విఘ్నేశ్వర తత్వము


విఘ్నేశ్వర తత్వము

https://ajaraamarasukthi.blogspot.com/2023/09/blog-post_9.html

వ్యాసులవారు వేద విభజన చేసిన పిమ్మట పురాణములను రచించవలెనని తలంచి ప్రారంభించబోవ అడుగడుగునకు ఆటంకములెదురైనాయి.  అపుడు ఆయన  బ్రహ్మ చెంతకు వెళ్ళి కారణమడుగగా 'స్మరణంవా గణేశస్య ప్రారభే సర్వకార్యతః'  ఏదైనా కార్యం ప్రారంభినప్పుడు ముందుగా గణపతిని ఆరాదించవలసి యుండగా అది నీవు మరిచితివి అనిచెప్పగా, ఎవరీ గణపతి అన్న వ్యాసులవారి ప్రశ్నకు బదులుగా బ్రహ్మ ఈ విధముగా జవాబు తెలిపినారు:

సప్తకోటి మహామంత్రా: గణేశస్యాగమే స్థితాః l

ఓంకార రూపీ భగవాన్ బీజంచ గణనాయకఃll

అలాగే, దేవతలు అమృతము కొరకు క్షీరసాగర మథనము చేస్తుండగా మధ్యలో పుట్టిన హాలాహలము ధాటికి తట్టుకోలేక దేవతలు రాక్షసులంతా శివుణ్ణి ఆశ్రయించగా, శివుడు ఈ విధముగా  తెలిపినాడు:

కార్యారంభేతు విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం l

కార్యసిద్ధిం నతేషాంవై భవేతు భవతాం యథా ll

అందుకే - కార్యము ప్రాపంచికమైనా  పారమార్ధిక మైనా,  ప్రధమంగా వినాయకుణ్ణి పూజించడం అన్నది ఆచారం. అట్టి సుముఖుని గూర్చి తెలుసుకొందాము.

వినాయకుని 16 పేర్లు ఈ విధముగా చెప్పబడినాయి.

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః |

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || 1 ||

ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః || 2 ||

షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి |

విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |

సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే || 3 ||

ఆయనను తలచి ఏ పని ప్రారంభించినా సఫలమే అన్నది శాస్త్రవచనము. మొదటి శ్లోకములోని మొదటిపేరు 'సుముఖ' అన్నది. కొంత మంది 'సుముఖఅన్న పేరు ఆయనకు ఏ విధముగా అన్వయము కాగలదని ఆలోచించుచుంటారు.  ఆ సందేహము తీర్చునదే ఈ జవాబు. సుముఖ అంటే పున్నమి చంద్రుని వలే వెలుగుచున్న అత్యంత సుందమైన ముఖము అని కాదు. 'సు' అంటే మంచి అని అర్థము. ఆయన ముఖములోని ప్రతి అంగమూ మంచికి  మారుపేరు. ప్రతి అంగమూ భక్తుని ఆధ్యాత్మికత వైపునకు మరలించి మోక్షపదమునందించుతుంది. అందువల్ల ఆయన సుముఖుడైనాడు. వివరములను చదువుతూబోతే మీరు తెలుసుకొనగలరు. ముందు వినాయకుని గూర్చి తెలుసుకొందాము.

   వినాయకుడు ఆది అంతము లేని ఆనందమయ తత్త్వమూర్తి. అకుంఠిత దీక్షతో అవ్యాజ భక్తిప్రపత్తులతో కొలవాలేగాని, కోరిన కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధి దేవత. గణపతి అన్నది శబ్దబ్రహ్మ స్వరూపము. ఆయన ప్రణవ నాద స్వరూపుడు. మహా గణములకు అధినాధుడు అందుకే ఆయన గణపతి. దేవతా నామావళి  ముందు ‘ఓం’కారము ఎలా ఉంటుందో అలాగే అన్ని శుభ కార్యాలకు ముందు గణపతి పూజ తప్పక ఉంటుంది.

రేపు జ్యోతిషముతో గణపతి యొక్క రాశీ నక్షత్ర  సంయోగముల గూర్చి తెలుసుకొందాము.

రేపు కలుద్దాం.....

విఘ్నేశ్వర తత్వము - 2

 గణపతి పుట్టుక: జ్యోతిషశాస్త్ర అన్వయము:‘గ’ అంటే బుద్ధి, ‘ణ’ అంటే జ్ఞానము. గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడు బుద్ధి-జ్ఞానము కలిగినవానికి (కార్య)సిద్ధికలిగించుతాడు. భాద్రపద శుక్ల చవితినాడు వినాయకుడు ఆవిర్భవించినాడు అన్నది పురాణ వచనము. కాస్త గమనించండి.భద్రమైన పదము ఏదయితే ఉన్నదో  అది భాద్రపదము, అనగా  మోక్షము. శుక్లము అన్నమాట తేజస్సుకు ప్రతీక.చతుర్థి(చవితి) అనగా నాలుగవ స్థితి. మరి ఏమిటా నాలుగవది. దానికి ముందున్న మూడు స్థితులు ఏవి? అవి జాగ్రత్, స్వప్న, సుషుప్తులు. ఈ మూడవస్థలనూ దాటిన తరువాతది నాల్గవది - దానిని తురీయావస్థ అంటారు . అది నిర్వికల్ప సమాధి. జీవునికి అంతకు మించి కావలసినది ఏమీ ఉండదు. ఇక ఆయన నక్షత్రము హస్త. హస్తా నక్షత్రము కన్యారాశిలో ఉంటుంది. రాశ్యాధిపతి బుధుడు. ఈయన పరమ ఉత్కృష్టవిజ్ఞానప్రదాత. మేషరాశి మొదటి రాశి అయితే దానినుండి ఆరవ రాశి కన్యారాశి. ఈ షష్టమ (ఆరవ) భావము, రణ  ఋణ  రోగ, శత్రు భయములను తెలియజేస్తుంది. అంటే మనిషి ఆధ్యాత్మిక మరియు లౌకిక ప్రగతికి ఏర్పడే విఘ్నాలను విశదపరుస్తుంది. ఆ విధముగా హస్తా నక్షత్రము, కన్యారాశి యందు ఉంటూ చవితినాడు ఉద్భవించిన  విఘ్నేశ్వరుడు, ఈ నాలుగు రకములయిన విఘ్నాలను తొలగిస్తానని అభయమిస్తున్నాడు.

 కన్యారాశికి సప్తమ రాశి మీనరాశి. మీనరాశి కాలచక్రములో పన్నెండవ రాశి. అంటే వ్యయ రాశి.మేష రాశికి వ్యయ రాశి పన్నెండవ భావం వ్యయాన్ని, బంధనాన్ని, అజ్ఞాత శత్రువుల్ని తెలియజేస్తుంది. ఇక్కడ శత్రువులంటే అంతశ్శత్రువులు.అరిషడ్వర్గములు - కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు. ఇవి మానవుని ప్రగతికి విఘ్నాలు కలిగించేవి. హస్తా నక్షత్రం, కన్యారాశిలో ఉన్న చంద్రుడు సప్తమ దృష్టితో నేరుగా మీనరాశిని వీక్షిస్తున్నాడు. కనుక వాటిని తొలగించి జీవితాన్ని సుఖమయం సుసంపన్నం చేసి,లౌకిక,ఆధ్యాత్మికపారలౌకిక ఆనందాన్నిచ్చి, మోక్షగతిని ప్రసాదించేవాడు వినాయకుడని జ్యోతిష శాస్త్ర అన్వయము.

పత్రిపూజ, ఉండ్రాళ్ల నివేదనలోని ఆంతర్యం: వినాయకుని నక్షత్రం ‘హస్త’ అని చెప్పుకున్నాం గదా!హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవగ్రహములకు నవధాన్యములు చెప్పబడినాయి. చంద్రుడు తెల్లనివాడు - వినాయకుడు శుక్లాంబరధరుడు.నవధాన్యాలలో చంద్రునికి బియ్యము ప్రియము. అందుకే బియ్యమును  భిన్నం చేసి ఆపిండితో , చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి, ఉండ్రాళ్లు నివేదన చేయటంలోని ఆంతర్యము. వినాయకునిది కన్యారాశి అని చెప్పుకున్నాము గదా! కన్యారాశికి అధిపతి బుధుడు కదా! బుధునికి నవరత్నములలో ‘పచ్చ’ రాయి ముఖ్యము(Emarald Green) అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని, ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. ఆ విధముగా చేయుటచే సంతుష్టు డవుతాడు స్వామి.

ఇక గరికపూజ ప్రీతిపాత్రము ఎందుకు అయిందీ చూద్దాము.వినాయక చవితినాడే గాక, ప్రతిరోజూ విఘ్నేశ్వరాలయాలలో, గరికతో స్వామికి పూజచేయు ఆచారము కద్దు. పూజాద్రవ్యములలో గరికను కూడా జత చేసి సమర్పిస్తూ ఉంటారు భక్తులు. దీనికి జానపదులు చెప్పుకునే కథ ఒకటి ఉంది.

పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుచుండగా న్యాయ నిర్ణేతగా నందీశ్వరుడు వ్యవహరించుట జరిగినది.నంది, ఈశ్వరుడు గెలిచినాడని  తీర్పునిచ్చినాడు.కానీ పిమ్మట అమ్మతో ఆమెయే గెలిచినట్లు నిజం చెప్పినాడట. ఆ తల్లి అట్లెందుకు చేసినావని అడుగగా ‘ఈశ్వరుడు నాకు ప్రభువు.నా ప్రాణము. అందుకే ఆయన గెలిచినట్లు చెప్పినాను' అని అన్నాడు. 'అయినా ఆయన దేహములో సగభాగముగానీవున్నావు గదమ్మా' అని సన్నాయి నొక్కులు నొక్కినాడు. అప్పుడా జగజ్జనని కోపించి ‘నందీ! నీవు అబద్ధము చెప్పినందుకు వ్యాదిగ్రస్తునివై బాధపడతావు’ అని శపించి, నంది ఖిన్న వదనుడై అంబను వేడుకొనగా  తల్లి జాలి చెంది, ‘నందీ! నా కుమారుడైన గణనాథుని పుట్టిన రోజున నీకు ఇష్టమైన పదార్థాన్ని అర్పితం చెయ్యి. అతను అనుగ్రహింఛి నీకు శాపవిమోచనము కలిగించగలడు. అని తెలిపినది.అంత నంది వినాయక చవితికై వేచియుండి తన కిష్టమైన గరికతో గణపతిని అర్పించినాడు. కరుణాళువయిన వినాయకుడు అతనికి శాపవిముక్తి కలిగించినాడు.

సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశినీ’ అంటూ శ్రుతి గరికను దేవి అని ప్రస్తావించింది. ఇది దుస్వప్నాలను నివారిస్తుంది. స్వప్నతుల్యమైన జగత్తులో అజ్ఞాన ప్రేరిత స్వప్నస్థితి నుండి మెళుకువను (జాగృతి) అభిలషిస్తూ కేవలం నిరాకార నిర్గుణ పరబ్రహ్మ మార్గగాములగుటకు సగుణ  మూర్తి యగు గణపతి పూజలో ఋషులు గరికను విధించారని శాస్త్ర వచనము.సకల కల్మషములను తొలగించు ఈ గరిక పూజనము సర్వశ్రేష్ఠము.  ఇది అనేక ఓషధీగుణ సమాగమము. లెక్కకు మించిన కణుపులు, చిగుళ్లు కలగి దుష్ట తలంపుల ప్రభావమును తొలగించు శక్తిగల పరమాత్మ స్వరూపమైన దూర్వాయుగ్మము మనలోని మాలిన్యాన్ని తొలగిస్తుంది, అని ‘దూర్వాసూక్తము’ పేర్కొన్నది. ఇదీ వినాయక పూజలో గరిక యొక్క ప్రాధాన్యత.

మిగిలినది రేపు.......

విఘ్నేశ్వర తత్వము - 3

జ్ఞానార్ధ వాచకో గశ్చ ణశ్చ నిర్వాణ వాచకం l

తయోరీశం పరం బ్రహ్మ గణేశమితి బోధ్యతేll (బ్రహ్మవైవర్త మహాపురాణం)

 '' జ్ఞానార్ధవాచకం, '' నిర్వాణ వాచకం అనగా మోక్ష ప్రదము. ఈ రెండింటికీ ఈశుడైన పరబ్రహ్మయే 'గణేశుడ'ని మహావిష్ణువు చెబుతాడు. 

గజ’ శబ్దార్థము గూర్చి:వశి-శివ, హింస-సింహ, పశ్యకః-కశ్యపః, వశ-శవ అన్న అన్వయము వర్ణ వ్యత్యాసముతో కలుగుతుంది.ఇదొక వ్యాకరణ శాస్త్ర ప్రక్రియ. ఆ విధంగా, గ జ- జగ అని మారుతుంది. కనుక గజాననుడంటే ఆయన ‘జగాననుడు’ అని అర్థం. జగత్తే ముఖంగా గలవాడు. గ: లయము, జ- జన్మ. కనుక గజమనగా సృష్టి స్థితి లయములు గల జగత్తు అని అర్థము. ‘గ’ అంటే జ్ఞానము ‘జ’ అంటే పుట్టినది. అనగా మన పుట్టుక మనుగడ నిర్వాణమునకు సంబంధించిన జ్ఞానము ఆయన హస్తి మస్తకము.  

గజాననుని ముఖ దర్శనము శుభప్రదము, జ్ఞానప్రదము, మోక్షప్రదము. సృష్టికి ముందు ‘ఓం’ అన్న ధ్వని వినవచ్చింది. అది గజాకారముగా పరిణమించింది. కనుక గజమనగా ఓంకార ధ్వని.అసలు  గజ నాదము అనగా హస్తినాదము, అదే ఓంకారము.శ్రీ సూక్తము లోని‘అశ్వపూర్వాం రథమధ్వాం హస్తినాద ప్రబోధినీమ్’ ఇంద్రియములనే గుర్రములచే పూన్చబడిన దేహము అనే రథము మధ్యలోనున్న చైతన్యమూర్తి,చిచ్ఛక్తి - పరదేవత నిరంతరము హస్తినాదముచే అనగా గజ నాదముచే అనగా ఓంకార నాదముచే మేలుకొలుపబడుచున్నది. ఇది ‘గజ’ శబ్దానికి శ్రీసూక్త మంత్రానికి సమన్వయము. అదే వినాయక చవితికి స్ఫూర్తి.‘అననము’ అనగా ప్రాణనము అనగా జీవకము అని అర్థము.దానిని కలిగించువాడు ఆననుడు. అంటే ఆయన ఈ జగమునకే ప్రాణాధారుడు.

గజమంటే జగత్తు కనుక, జగత్తుకే ప్రాణము గజాననుడని పైనే తెలియబరచినాను. గజాననుడనగా సృష్టి, స్థితి, లయ కారకుడనిముందే చెప్పుకొన్నాము. అందుకే మొదటిగా గజాననునికి పూజ విధింపబడినది. సకల ప్రపంచమునకు ప్రాణదేవత - గజాననుడు. అసలు సకల జీవ ప్రాణ నాథుడే గణనాథుడు. ఆయన సకల గుణగణ నాథుడు. లలితా పరమేశ్వరిని ‘శాంతిః స్వస్తిమతీ కాంతిః నందినీ విఘ్ననాశినీ’ అన్నది లలితా సహస్ర నామం. లలితాదేవి విఘ్నములను, అవిద్యను నశింపజేస్తుంది. కనుక ‘విఘ్ననాశినీ’ అని పేరు గల్గింది.  దీనినిబట్టి,  గణపతి స్వరూపమే లలితాదేవి అని తెలియవస్తూవున్నది. లలితా గణపతుల అభేద భావము ఇక్కడ మనకు తెలియవస్తూ ఉన్నది. విష్ణు సహస్ర నామములలో గణపతి: ఏకదంతుడు ఏకదం - అంతా ఒక్కటే. రెండవది లేదు అని ఏకత్వ బుద్ధిని అనుగ్రహించు ఆ ఏకదంతుని ఉపాసించాలి ‘అనేకదం’ - ఉపాసకులకు భక్తులకు అనేకములనిచ్చు,తం- గణేశుని, అనేక దంతం (అనేకద +అంతం)- ప్రళయ కాలములో అనేకములను హరించు గణపతిని ఉపాసించవలెను అన్న అర్థము అంతర్లీనముగా కలిగియున్నది ఈ శ్లోకము.‘ఏకో నైకః సవః కః కిం యత్పదమనుత్తమమ్’ అని విష్ణు సహస్ర నామములోని భావమే ఏకదః అనేకదః’ అని చెప్పినారు.

ఆధ్యాత్మికత మోక్ష సిద్ధికి వక్రమైన ఆటంకములను అరిషడ్వర్గములగు కామక్రోధ మద్య మోహ లోభ మాత్సరియముల నశింపజేసి,చిత్తమునకు ఏ కాగ్రత నొసగి, స్వస్వరూప సంధానతతో జీవబ్రహ్మైక్య స్థితిని అనుగ్రహించేవాడు వక్రతుండుడు. కార్యారంభములో మనము తప్పకుండా చెప్పే ఈ శ్లోకమును గమనించండి. 

వక్రతుండమహాకాయం సూర్యకోటి సమప్రభl

నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదాll

మరి వినాయకునికి ఈ వక్రతుండము ఎందుకు? అది నెమ్మదిగా తెలుసుకొందాము.

వినాయకుని పూర్ణ రూపము కుండలినీ శకక్తిని జాగృతి చేయు సంకేతము. 

వినాయకునిది గజముఖము. మస్తిష్కము ముత్యములను కలిగి ఉంటుంది. అంటే అపురూపము, అఖండము అద్వితీయమైన జ్ఞానమునకు ప్రతీకయైన ఆ మస్తిష్కములో అపురూపమైన జ్ఞాన మౌక్తికములు దాగి ఉన్నాయి.పైగా అది  అధికమగు మేధస్సుకు సంకేతము. వక్ర తుండము ఎందుకంటే, సాధారణ మానవుడు అధోరేతస్కుడు.అదే ఊర్ధ్వరేతస్కుడైనాడంటే ఆజ్ఞాచక్రముదాటి సహస్రారము చేరి మోక్షప్రాప్తిని పొందగలుగుతాడు. అందులకు సంకేతము ఈ వక్రతుండము. పైన తెలియజేసినది కూడా అదే! మనము సునిశితముగా పరిశీలించవలసి వచ్చినపుడు కన్నులు చీకిరించి అనగా చిన్నవి చేసుకొని చూస్తాము. వినాయకుని కన్నులు అందుకు ప్రతీక. ఏ విషయమునయినా సునిశితముగా పరశీలించవలెననుటకు సంకేతము.జ్ఞాన బోధన ఎల్లపుడూ చెవులు రిక్కించి వినవలేననుటకు సంకేతము. ఆయనకు శూర్ప కర్ణుడు అన్నది ఒక పేరు. శూర్పము అనగా చేట. చేట చెరుగుటకు సంకేతము. అంటే చెరుగుటచే తాలు అనగా డొల్ల గింజలు మరియు ఊక  అంతా పోగా గట్టి గింజలు మాత్రము చేటలో నిలుస్తాయి. అంటే వినే చెత్తను విసర్జించి జ్ఞానప్రదమగు ఉపదేశములను మాత్రమే మెదడులో నిలువ ఉంచుకొమ్మని తెలియజేస్తున్నది. 

లంబోదరము అన్నది బ్రహ్మాండానికి సంకేతము. విఘ్నేశ్వరుని చేతిలోని పాశ అంకుశాలు రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. గణపతికి ప్రియమైన భక్ష్యం - మోదకం. ఆనందాన్నిచ్చేది. మోదము అంటే ఆనందమే కదా! మోదకం ఆయన కృపాకటాక్షములలో ఆనందం లభిస్తుంది.అసలు మోదము అంటేనే ఆనందము. మోదకము అంటే ఆనందమును కలిగించునది అని అర్థము.నాగయజ్ఞోపవీతము కుండలినీ శక్తికి సంకేతము. 

మిగిలినది రేపు.......

విఘ్నేశ్వర తత్వము - 4 

యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు ।

యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః  ।। 6-17 ।। అన్నది గీతావాక్యము.

 ఆహార విహార వినోదాలలో ఎవరైతే మితముగా ఉంటారో, పనిలో సమతుల్యత,నిద్రలో క్రమబద్ధత కలిగియుంటారో, వారు యోగముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేసుకొనగలుగుతారు. ఇక్కడ యోగము అన్న మాటను గూర్చి కూడా ఒక మాట చెప్పవలసివస్తుంది. యోగము అంటే ఆత్మ భగవంతునితో 

ఏకమగుట.యోగమునకు వ్యతిరేకమైనది భోగము. భోగము అలివి మీరితే అధోగతే!అసలు భోగము, భోగి అన్న మాటకు పాము అన్న అర్థము కూడా ఉన్నది. కావున అర్థము చేసుకోవాలసినది ఏమిటంటే భోగము లోనే పాము ఉన్నది. ఏనిముసముననయినా అడి కాటు వేయవచ్చును.ఈ వాస్తవమునే వినాయకుని తుండము తెలిపేది.యోగమును అను అనుష్ఠించుచూ  యోగి అనువాడు యుక్తాహార విహారాదులతో, తమోగుణాన్ని జయించి సత్వమును నమ్మి తత్వ గుణ సంపన్నుడై, త్రిగుణాతీతుడై, కుండలినీ యోగసిద్ధుడై ఆనందమయ స్థితిని పొంది చరితార్థుడు కావాలని తెలియజేస్తున్నాడు మహాగణపతి. 

ఇక వినాయకుని వాహన మును గూర్చి మాట్లాడుకొందాము. వినాయక వాహనమైన ఎలుక పెరు ఆనింద్యుడు. అంటే నిందింప తగనివాడు అని అర్థము.    ఘ్రాణబలము అనగా వాసనచే వస్తువును పసికట్టే శక్తి దీనికెక్కువ.అందుకే బోనులో ఘాటయిన వాసన కలిగిన ఉల్లిపాయనువుంచి దానిని పట్ట జూస్తారు.తినుబండారాల వాసననుబట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. బోనులో చిక్కుకుంటుంది. ఇంటిలోగల ఏ వస్తువును ఉండనివ్వదు. చాలా చురుకుగా కదులుతుంది. అటువంటి అన్నివిధముల వ్యాపాకములకు దూరమై వినాయకుని వాహణమై ఆనింద్యుడు అయినాడు. ఆ విధంగానే మనిషి కూడా  ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పడతాడు. మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు-వినాయకుడు.అంతేకాదు అహంకారానికి చిహ్నం ఎలుక (మూషికము) అహంకారము  బుద్ధిమంతుల్ని పతనం చెందిస్తుంది. అట్టి మూషికమును వాహణముగా కలిగియుండుటచే కోరికలను అదుపులో వుంచుకొని భగవన్ మార్గమును ఎంచుకొమ్మని సందేశమిస్తున్నాడు గణేశుడు. 

ఎలుక వాహనం సంకేతాన్ని అనేక విధాలుగా వివరిస్తారు - ఎలుక తామస ప్రవృత్తికి చిహ్నం. కనుక కామక్రోధాలను అణగ ద్రొక్కడం అనగా ఎలుకపై స్వారీ చేయడం. పంటలకు హాని కలిగించే ఎలుకను అదుపు చేయడం అనగా విఘ్నాలను నివారించడం అని మరొక వివరణ ఉంది. 

బుద్ధిపతి గావున  మహాగణపతి ఈ బలహీనతలను జయించి సిద్ధిని పొందినాడు.మనలనూ ఆదారిన పయనించమని గణేశుని ఆదేశము. మూషిక వాహనుడైన గణపతి సమృద్ధినిస్తాడు.వినాయక చవితి పండుగనాడు ఉదయముననే  మంగళ స్నానములు (తలంటు) ఆచరించి, మట్టి విఘ్నేశ్వరుని పత్రి పుష్పములతో పూజించి, విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలన్నిటినీ వినాయకుని ముందు పెట్టి, శ్రద్ధ్భాక్తులతో అర్చించి, సద్బుద్ధి, విజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేయుట మాకాలము వరకు ఆనవాయితీ. ఇప్పుడా సాంప్రదాయము సజావుగా సాగుతూవుందో లేదో తెలియదు.లక్ష్మీదేవి మూలాధార నిలయం. గణపతి కూడా మూలాధార నిలయుడు. తొలుతగా లక్ష్మీ పాదార్చన  సర్వకార్య సిద్ధిప్రదము. సకల ఐశ్వర్యప్రదం. కనుకనే తన సంగీత రూపకమునకు ఆదిలో శ్రీగణపతిని ‘శ్రీ గణపతిని సేవింపరారే శ్రీత మానవులారా’ అని ప్రార్థనా రూపమైన మంగళమును పలికాడు శ్రీ త్యాగరాజస్వామి.

ప్రసిద్ధి చెందిన కీర్తన . 'వాతాపీగణపతిం'అన్న కీర్తనను ముత్తుస్వామి దీక్షితుల వారు వ్రాసినారు. 

మిగిలినది రేపు..... 

విఘ్నేశ్వర తత్వము - 5 

మహా గణపతి కీర్తనలు వినాయక చవితి రోజున ముఖ్యంగా ముత్తుస్వామి దీక్షితుల వారియొక్క  పై హంసధ్వని రాగ కీర్తన, విశేష ప్రాచుర్యము  పొందినది. నాకు చేతనైన మేరకు సందర్భోచితమని తలచి  భావయుక్తముగా మీ ముందు ఉంచుచున్నాను.

కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలో ఉన్నది బాదామి. బాదామి గుహాలయములకు ప్రసిద్ధి. బాదామికి మరోపేరు 'వాతాపి'. ప్రసన్న వదనుడై, ప్రతి భక్త వరడుడై , అరివర్గ దమనుడై ఆర్తజన విధేయుడైన వాతాపి గణపతిని గూర్చి వ్రాసి హంసధ్వని రాగరంజిత మొనర్చిన మహానీయుడగు ముత్తుస్వామి దీక్షితులవారి ఈ క్రింది కీర్తనను గూర్చి చదివి తరించండి.

 పల్లవి

వాతాపి గణ పతిం భజే(అ)హం వారణాస్యం వరప్రదం శ్రీ

భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం

వీత రాగిణం వినత యోగినం విశ్వ కారణం విఘ్న వారణం

చరణము

పురా కుంభసంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతమ్

మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్ర స్థితమ్

పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్ర తుండమ్

నిరంతరం నిటల* చంద్ర ఖండం నిజ వామకర విధృతేక్షు దండమ్

కరాంబుజపాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారమ్

హరాది గురు గుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబమ్

కృతి కర్త యైన శ్రీ ముత్తు స్వామి దీక్షితులవారు ఈ విధముగా అంటున్నారు: నేను వాతాపి గణపతిని పూజించుచున్నాను. గజ ముఖుడైన, వరాలను ఇచ్చే గణపతిని పూజించుచున్నాను. విషయ వాంఛలకు అతీతమై, యోగులచే కొలువబడి, జగత్కారణమై, అడ్డంకులను తొలగించే గణపతి పాదములను ఈ జగత్తున వ్యాపించి యున్న సమస్త భూతములు, ఆత్మలు, జీవాత్మలు సేవించుకొనును. అట్టి గణాధిపతిని సేవించుచున్నాను.మూలాధార చక్రము నందు స్థిరమై, అందున్న త్రికోణ మధ్య స్థానమందు వసించు గణపతీ! నిన్ను మునుపటి అగస్త్యుల వంటి ముని శ్రేష్ఠులు, విష్ణువు మొదలయిన ప్రసిద్ధులైన

దేవతలు పూజించుచున్నారు. పర, పశ్యతి, మధ్యమ వైఖరి  అను నాలుగు విధములైన శబ్దములతో కూడి జనించిన ప్రణవ నాదమైన ఓంకారము వలె నీ వంపు తిరిగిన తొండము గోచరిస్తోంది. నీవెల్లప్పుడు ఫాలభాగమున చంద్రకళను ధరించి, నీ ఎడమచేత బలమైన చెరకుగడను దాల్చి అగుపిస్తావు. అంతే కాక తల్లియైన పార్వతికి ప్రియ పుత్రుడవైన నీవుచేతులలో పద్మము, పాశము, దానిమ్మ పండు ధరించి, భక్తుల పాపాలను తొలగిస్తావు. శివుడు, షణ్ముఖుడు, మొదలయినవారిచే కొలువబడి హంసధ్వని రాగమును భూషణముగా, అమ్మ అయినపార్వతికి ప్రియ పుత్రునిగా గణపతీ నీవు ఒప్పుచున్నావు.

అట్టి వాతాపి గణపతియైన నీకు మేము శిరసా, ఊరసా, మనసా నమస్కరించుచుచున్నాము.

1835 దీపావళి దినమున సంధ్యావందన పూజాదికములను ముగించి తన శిష్యులతో 'గమకక్రియ' రాగములో 'మీనాక్షి మే ముదం' అన్న కీర్తనను ఆలపించమని చెప్పి, వారావిధముగా ఆలపించుచుండగా చరణములోని "మీన లోచనీ పాశమోచనీ'' అన్న పదములు పాటలో వచ్చినపుడు రెండు చేతులూ పైకెత్తి 'శివే పాహి' అని అంటూ కైలాస పదం చేరుకొన్నారు.

గణపతి పూజలో ఈ కీర్తన ఒక భాగమయితే  గణేశుడు ఎంతగానో సంతసించుతాడనుటలో ఏమాత్రమూ సందేహించనవసరము లేదు,. మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వాసుదేవాం నందిత’ నాటరాగ కీర్తన, ముత్తుస్వామి దీక్షితులవారి రచన, వినాయక చవితికి ఎంతో శోభను చేకూర్చే గణేశ కీర్తనలు.

మిగిలినది రేపు.....

విఘ్నేశ్వర తత్వము - 6 

ఇక ‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం' అన్న శ్లోకము తెలియని  సనాతని ఉండడు అనుట అతిశయోక్తి కాదేమో! ఈ శ్లోకము గణేశతాపోపరినిషత్ లోనిదని పెద్దలు చెప్పగా విన్నాను.  శుక్లమైన అంబరము అంటే పరిశుద్ధ జ్ఞానం, అంబరము అంటే వస్త్రము, ఆకాశము అని అర్థము.పరిశుద్ధజ్ఞానమే స్వచ్ఛతకుపర్యాయము. అంబరము అనంతమూ మరియు సర్వ వ్యాపకము. దానిని ఒక వస్త్రముగా ధరించాలంటే ఆయన కూడా సర్వవ్యాపకుడై ఉండవలసినదేకదా!. విష్ణుం అనగా ఈ సందర్భమున విష్ణుదేవుడనికాదు, సర్వ వ్యాపకుడని అర్థము. పైగా విష్ణువు నీలమేఘశ్యా ముడు శశి అనగా చంద్రుని వర్ణములో ఉండడు.ఈ సర్వవ్యాపకత్వము దైవత్వమునకే ఉంటుంది.దాన్ని మనకు ప్రసాదించాలంటే శశివర్ణుడౌతాడు. శశి అంటే చంద్రుడు. విష్ణుం అన్న మాటను చంద్రుడంటే మనస్సుకు అధిపతి. మనోభూమికకు దిగి వచ్చి బోధిస్తాడు ఆయన, అందుచే ఆయన మనకు ఆచార్యుడు. బోధించే స్థోమత ఆవిధముగా ఆయనకున్నదని  తెలియ వస్తూవున్నదాయనకు. చతుర్భుజం అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములనేలనే పురుషార్థ  చతుష్టయము  ఆయన చతుర్భుజములు. అంతటి మహనీయుడు కనుకనే ఆయన చతుర్భుజుడు.  ప్రసన్న వదనం అన్న విశేషణమునకు ఈ విధముగా అర్థము చెప్పుకొన వచ్చును. నిరుక్తము 'ప్రసన్న'అన్న మాటకు 'ప్రసన్నో  గజయూధపః' అని అని అంటూ వున్నది నిరుక్తము. నిరుక్తము షడంగములలో(ఆరు అంగములు) ఒకటి.  ఇవి వేదాధ్యయనమునకు ఉపకరణములు.అంటే ఈ విశ్వములోని సకల గజ సమూహమునకూ ఈయన అధిపతి.గజశీర్షము జ్ఞాన సముపార్జనకు ప్రతీక అని కదా మనము చెపుకొన్నాము. అట్టి గజేశ్వరుని  జ్ఞానము అపారము ఆనంతము. తనకు ప్రసన్నమైన శివశక్తి మరియు సామరస్య రూపమైన ఏ జ్ఞానముందో, దాన్ని మనకు ‘వదనం’(వద అంటే ఉచ్ఛరించట) అంటే ఆయనను నమ్మి పూజించితే మనకు బోధించగలడు. ఆ బోధనందుకుంటే అదే మనకు సర్వవిఘ్నములూ ఉపశాంతి కాకతప్పదు. శాంతయే. సకల విఘ్నాలను సాధన మార్గంలో కలగకుండా తొలగజేస్తుంది.  కావున ఈశ్లోకము వినాయకునికే అన్వయము. విష్ణువునకు కాదు. అహంకారమును దరికి రానీయక, భూతదయ గలిగి, స్వార్థరహితంగా త్యాగబుద్ధితో, అమృతమయమైన మనస్సుతో సర్వమానవ సౌభ్రాతతతో విశ్వమానవ కళ్యాణాన్ని త్రికరణ శుద్ధిగా కోరుకొనే వారి విఘ్నాలను నేను తొలగిస్తానని చెప్తున్నాడు మహాగణపతి.

సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపమే ఈ మహాగానాధిపతి. గణము అంటే సమూహము. గణాలతో నిండి వున్న ఈ  విశ్వానికి అధిపతి గణపతి. అలాగే, అహంకారానికి ప్రతీక అయిన ‘ఎలుక‘ను శాసించి వాహనంగా చేసుకు న్న గణపతిని, మహా గణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అని 6 రూపాల్లో పూజిస్తారు. ఇదే 8, 10 రూపాలలో కూడా పూజించుట కద్దు.

మిగిలినది రేపు.....

విఘ్నేశ్వర తత్వము - 7

గణపతి అథర్వ శీర్షం’ ఆయనను పరబ్రహ్మగా నుతియించుతుంది. ‘నమస్తే గణపతయే'అంటూ మొదలయ్యే ఆ స్తవము యొక్క సారాంశము ఏమిటన,

 నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను. హే గణపతీ! ఏదైతే సనాతనమో, ఏదైతే ఆది మధ్యాంత రహితమో, అనిర్వచనీయమో, భవబంధ  అతీతమైన భావశబ్ద ద్వయమును అనుగ్రహించుతూ ఉంటుందో,‘అది' నీవే అయివున్నావు. అన్నింటికీ సృష్టికర్తవు, భర్తవు, లయకర్తవూ నీవే. నీవే బ్రహ్మమూ, సత్యానివీ. నీకు నమస్కరిస్తున్నాను. సకల వాక్సంబంధిత శక్తివి, జ్ఞానమూర్తివి, ఆనంద మయునివి నీవే.శాశ్వతమైన వానివి నీవే. ప్రత్యక్ష పరబ్రహ్మము, నీవే లౌకిక పదార్థ జ్ఞానానివి నీవే, వేదం వేదంగా ఉపనిషద్ విజ్ఞానానివి నీవే ’ అని అంటున్నది ‘గణపతి అథర్వ శీర్షోపనిషత్తు’.

మంత్రశాస్త్రంలో వినాయకుణ్ణి మూలాధారచక్ర అధిష్ఠాన దేవత అని అంటారు అన్నది ముందే ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తన ద్వారా కూడా తెలుసుకున్నాము. మూలాధారంలో సుషుమ్న నాడి మూడుచుట్టలు చుట్టుకొని పైన పడగ కప్పుకొని ఉన్న పాములాగ ఉంటుంది. యోగాభ్యాసముతో సుషుమ్న నాడిని మేలు కొల్పగలిగితే, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం అనే షట్‌ చక్రాల ద్వారా ఆత్మను బ్రహ్మరంధ్రం చేర్చి బ్రహ్మ కపాల వి స్ఫోటనముతో ప్రకృతిని దాటి పరమాత్మను చేరే యోగ ప్రక్రియ జరుగుతుంది.

సుషుమ్న నాడి పక్కన ఇడ, పిం గళ అని రెండు నాడులు అనుసరించుకుంటూ ఉంటాయి. నిరంతరం సుషుమ్న వీటితో కలిసే పయనిస్తుంది. ఇడ అంటే జ్ఞానము, పింగళ అంటే కార్యసిద్ధి అలాగే ఇడ అంటే బుద్ధి, పింగళ అంటే సిద్ధి. మూలాధారము గణపతి, గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలనడంలోని అంతరార్థమును ఈవిధముగాకూడా అన్వయించుకొనవచ్చు.అనగా గణపతి అంటే అష్టచక్ర గణములకు అధిపతి. గణపతి అంటే పదకొండు ఇంద్రియ గణములకు, అనగా త్వక్ చక్షుర్ఘ్రాణ రసరూపములనబడు జ్ఞానేంద్రియములను, వాక్ పాణి పాద పాయు (మల ద్వారము) ఉపస్థ(మూత్ర, జననాంగ మార్గము) మరియు మనస్సులకు అధిపతి. పంచ తన్మాత్రలు(శబ్ద స్పర్శ రూప రస గంధములు అనబడు తన్మాత్రలు జ్ఞానేంద్రియ విషయ పంచకము యొక్క సూక్ష్మాంశలు.), పంచ భూతాలు(అనగా పృథివ్యాపస్ తెజోవాయురాకాశములు), పంచ ప్రాణములు(ప్రాణోపానవ్యానోదానసమానములు), అహంకారమొ, మమకార,ప్రకృత్యాదులకు అధిపతి ఈ గణపతి.

రేపు ముగింపు .....

విఘ్నేశ్వర తత్వము 8

మన శరీరములో ఉండే హస్త,పాద, జాను, జంఘ, ఊరు, కటి, ఉదర, హృదయ, కంఠ, ఆశ్య, ఫాల, శిర అను ద్వాదశ అవయవ గణములకు అధిపతి మన గణనాథుడు.అందుకే విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించడమే కాక విఘ్నాలకు కారణమైన వాటిని పోగొడతాడు. ఈ గణములను సన్మార్గములో వాడకుంటే వీనిచే విఘ్నములు కూడా కలిగించగలడు మన విఘ్ననాయకుడు. కావున ఆయనను శరణు వెడితే కార్యసిద్ధి కలిగించి తద్వారా సంతోషాన్ని కలిగించే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. పాపాలు తొలిగితే మంచి బుద్ధి కలుగుతుంది. మంచి బుద్ధి అనగా శాశ్వతమైనదాన్ని పొందాలనుకోవడం. అనగా పరమాత్మను కోరుకోవడం. సంసారం, సిరిసంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ అశాశ్వతమని ఎంత త్వరగా తెలుసుకోనగాలిగితే జ్ఞానమార్గమునకు మరలుట అంత సులభమౌతుంది.కావున గణపతి శాశ్వతమైన వాటి గురించి జ్ఞానాన్ని, అశాశ్వతమైన వాటి మీద వైరాగ్యాన్ని కలిగించి భక్తిని పెంపొందింపజేస్తాడు.

మానవుడు క్రోధాన్ని విడిచి, అనురాగాన్ని అభివృద్ధి చేసికొని శాంతి సహజీవనంతో, సంపూర్ణ శరణాగతితో భగవంతుని యందు ప్రేమభావనతో సద్భక్తిని పెంపొందించుకొని, జీవితాన్ని చరితార్థత నొందించుకోవాలని సూచించే ఈ పర్వదినమును చక్కగా అనుష్ఠించవలెనని శ్రద్ధాళువుల కోరుచూ వినాయకుని పాదదోయికి సాష్టాంగదండప్రమాణమాచారించుతూ భక్తిపరాయనులగు మీకందరకూ శుభాకాంక్షలు తెలుపుతూ , ఈ గేయమును గణేశునికి  అంకితము చేస్తూ మీవద్ద శెలవు తీసుకొంటున్నాను.

చెట్టు లేదు పుట్టలేదు నీవు లేని చోటు లేదు

పట్టుదలగ పడిమొక్కిన తీర్చబోని లోటు లేదు

నవవర్షము చేరువాయె నాణెమైన బతుకునివ్వు

గణనాయక గజాననా కలిగించుము శుభము సదా

స్వస్తిప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహింమహీశాంl

గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం; లోకాః సమస్తాస్సుఖినోభవంతుll

కాలే వర్షతు పరజన్యః పృథ్వీ సస్యస్యాలినీ

దేశోయం క్షోభయం రహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః ll

అపుత్రాః  పుత్రిణస్సంత్తు పుత్రిణస్సంతు పౌత్రిణః

అధనా ధనాస్సంతు జీవంతు శరదాంశతంll

లోకా సమస్తా సుఖినోభవంతు

పృథివీ శాంతిః అంతరిక్షగ్ం శాంతిః ద్యౌశ్శాంతిః దిశా శాంతిః అంతర్దిశా శాంతిః అగ్ని శాంతిః వాయుః శాంతిః ఆదిత్యః శాంతిః చంద్రమా శాంతిః నక్షత్రాణి శాంతిః ఆపః శాంతిః ఓషధయశ్శాంతిః వనస్పతయశ్శాంతిః గో శాంతిః అజా శాంతిః అశ్వః శాంతిః పురుషః శాంతిః బ్రహ్మ శాంతిః బ్రాహ్మణః శాంతిః శాంతి రేవ శాంతిః శాంతి ర్మే అస్తు శాంతిః II

స్వస్తి.


[11:21 pm, 17/09/2023] Pemmaraju Poornachandra Rao:

ఆర్యా గణపతినవరాత్రుల ఆగమన శుభసమయాన మీరు అందించిన విఘ్నేశ తత్వం మరియు పద్యములు కీర్తనలు చదవడం ఆనందహేతువే.విమర్శకునికి కవితో సమానమైన.ప్రజ్నాపాటవాలుండి తీరాలి.మా బోంట్లకు విని ఆనందించడం వినా. వేరే సమర్ధత లేదు.అయితే ఎందుకు ఎలా ఆనందించామో చెబితే సంతోషం ద్విగుణీకృతం అవుతుంది.జిడ్డు కృష్ణమూర్తి సెలవిచ్చి నట్లు the secretofteaching is tell them what you are inclined to tell them then tell them what is intended to be told then tell them what you have told. ఇది మాకు అన్వయించుకొంటే భగవన్నామస్మరణ పవిత్రమైన సాధన.అంతఃకరణశుధ్ధిని ప్రసాదిస్తుంది.నామస్మరణ పూర్తి ఫలం పొందాలంటే అర్ధాన్ని ఆధ్యాత్మిక అంతర్భావాన్ని చక్కగా అవగాహన చేసుకోవాలి.అప్పుడే నామవైభవశక్తితో మన హృదయాలు కోవెలలై ప్రకాశిస్తాయి.ఈ. కోణంలో ఆలోచిస్తే మీ వివరణాత్మక వ్యాస పరంపర చిత్తానంద దాయకంగా ఉన్నది. ముందుగా ఎవరైత…

[11:29 pm, 17/09/2023] Pemmaraju Poornachandra Rao: ఆర్యా గణపతినవరాత్రుల ఆగమన శుభసమయాన మీరు అందించిన విఘ్నేశ తత్వం మరియు పద్యములు కీర్తనలు చదవడం ఆనందహేతువే.విమర్శకునికి కవితో సమానమైన.ప్రజ్నాపాటవాలుండి తీరాలి.మా బోంట్లకు విని ఆనందించడం వినా. వేరే సమర్ధత లేదు.అయితే ఎందుకు ఎలా ఆనందించామో చెబితే సంతోషం ద్విగుణీకృతం అవుతుంది.జిడ్డు కృష్ణమూర్తి సెలవిచ్చి నట్లు the secretofteaching is tell them what you are inclined to tell them then tell them what is intended to be told then tell them what you have told. ఇది మాకు అన్వయించుకొంటే భగవన్నామస్మరణ పవిత్రమైన సాధన.అంతఃకరణశుధ్ధిని ప్రసాదిస్తుంది.నామస్మరణ పూర్తి ఫలం పొందాలంటే అర్ధాన్ని ఆధ్యాత్మిక అంతర్భావాన్ని చక్కగా అవగాహన చేసుకోవాలి.అప్పుడే నామవైభవశక్తితో మన హృదయాలు కోవెలలై ప్రకాశిస్తాయి.ఈ. కోణంలో ఆలోచిస్తే మీ వివరణాత్మక వ్యాస పరంపర చిత్తానంద దాయకంగా ఉన్నది. ముందుగా ఎవరైత…

[11:29 pm, 17/09/2023] Pemmaraju Poornachandra Rao: ఇహ పూజా విధానము పూజా సామాగ్రి నైవేద్యం విశేషములు సోదాహరణ వివరణ అందించినవ్యాసాది గురుపరంపరకు గురువులను..గణపతిది హస్త నక్షత్రం కనుక చంద్రుడు అధిపతి తెల్లని వాడు కనుక బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు ప ప్రియమని. కన్యా రాశి అధిపతి బుధుడు పచ్చ జాతి రాయి సంకేతమని. పత్రహరితం. ఆకుపచ్చని పత్రి పూజార్హత కు నోచుకొందని తెలుసుకోవడం ఆనందం.మనకి కోట్లాదిదేవతలని గేలి చేసే వారు గ్రహించవలసినది.వివిధదేవతామూర్తుల ఆరాధనా సమన్వయం. విఘ్ననాశిని అనే అమ్మవారి నామం గణపతిదేవుడు కార్యక్రమమే అమ్మవారు ధరించే చెరకుగడ గణపతికి ప్రీతీకరం

to be contd.


[11:29 pm, 17/09/2023] Pemmaraju Poornachandra Rao: మరియు శ్రీరామోలలితాంబికా అని. మనోరూపేక్షు. కోదండా అమ్మ చేతిలోని చెరకు గడే రామభద్రుని చేతి కోదండమని అంతరార్ధం విజ్ఞానులు తెలిపియున్నారు. ఎవరీ గణేశుడంటే. కామేశ్వరముఖాలోకకల్పిత శ్రీ గణేశ్వరా అనడంజీవ బంధావస్త అని తెలిపితే. శివచైతన్యబలంతో. ఆ మహాశక్తి కల్పించిన జీవుడే గణేశుడు.జీవునికి సంకేతమే గణపతి.భూతభౌతిక ప్రపంచానికి గణం.ఆ గణాధిపతియే గణపతి.మహాగణేశ నిర్భిన్నవిఘ్నయంత్ర ప్రహర్షితా యన్నది మోక్షావస్తే.ఏతావాతా తేల్చింది ఏమిటంటే హైందవుల ఆధ్యాత్మిక పూజలు పునస్కారాలు బహుదేవతారాధన అనేకంగా వ్యక్తమయ్యే ఏకేశ్వరోపాసనే.ఇంతకుమించిన ప్రజాస్వామ్యం భక్తిమార్గంలో ఎక్కడైనా ఉందా బలవంతంతొనో భయానికికో గురిచేయని ఆరాధనా స్వాతంత్రయమే సనాతనధర్మం .కన్నభూమి పట్ల కన్న వారిపట్ల మనుగడ సాగిస్తున్న సమాజం పట్ల భక్తియుక్థ గౌరవవిశ్వాసప్రకటనే దైవారాధన దేశారాధన. మన సంస్కృతి పుక్కిటి పురాణం కాదు.ప్రామాణికమై పరంపరాగతమై అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న దివ్యమైన భవ్యమైన మానవుని మోక్షపధగాములుగా తీర్చి దిద్దుతున్న పవిత్ర భూమి భరతభూమి.ఏకదంతుని ఆవిర్భావం ఆరాధన ఆచరిస్థున్న పూజావిధానాల అర్ధం అంతరార్ధం తెలిపీ ధన్యుల్ని చేసిన మీకు గౌరవాభి వందనములు.ఇది నా కు అర్ధమైన నా శక్తికి తోచిన విధంగా అభిప్రాయం గా మనవి చేసుకొంటూ. 

పెమ్మరాజు పూర్ణచంద్రరావు


 


Comments

  1. Beautifully explained the reasons for Ganesha's history. A good beginning and expecting much more from you sir

    ReplyDelete
  2. చాలా నిగూఢమైన విషయాలు తెలియపరిచారు. ధన్యవాదములు.

    ReplyDelete
  3. Beautiful description on the importance of Ganapathi puja with various types of Patri and garika. Thanks forvthe efforts and eagerly awaiting forcthe rest.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి