వ్యాకరణము – రూపావతారము
వ్యాకరణము – రూపావతారము
https://ajaraamarasukthi.blogspot.com/2024/02/blog-post.html
నా శ్రీమతి మేనత్తగారి ఇంటిపేరు ‘రూపావతారం వారు’
ఊరిపేరుకు బదులుగా రూపావతారం అన్న మాట ఎందుకు వచ్చినది అన్న జిజ్ఞాసతో శ్రీ శ్రీ
శ్రీ చంద్రశేఖర యతీంద్రులచే తెలుపబడి ఆంగ్లములో వ్రాయబడిన VEDAS అన్న పుస్తకములోని విషయమునకు చాలా సంవత్సరముల క్రిందట చేసిన నా
తెనుగుసేత. దీనిని తిరుగదోడుటకు ఆలంబనము నా సహోదరతుల్యుడు రామావఝ్ఝల వెంకట
కృష్ణయ్య.
వ్యాకరణము
. వ్యాకరణము వేదపురుషుని ముఖము.
అనగావాక్కునాకు మూలము ముఖమే కదా! వ్యాకరణా లెన్నోవున్నా, ప్రధానమైనది పాణినీయం. పాణినీయానికి పతంజలిమహర్షి భాష్యము వరరుచి
వార్తికమూ వ్రాసినారు. వ్యాకరణ సూత్రాల కన్నా వార్తికానికీ, వార్తికానికన్న భాష్యానికీ గౌరవము అధికముగా ఉంటుంది. ''సూచనాత్ సూత్రమ్'', అనగా
సూత్రము విషయమును సూచన ప్రాయముగా తెలుపుతుంది. పాణిని వ్యాకరణము ఈ
సూత్రరూపంలోవున్నది. అన్నిశాస్త్రాలకూ భాష్యాలున్నా వ్యాకరణ భాష్యానికే
మహాభాష్యమన్న గౌరవము దక్కుతుంది.
చోళమండలంలో శివాలయాలు ఎక్కువ.
శివాలయాలలో 'వ్యాకరణదాన మంటపాలు' అన్న మంటపాలుండేవి. అసలు శివాలయాలకు, వ్యాకరణానికి సంబంధము ఏమిటి అన్నది ఒకపరి పరికించుదాము.
నృత్తావసానే నటరాజరాజో
ననాద ఢక్కాం నవపంచ వారమ్.
ఉద్ధర్తుకామః సనకాదిసిద్ధా
నేతద్విమర్శే శివసూత్రజాలమ్ ||
పరమేశ్వరుడు మహానటుడు. నృత్యము
ముగియబోవు సమయమున ఆయన ఢక్క నుండి సూత్రాలేర్పడినవి. వానికి మాహేశ్వరసూత్రాలని
పేరు.
బొంబాయిలో ‘నిర్ణయసాగర ప్రెస్’ అనబడు ముద్రణాలయము
ఒకటి ఉండేది. వారు ‘కావ్యమాల’ అన్న పేరుతో వరుసగా ప్రాచీనకావ్యాలను ప్రకటించేవారు.
ఆ గ్రంథాలలో కొన్ని వెనుకటి సంస్కృత శాసనాలనుగూర్చి, వేంగినాటికి చెందిన
తామ్రశాసనాన్నిగూర్చి, ప్రకటించినగ్రంథమును చదవటం
తటస్థించినది, కృష్ణా కావేరీ మధ్యప్రదేశమే వేంగినాడు.
తెనుగు చోళులకున్నూ, తంజావూరు చోళులకున్నూ వియ్యమూ
నెయ్యమూ ఉండేది. బృహదీశ్వరాలయము నిర్మించిన రాజరాజ నరేంద్రుడు చోళుడే. వేంగినాటికి
చెందిన కులోత్తుంగచోళుడు ఆంధ్రదేశంలో వేదాన్ని మరింత ప్రచారంలోనికి తేదలచి
చోళదేశపు ద్రావిడ బ్రాహ్మణులలో 500 కుటుంబాలను తనతోపాటు
వేంగినాటికి తీసుకొనివచ్చి కాపురం పెట్టించినాడట. ఆంధ్రదేశములో ద్రావిడశాఖకు
చెందిన బ్రాహ్మణులు ఈ కుటుంబపరంపరలలోనివారే.
నిర్ణయసాగరంవారు ప్రచురించిన
గ్రంథంలోని శాసనం ఈ ఐదువందల బ్రాహ్మణకుటుంబాలవారి గోత్రాలేమిటో ఆ కుటుంబాలలోనివారు
ఏఏ శాస్త్రాలలో నిపుణులో వారు ఏ ఏ కార్యాలు చేయవలసియున్నదో, వారికి ఏ ఏ చోట భూవసతులు కల్పింపబడెనో ఆ పుస్తకమున విశదీకరించినది.
వారు, కోరినవారికి వేదములూ, శాస్త్రములూ చెప్పడమే పని. ''రూపావతారవక్తుః ఏకో భాగః'' అన్న వాక్యం ఆ
శాసనంలో కనిపించింది. ''రూపావతారం'' చెప్పేవారికి ఒకభాగం అని దీని అర్థం. రూపావతారం అనేది ఒక
వ్యాకరణశాస్త్రం. ఇది నాడు బహుళ ప్రాచుర్యములోనుండినది.
ప్రస్తుతము వ్యాకరణగ్రంథాలలో
అధికప్రచారం కలది 'సిద్ధాంతకౌముది'. దీనిని అప్పయదీక్షితులవారి శిష్యుడైన భట్టోజీ దీక్షితులు
వ్రాసినారు. ఇదిపాణినిసూత్రాలకు వ్యాఖ్యానము. భట్టోజీదీక్షితులు అద్వైతమతానుసారిణియైన
'తత్వకౌస్తుభం' అనేమరొక గ్రంథమును, అప్పయదీక్షితులవారి ఆజ్ఞానుసారము మాధ్వమతమును ఖండిస్తూ 'మధ్వమత విధ్వంసన' మన్న ఇంకొక
గ్రంథమున్నూ వ్రాసినారు.
సిద్ధాంతకౌముది వ్యాప్తికి రాకముందు ‘రూపావతార’మే
ప్రచారంలోవున్న వ్యాకరణము. రూప మనగా శబ్దంయొక్క మూలస్వరూపము. రూపావతారమనగా
శబ్దముయొక్కమూలస్వరూపవ్యక్తీకరణము. నిర్ణయసాగరంవారుప్రచురించిన తామ్ర శాసనం
వేగినాటిలో రూపావతార వైయాకరణులకు కల్పించిన భూవసతులను పేర్కొన్నది. ఆరోజులలో
వ్యాకరణానికి అంత ప్రాధాన్యత ఉండేది. వేగినాటికి వలసవెళ్ళిన బ్రాహ్మణులలో కొందరికి
'షడంగవిదు' లన్న బిరుదులుండేవి.
వారిపేళ్ళుసహితము అరవపేర్లే. 'అంబలకూత్తాడువన్
భట్టన్'
''తిరువరంగముడై యాన్ భట్టన్' అన్న ద్రావిడనామములను ఇందు చూడవచ్చును.
వీరందరూ స్మార్తులే. కాని పైన చెప్పిన
పేళ్ళలో మొదటిది శివనామం, రెండవది వైష్ణవం. తిరువంగముడై
యార్ పేరు వైష్ణవమేగాని నామధారి స్మార్తుడే. ఆ పేరుకు సంస్కృతము రంగస్వామి అని
అర్థము. తిరువంబల కూత్తాడువన్ అన్న పేరు నటరాజ శబ్దానికి తమిళ అనుకరణ. కుత్తాడుట
అనగా నాట్యంచేయుట. మనము చేసే నాట్యాలన్నీ ఈ నటరాజే చేయిస్తుంటాడు. నటరాజు నృత్యము చర్మచక్షువులకు
అగోచరము. తపోధనులైన సనకాదులు, పతంజలి, వ్యాఘ్రపాదులు
దైనీసంపద కలవారు కనుక, దివ్యచక్షువులతో దానిని విలోకించగలరు.
కృష్ణభగవానుల విశ్వరూపాన్ని ఒక్క అర్జునుడు, సంజయుడుమాత్రం
చూడగలిగినవారు. సంజయునకు వ్యాసభగవానుల ప్రసాదం, అర్జునునకు ''దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగ మైశ్వరమ్'' అని కృష్ణపరమాత్మయే దివ్యచక్షువు ప్రసాదించినాడు.
మనకండ్లలో కటకము(Lense) వంటి సాధన మొకటివున్నదనిన్నీ, దానిసాయము చేతనే మనముచూడగల్గుచున్నామనిన్నీ శాస్త్రజ్ఞులు
చెప్పుతున్నారు. వస్తువులన్నీ ఒక నిర్ణీతపరిమాణంలో మనకు కనబడటానికి ఆ కళ్ళలోని
లెన్సే కారణం అన్నమాట. ఈ దృశ్యప్రపంచంలోని వస్తువులను మరింత ఘనపరిమాణంలో చూడాలని
మనం తలచుకొంటే, లేక ఈ కటకమునకు అందని దృశ్యములు చూడ దలచినా దానికి తగ్గ కటకము మన
చక్షువులకు అమర్చుకోవలసి వస్తుంది. అందుచే మనము చూచేదే సర్వస్వమనగలమా! రూపముయొక్క ఘనపరిమాణము మనదృష్టిని అనుసరించి ఉంది. దీనినే
వేదాంత దృష్టి, సృష్టివాదము అని పిలువబడుతున్నది.
సనకాదులది సత్యదృష్టి, అందుచేతనే నటరాజునాట్యం చూచి ఆనందిస్తున్నారు. ఆనృత్యంలో
ఉదయించిన శబ్దాలు, శివస్వరూపాన్ని ఏకభోగంగా
అనుభవించడానికి వీలుగా ఉన్నవి. వానిభక్తిసూత్రాలుగా నందికేశ్వరుడు గ్రహించి భాష్యం
చేసినాడు. ఆనృత్య సందర్భంలో పాణిని కూడా ఉన్నాడట.
పాణినికథ బృహత్కథలో ఉన్నది. ప్రాకృత
భాషలలో పైశాచి ఒక్కటి. బృహత్కథ పైశాచిలో గుణాఢ్యుడు వ్రాసినాడు.
ఈబృహత్కధను క్షేమేంద్రుడు సంస్కృతములో
సంక్షిప్తంగా రచించినాడు. దీని ననుసరించి సోమదేవభట్టు కథాసరిత్సాగరమును సంతరించినాడు.
ప్రస్తుతము పానినిని గూర్చి
తెలుసుకొందాము. మగధదేశంలో పాటలీపుత్రంలో (ప్రస్తుతం పాట్నా) వరోపాధ్యాయులు, ఉపవరోపాధ్యాయులని ఇరువురు పండితులుండేవారు. వీరిలో
ఉపవరోపాధ్యాయులు చిన్నవాడు. అతని కొమారై ఉపకౌశల. వరోపాధ్యాయులవారిశిష్యులే వరరుచి, పాణిని, ఈశిష్యద్వయంలో పాణిని
మందబుద్ధి. చదు వెక్కలేదు. వరోపాధ్యాయు లాతని జూచి'నాయనా నీవు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి, ఈశ్వరానుగ్రహం
పొందితేకాని, నీకు చదువు ఎక్కేటట్టు లేదు. అందుచే
వెళ్ళి తపస్సుచెయ్యమని ఆదేశించినారు గురువులు. అంతటితో హిమాలయాలకు వెళ్లి పాణిని
ఉగ్రతపస్సుచేత ఈశ్వరునిమెప్పించి ఈశ్వర ప్రసాదమును పొందినాడు. పై పెచ్చు నటరాజు
తాండవాన్ని చూడగల అదృష్టమునుకూడా సంపాదించుకొన్నాడు. నృత్తావసానసమయంలో పుట్టిన
శబ్దాలను పదునాలుగు సూత్రాలుగా గ్రహించి అష్టాధ్యాయి రచించినాడు ఈ మహానుభావుడు.
అఇఉణ్, ఋఈక్,
ఏఓజ్, ఐఔచ్, హయవరట్, లణ్, ఞమఞణనమ్, ఝభఞ్, ఘఢధష్, జబగడదశ్, ఖఫఛఠధ, చటతవ్, కపయ్, శషసర్, హల్-' అనేవి ఈపద్నాల్గు
సూత్రాలు.
అచ్చులకు ఆకారము ఆది. ఈ మాహేశ్వర
సూత్రాలలో 'అ' అనేది
మొదటవది. 'హల్' చివరిది. వీనిమధ్యలో ఇమిడిఉన్న అచ్చులనూ, హల్లులనూ 'అల్' అనేది సూచిస్తుంది. 'అలోంత్యస్య' అనేదొక
పాణినిసూత్రం. లోకములో శబ్దశాస్త్రాలను ఏర్పరచినది పరమేశ్వరుడుకనుక శివాలయాలలో
వ్యాకరణదానమంటపాలు నిర్మించే వాడుక ఏర్పడినది.
దాదాపు నాలుగువందల సంవత్సరములకు పూర్వం
తంజావూరు రఘునాథుడనే నాయకవంశమునకు చేరిన రాజు పాలించేవాడు. అతనికాలములో
యజ్ఞనారాయణదీక్షితులు అన్న శివభక్తులొక రున్నారు. వారు 'సాహిత్యరత్నాకరము' అనే గ్రంథం
వ్రాసినారు. అందలి శివస్తోత్రమిది.
అజ్ఞాతప్రభవై ర్వచోభి రఖిలై రాలంబి ధర్మప్రభా(థా)
హేతుత్వం వివిధాధ్వరక్రమకృతి ష్వేకాయన
శ్చోదనైః.
తేషా మధ్వరకర్మణా మధిపతిం త్వా మీశ
నారాధయన్
ధర్మా నర్జయితుం న శ క్ష్యతి జనో దక్షో
ప్యదక్షోఽథవా||
మనం ధర్మాన్ని అనుష్ఠించాలన్నా, చేసిన కర్మలు ఫలించాలన్నా భగవంతుని కృప అవసరాము.
వేదవాక్కుఎక్కడ ప్రభవమైనదో ఎవరికీ తెలీదు. ఆవేదం 'ధర్మం ఇది' అని నిర్ధారిస్తున్నది. అనేక అధ్వరాలనూ, నానావిధకర్మలనూచేయుమని ఆజ్ఞ ఇస్తున్నది. యజ్ఞకర్మాధిపతివి
నీవు. యజ్ఞేశ్వరుడవు నీవు. నిన్ను ఆరాధించకపోతే ఇవన్నీ ఇట్లా ఫలితాన్ని గలవు? అన్నది ఈ శ్లోకార్థము.
''ఆవో రాజాన మధ్వరస్య రుద్రం హోతారం'' అని తైత్తిరీయ సంహిత. ఎవడు ఎంత కుశలుడైనా, దక్షుడైనా పరమేశ్వరుని ఆరాధన లేకపోతే వాని కౌశలం నిరుపయోగమై
పోతుంది. వానికి ఏ కార్యమూ సిద్ధించదు. దీనికి దక్షుడే సాక్ష్యము.
ఈ శ్లోకానికి ముందున్నది వ్యాకరణమును
గూర్చి.
అదౌ పాణినినా(వా) దతొఽక్షర సమామ్నాయోపదేశేనయః
శబ్నానా మనుశాసనం వ్యకలయ చ్ఛాస్త్రేణ
సూత్రాత్మనా,
భాష్యంతస్యచ పాదహంసకరవైః ఫ్రౌఢాశయం తం
గురుం
శబ్దార్థప్రతిపత్తిహేతు మనిశం
చంద్రార్థచూడంభజే||
అక్షర సమామ్నాయము వ్యాకరణము. వేదములు
ఈశ్వరనిశ్వాసాలు. ఈశ్వరునిచేతిలోని ఢక్కానాదమేశబ్దాను శాసనం.
నీవు చేయి ఆడించావు; సూత్రా లేర్పడినవి. పాదవిన్యాసం చేశావో లేదో భాష్య
మేర్పడినది. వ్యాకరణభాష్యం వ్రాసిన పతంజలి ఆదిశేషుని అవతారం. ఆయన పరమేశ్వరుని
మ్రోల పాదాక్రాంతుడైయున్నందున ఆయన వ్రాసిన భాష్యం మహేశ్వర పాదవిన్యాసములో నుంచి
పుట్టింది. ఇట్లా శబ్దార్థాలు రెండున్నూ పరమేశ్వరునిచే సృష్టింపబడినవి. వ్యాకరణం
పరమేశ్వరుని సృష్టి, ''శబ్దార్థ
ప్రతిపత్తిహేతు మనిశం చంద్రార్థచూడం భజే.''
స్వస్తి.
Comments
Post a Comment