్ని సముద్ర మధ్యలో పడేట్లు చేసినాడు కృష్ణుడు.

 

సాళ్వుడు పౌరుషంతో గదను ధరించి శ్రీకృష్ణుడి మీదికి వచ్చినాడు. గదను పట్టుకున్న ఆతని చేతిని ఖండించినాడు కృష్ణుడు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సాళ్వుని శిరస్సును ఖండించి దుష్ట నిర్మూలనము చేసినాడు.

ఇది చూసిన శిశుపాలుని  తమ్ముడు దంతవక్త్రుడు శ్రీకృష్ణుని పై దాడి చేసినాడు.

 చెడి పాఱక బాహా
 మొప్పఁగ నాదు దృష్టిథమున ధృతితో
నిలిచిన నిష్ఠుర విశిఖా
ర్చు ముంచి మదీయసఖుని సూ డిటు దీర్తున్. "

భావము:బెదిరి పారిపోకుండా నా ఎదుట ధైర్యంగా నిలబడితే నా మిత్రుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను నా కర్కశ బాణాగ్ని జ్వాలలలో ముంచి పగతీర్చుకుంటాను." అని దంతవక్త్రుడు ప్రేలాపించినాడు. శ్రీకృష్ణ భగవాను తన గదయైన కౌమోదకితో దంతవక్త్రునికి ఎదురొడ్డినాడు. దంతవక్త్రుడు పెద్ద గద తీసుకుని కృష్ణుడి తలమీద కొట్టినాడు. ఆగ్రహోదగ్రుడైన  కృష్ణుడు ఎదురు దెబ్బ ఎంతగా తీసినాడంటే స్వామి గదాఘాతానికి దంతవక్తృ డు ప్రాణాలు విడిచిపెట్టినాడు. అతని శరీరము నుండి వచ్చిన తేజస్సు శ్రీకృష్ణపరమాత్మలో లీనమైనది. దంతవక్త్రుడి తమ్ముడు విదూరథుడు కూడా శ్రీకృష్ణుని మీదకు  వచ్చి అసువులు బాసినాడు.

 

శ్రీకృష్ణుని విజయాన్ని చూసి యాదవులు అమితానందంతో ఆయన్ను కీర్తించినారు. యుద్ధరంగము నుండి దుర్జన ప్రాణహారి యగు శ్రీకృష్ణుడు ద్వారకానగరమున  మంగళ తూర్య ధ్వానములతో ప్రవేశించినాడు.

మిగిలినది ఇంకొకసారి.......

 సాళ్వదంతవక్త్రుల వధ-5

 

కొంత దంతవక్త్రుని గూర్చి కాస్త విస్తారముగా  ముచ్చటించుకొందాము.

 

మధుర రాజు శూరసేనకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారు పృథ (కుంతి), శ్రుతదదేవి, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ మరియు రాజాధిదేవి. శ్రుతదేవి  కరూష రాజ్యానికి రాజగు వృద్ధశర్మను వివాహము చేసుకున్నది. వారికి శిశుపాల దంతవక్త్రులు అను కుమారులు కలిగినారు.

 

దంతవక్రుని గూర్చి తెలుపబోవు ఈ వివరములు మహాభారతము, సభా పర్వ, 13 మరియు 28 అధ్యాయాలలోనివి.

 

వృద్ధశర్మ సార్థకనామదేయుడైమరణించినాడు దంతవక్త్రుడు సింహాసనమును వారసత్వముగా గ్రహించినాడు. ఆ సమయంలో మగధ దేశపు చక్రవర్తిగా జరాసంధుడు అధికారంలో ఉన్నాడు. అతను గంగానది ప్రాంతంలో చాలా మంది రాజులను మిత్రులుగా పొందినాడు. మహా బలశాలి వీరుడు అయిన జరాసంధునికి శిశుపాల, దంతవక్త్ర సాళ్వాదులు మిత్రులగుటలో ఆశ్చర్యపోవలసినది ఏమీ లేదు.  దంతవక్రుడు జరాసంధునికి అండగా అనేక సైనిక పోరాటములలో పాల్గొన్నాడు. అతడు శ్రీకృష్ణునితో విపరీతమైన శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. సంవత్సరాల తరువాత, జరాసంధుడు భీమునిచే, శ్రీక్రిష్ణుని యుక్తివలన, చంపబడినాడని గ్రహించి శ్రీకృష్ణునిపై ద్వేషమును అమితముగా పెంచుకొన్నాడు. .  యుధిష్ఠిరుడు తన సార్వభౌమత్వము చాటుకొనుటకు రాజసూయ యాగము చేయవలయునని సంకల్పించినది మనకు తెలిసిన విషయమే! అతను వివిధ రాజ్యాల పై సామదానభేదదండోపాయముల నుపయోగించి తన సార్వభౌమాధికారమును అంగీకరింపజేయ  తన సోదరులను దేశపు నలుమూలలకూ పంపినాడు. పాండవులలో కనిష్ఠుడగు సహదేవుని దక్షిణాపథమునకు పంపినాడు. అతను దంతవక్త్రుని ఓడించి, తమ సామంత రాజుగా చేసుకొని దంతవక్త్రుని కరుష రాజుగా తిరిగి నియమించినాడు.

జరాసంధ చక్రవర్తి మరణానంతరం, అతని మిత్రులు చాలా మంది ప్రతీకారం తీర్చుకోవాలని దలచి కృష్ణుడందుకు కారణమని తలచి శ్రీకృష్ణునిపై దాడి చేసినారు. రాజసూయములో శిశుపాలుడు శ్రీకృష్ణునిచే వధించబడినాడు . పౌండ్రక వాసుదేవ, సాళ్వులు ఇరువురూ కృష్ణుడిపై దాడి చేసి వధింపబడినారు. దంతవక్త్రుడు తన స్నేహితుల మరణవార్త విని తీవ్రమగు కలత చెందినవాడై కృష్ణునిపై అపరిమితమగు ద్వేషమును పెంచుకొంటూ పోయినాడు. దంతవక్రుడు ఆలోచించకుండా కృష్ణుడిపై దాడి చేయాలనే ఉత్సాహంతో ద్వారకకు బయలుదేరాడు. అతను ఒంటరిగా వెళ్ళాడు మరియు రథాన్ని కూడా ఉపయోగించలేదు; అతను కాలినడకన నడిచాడు. అతని వద్ద ఉన్న ఏకైక ఆయుధము ఉక్కు ముద్గరము. ద్వారక సింహద్వారము వద్ద ముద్గారముతో దంతవక్త్రుదు సిద్దముగా ఉన్నాడని గ్రహించి తానునూ తన గదయైన కౌమోదకిని చేతబూనిన వాడై రాజద్వారము వద్ద దంతవక్త్రుని కలిసినాడు. కృష్ణుని చూసి దంతవక్త్రుడు, “ఈరోజు నిన్ను ఎదుర్కోవడం నా అదృష్టము. నీవు నా స్నేహితులను, సహోదరుని సంహరించినావు , నేను నిన్ను చంపి నా నీ రక్తముతో వారికి తర్పణము వదులుతాను అని శ్రీకృష్ణునిపైకి ఉరికినాడు.

ఇంకొంత ఇంకొకమారు.........

సాళ్వదంతవక్త్రుల వధ-6(చివరి భాగము)

 దంతవక్త్రుడు కృష్ణునిపైకురికి తన గదతో ఆయన తలపై కొట్టినాడు. కానీ కృష్ణుడు కూడా చలించలేదు. కృష్ణుడు విసురుగా కౌమోదకిని ఎత్తి బలముగా దంతవక్త్రుని గుండెలపై  మోదినాడు. అంతే  దంతవక్త్రుని నుండి ఒక జ్యోతి వచ్చి శ్రీకృష్ణపరమాత్మలో కలిసింది.

ఈ కథ భాగవత పురాణం, కాంటో 10, అధ్యాయం 78లో ఉంది.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। 4-8 ।।


సన్మార్గులను  కాపాడటానికి, దుష్టులను దునుమాడటానికి, మరియు ధర్మ మునుపునఃప్రతిష్ఠించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను అని పరమాత్మ స్వయముగా చెప్పిన మాటను శిశుపాల, సాళ్వ.దంతవక్త్రుల విషయములో మరోమారు నిరూపించినాడు.


ఓం సర్వేపి స్సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాఃl

సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాక్భవేత్ll


శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే 

ఓం శాంతి శాంతి శాంతిః

స్వస్తి.


Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి