श्रीकामाक्षीस्तोत्रम् \ కామాక్షీ స్తోత్రము (ఆదిశంకర విరచితము)

श्रीकामाक्षीस्तोत्रम् \ శ్రీకామాక్షీ స్తోత్రము 

(ఆదిశంకర విరచితము)

https://ajaraamarasukthi.blogspot.com/2023/09/1.html

32 సంవత్సరాల వయసులో ఎన్నో వేదాంత వాదనలు, పాదచారులై ముమ్మారు భారతఖండ ప్రదక్షిణము, అంతులేని దేవతా స్థావ, స్తోత్ర రచనలు చేయటము మరుగున పడిన శిలావిగ్రహములను వెదకి తోడి తీసి పునః ప్రతిష్ఠ చేయించడము దక్షిణ దేశ ప్రతినిధిగా కాశ్మీర పీఠమునలంకరించడము ఒకటికాదు చెప్పుకొంటూ పొతే ఎన్నో,,,ఎన్నెన్నో!అట్టి అపర శంకర స్వరూపమైన ఆది శంకరులకు నమస్కరించి, వారిచే వ్రాయబడిన కంచి కామాక్షీ స్తోత్రమునకు భావము వ్రాయుచున్నాను, నాది కేవలము అత్యల్ప ప్రజ్ఞ. మీకు మంచి ఈ భావములో అగుపించితే అది ఆ శంకరుల దయ, 

కల్పానోకహ పుష్ప జాల విలసన్నీలాలకాం మాతృకామ్

కాన్తాం కఞ్జ దలేక్షణాం కలి మల ప్రధ్వంసినీం కాళికామ్ ।

కాంచీ నూపుర హారదామ శుభగాం కాంచీ పురీ నాయికామ్

కామాక్షిం కరి కుంభ సన్నిభ కుచాం వందే మహేశ ప్రియామ్ ॥1॥

తల్లి కంచి కామాక్షీ దేవిని ఎంత సుందరముగా స్వయముగా వీక్షించి వచ్చినరీతి అభివర్ణించుచున్నారు. ఒక్కసారి కనులు మూసుకొని అంతర్ముఖులమైతే మనో ఫలకముపై మాత చిత్రముప్రకటితమౌతుంది. అమ్మ కల్పానోకము=కల్ప+అనోకము= కల్పవృక్షము నుండి గ్రహించిన సౌగంధిక పుష్పముల మాలను తన నల్లని తుమ్మేదబారును మరిపించు కురులలో తురుముకొని, 'నల్లని' , వంపుతిరిగిన, ముంగురుల మెరుపుతో ఆ విశ్వమాత అలరారుచున్నది. ఆ తల్లి పద్మదళాయతాక్షియై విలసిల్లుచు ఒకవైపు, మరొకవైపు కాళీమాతయై కలి కలుషములను ధ్వంసము చేయుచున్నది. తన వఢ్యాణపు మువ్వలతో కటక కేయూర కంఠ మణిహారములతో సౌభాగ్యవతియై కాన్చీపురీ నాయికగా విలసిల్లుచున్న ఏనుగు కుంభస్థలముతో పోల్చదగిన చనుగవతో అలరారుచున్నట్టి ఆ తల్లిని 'ఓ మాతా కామాక్షీ! పరమేశ్వర ప్రియ సఖీ వందనము' అని మనము మ్రోక్కుదాము.

ఒక్కమాట ఇక్కడ చెప్ప పూనుకొనుచున్నాను. సన్యాసి యగు శంకరుడు అమ్మవారి స్థనములను వర్ణించుట తప్పుకాదా! అని వ్రేలెత్తి చూపే వాళ్ళు కొందరుంటారు. ఆతల్లి ఈ విశ్వమునకు మాత. ఆమె స్తన్య దుగ్ధమును ఒక శిశువు ఆస్వాదించినాడు అనుకొందాము. అతడు పెద్దవాడయిన పిదప ఆ కుచ సంపద గుర్తుచేసుకొని ఆ తల్లికి ఆతనయుడు తనివితీరా కృతజ్ఞతలు తెలుపుకొంటాడ, ఆతను సౌశీల్యత కలిగినవాడైతే! అసలు ఆయనేకాదు మనమందరమూ కూడా, గుర్తుచేసి వందనము ఆచరించవలసి యున్నది. ఇక కామాక్షి అంటే సకల అభీష్ట సిద్ధి సమకూర్చునది అని అర్థము, శృంగారపరమైన కామము అనికాదు అర్థము.

2. కాశాభాంశుక భాసురాం ప్రవిలసత్కోశాతకీ సన్నిభాం

చంద్రార్కానల లోచనాం సురుచిరాలంకార భూషోజ్జ్వలామ్ ।

బ్రహ్మ శ్రీపతి వాసవాది మునిభిః సంసేవితాంఘ్రి ద్వయం

కామాక్షీం గజ రాజమంద గమనాం వందే మహేశ ప్రియామ్ ॥2

కాశాభాంశుకము అంటే ముదురు ఆకుపచ్చని గడ్డిరంగు ఉడుపుల ధరించి నునులేత ఆకుపచ్చ వర్ణముగల పొడలకాయ(పొళ్ళకాయ లేక పొట్లకాయ) యొక్క మేనిఛాయ మెరుగులతో మెరియుచున్నది. జగన్మాతకు ఎప్పుడూ ప్రకృతి సంకేతము. ఆకుపచ్చదనము ప్రకృతికి సంకేతము. అందుకే ఆకుపచ్చని శోభతో అలరారే చెట్లవంక తదేకముగా చూస్తూవుంటే కంటి చూపునకది ఎంతోమేలు చేస్తుందని శాస్త్రజ్ఞుల ఆదేశము. ఆతల్లి చంద్రసూర్యాగ్నిలోచనయై కాంచనమయమైన పలువిధములగు రత్న భూషలతో అలరారుచున్నది. ఆతల్లి పాదపద్మములను బ్రహ్మ శ్రీధర అమరేంద్రాది దేవతా గణము సకల మునిజన గణములు అనుదినమూ సేవించుచున్నారు. అట్టి గజరాజునుబోలు మందగమనయు, పరమేశ్వర ప్రియసఖియు అయిన కామాక్షీదేవికి నమస్కరించుచున్నాను,

3. ఐం క్లీం సౌరితి యాం వదంతి మునయస్తత్త్వార్థ రూపాం పరాం

వాచామాది మకారణం హృది సదా ధ్యాయంతి యాం యోగినః

బాలాం ఫాల విలోచనాం నవ జపా వర్ణాం సుషుమ్నాశ్రితాం

కామాక్షీం కలితావతంస సుభగాం వందే మహేశ ప్రియామ్ ॥3॥

‘ఐం’ అన్న బీజాక్షరము సరస్వతీదేవికి ప్రతినిధి. ‘క్లీం అన్న బీజాక్షరము మన్మథునికి ప్రతినిధి, ‘సౌ అన్న అక్షరము సౌభాగ్యమునకు ప్రతీక. ఈ మూడింటికీ ప్రతినిధిత్వము వహించే అమ్మవారే ఆ పరబ్రహ్మ స్వరూపమని ధ్యానిన్చుచున్నారు. మొదటి బీజాక్షరము సరస్వతీదేవికి ప్రతినిధి అని చెప్పుకొన్నాము. ఆతల్లి సంగీత సాహిత్యములకు మరియు వాక్పటుత్వమునకు ప్రతినిధి. ఎంతగా ఆతల్లి అనుగ్రహము పొందగలిగితే చిత్తము అంతా ప్రశాంతముగా ఉంటుంది. మంచి మనస్సుకు మంచిమాట ప్రతినిధి.

ఆటల నాడబోకు పలు అర్థవిహీనములైన రీతిగా

చేటగు నీ ప్రవర్తనకు ఛీ యని యండ్రు సమాజ సభ్యులున్

మేటిగ నుండదల్చునెడ మెచ్చగ వాణిని యాత్మ నిల్పుచున్

మాటల వాడుకొమ్ము అవి మాన్యతబెంచును చిత్తశాంతియున్

ఇక మన్మథుని గూర్చి ఒక మాట. రాతి అనగా కోరిక. కోరిక ఒక వస్తువుపై  ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దానిని పొందవలెనను తపన రాను రానూ పెరుగుతూ పోతుంది. మన్మథుడు అనగా మనస్సును మథించువాడు. ఒక వస్తువు, అది చలాచల మేదయినా సరే దానిని పొందవలెను అన్నతపన మనస్సుకు నిబ్బరము లేకుండా చేస్తుంది. దానినే మంథనము అంటారు. మనస్సును ఆవిధముగా మంథనము చేస్తాడు కాబట్టి ఆటను మన్మధుడు. పరమశివుడు మనోవికారము లేనివాడగుటచే కామదహనుడైనాడు.

‘సౌ అన్న అక్షరము సౌభాగ్యమునకు ప్రతినిధి. పైరెండు మన అదుపులో ఉంటే మనకు కావలసినది సౌభాగ్యమే! అంటే ఈ మూడు బీజాక్షరములకు మూలరూపము ఈ మాత. అందుకే యోగులు ఈ మూడు బీజాక్షరములతోతల్లిని అనుష్ఠించుతారు,

ఆతల్లి బాలాత్రిపురసుందరి స్వరూపము. ఆమె ఫాల లోచని అనగా నుదుట నేత్రము కలిగినది. ముక్కంటి. అమితమగు ఎరుపు రంగుతో అలరారే జపా కుసుమము అనగా దాసాసాని పువ్వు వర్ణములో ధగద్ధగాయమానముగా అలరారే ఆ తల్లి సుషుమ్నా నాడి యందు స్థిరమై యుంటుంది. ఈ సుషుమ్న కుండలినీ శక్తియొక్క ప్రధమ గ్రంధితో ఈ సుషుమ్న కూడియుంటుంది. అట్టి సూర్య చంద్రులను కర్ణ కుండలములుగా కల్గిన సౌభాగ్యవతి మరియు మహేశ్వరుని ప్రియతమ నాయిక యగు కామాక్షికి నమస్కారము. 

4. యత్పాదాంబుజ రేణు లేశమనిశంలబ్ధ్వా విధత్తే విధిర్

విశ్వం తత్పరిపాతి విష్ణురఖిలం యస్యాః ప్రసాదాచ్ఛిరమ్ ।

రుద్రః సంహారతి క్షణాత్తదఖిలం యన్మాయయా మోహితః

కామాక్షీం అతి చిత్ర చారు చరితాం వందే మహేశ ప్రియామ్ ॥4

బ్రహ్మ మానవులందరి విధి/విధిని నిర్దేశిస్తాడన్న విషయము మనకు తెలిసినదే! ఆ మహత్తును ఆయన ఆ దేవి యొక్క పాద పద్మ రజమును తనశిరస్సున ధరియించి రాజసికమగు శక్తిని గ్రహించి సృష్టికార్యమునకు గడంగుతాడు.  ఆ దేవి అనుగ్రహంతో విష్ణువుబ్రహ్మసృష్టించిన సమస్త విశ్వాన్ని నిలబెట్టడంలో సాత్విక శక్తిని పెంపొందించుకొని, వనరుల కొరత లేకుండా, .ఈ జగద్రక్షణకు ఉద్యమించుతాడు. అసలు విష్ణువు అంటేనే సర్వ వ్యాపకుడు అని అర్థము. ఆ దేవి యొక్క మాయా శక్తిచే  రుద్రుడు తమోగుణ సంపన్నుడగుచు, జగత్ ప్రళయకారకుడగుచున్నాడు.

ఇక్కడ అమ్మ త్రిగుణాత్మకము, త్రిగుణాతీతము. 'కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి' అని ఈ పరా దేవతను ఉద్దేశించుతూ శంకరులవారు తెలిపినారు. పరబ్రహ్మము కంటే పరబ్రహ్మిణి ఉపాసన సులభము. తన్ను ఉపాసించు భక్తులను తన బిడ్డలుగా ప్రేమించి భుక్తి ముక్తులను తప్పక ఇవ్వగలదు. ఆమెను సేవించడము అత్యంత సులభము.ఆ తల్లి త్రిగుణాత్మిక.

ఈ త్రిగుణములను గూర్చి క్లుప్తముగా తెలుసుకొందాము.

1. బ్రహ్మ : రజస్సు : సృష్టి. సృష్టి కార్యము సంకులమైనది. అందుకు రజోగుణము ఆవశ్యకము. అందుకే బ్రహ్మ రజోగుణ సంపన్నుడై నిరంతర సృష్టి దీక్షను చేబూనియుంటాడు.

2. విష్ణువు: సత్వము : స్థితి: సృష్టిని చక్కబరచి దానిని ఋజుమార్గ గామిగా చేయవలెనంటే దానికి ఎంతో ఓర్పు, నేర్పు, చాకచక్యము ఎంతో అవసరము. దీనికి తగినవాడు ఒక సత్వగుణ సంపన్నుడు మాత్రమె! ఆ సత్వగుణ సంపన్నుడే శ్రీ మహావిష్ణువు. ఆయన నయము, భయము, విస్మయములను సమయానుసారుకూలముగా వాడుతూ ఉంటాడు.

3. మహేశ్వరుడు: తామసము: ప్రళయము:  ప్రకర్షేణ లయః ఇతి ప్రళయః

ఇది పరమేశ్వర తత్వము. తామస గుణ ప్రధానమైనది. ఆయనలో సకలమూ  విలీన మగుటను ప్రళయము అంటారు.

స్థూలముగా ప్రళయమును నాలుగు విధములుగా విభజించవచ్చును. 1)నిత్య ప్రళయము: ఉదా. పగలు లోకి రాత్రి , రాత్రిలోనికి పగలు. 2)నైమిత్తిక ప్రళయము:ఉదా. అతిశయించిన కోపము కలిగించు అనర్థము. 3)ప్రాకృతిక ప్రళయము :ఉదా. వరదలు, భూకంపములు. 4)ఆత్యంతిక ప్రళయము: సృష్టి యొక్క ఉపసంహారము.

ఈమూడు గుణముల సంయోగము ఆ జగన్మాతయే!

అట్టి అతిచిత్రమైన మరియు అతి పవితమైన చరిత్రకలిగి మహేశ్వరునికి అత్యంత ప్రియమైన కామాక్షీ దేవికి నమస్కారము.

5. సూక్ష్మాత్ సూక్ష్మ తరాం సులక్షిత తనుం క్షాన్తాక్షరైర్లక్షితాం

వీక్షా శిక్షిత రాక్షసాం త్రి భువన క్షేమంకరీ మక్షయామ్ ।

సాక్షాల్లక్షణ లక్షితాక్షర మయీం దాక్షాయణీం సాక్షిణీం

కామాక్షీం శుభ లక్షణైః సులలితాం వందే మహేశ ప్రియామ్ ॥5

‘అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్లు అమ్మ అణుఉ లో అణువుగా ఉంటుంది, అట్లే బ్రహ్మాండములో బ్రహ్మండమై ఉంటుంది. ఆమె కంటిచూపుతోనే రాక్షసులను తుదముట్టిస్తుంది. ఆవిధముగా సకల భువనములనూ సంరక్షించుతూ ఉంటుంది.  లక్షనకరమైన లక్షితాక్షరముల ప్రతినిధిగా ఆతల్లి నిలుస్తుంది. దిగువన వివరణను గమనించగలరు. ఆమె దాక్షాయిని. జరిగే, జరిగిన,  జరుగబోయే ప్రతి కర్మకు తానూ సాక్షిణి. అట్టి శుభలక్షిణి, సులలిత యగు , మహేశ్వరుని ప్రియురాలైన కామాక్షీ దేవికి నమస్కారము.

వివరణ:

అక్షర మాలికను 'అక్ష మాల' అని అంటారు. 'క్ష' అంటే క్షరము అనగా నాశము. అక్ష అంటే 'న+క్ష' నాశము లేనిది. 'అక్ష'అనగా కన్ను అని కూడా అర్థము. అమ్మ స్త్రీ రూపము కాబట్టి 'అక్షి' అయినది. ఆమె సాధారణ అక్షి కాదు, 'కామాక్షి'. కామితములను ఆక్షయముగా ఈడేర్చుతూవుంటుంది. మరి ఎంతవరకు? మన మనసు అమ్మ యొక్క అక్షర పదము వైపు మరలేవరకు. అప్పుడు మనలో, అమ్మలో ఐక్యము కావలెనన్న ఒకటే కోరిక ఉంటుంది. మన సాధన మనలను అప్పుడు అమ్మలో ఐక్యము చేస్తుంది. మరియొక విశేషము ఏమిటంటే అక్షరమాలలో '' మొదటిది, 'క్ష' చివరిది. అమ్మ, కోరికలు మొదలుపెట్టినది మొదలు ముగిసేవరకు ఆక్షయముగా తీరుస్తూనే ఉంటుంది. మనకు కావలసినది, అతి ముఖ్యమైనది, అమ్మ 'ఈక్ష' అనగా చూపు. కాబట్టనిది అమ్మ 'కక్ష' అమ్మ 'శిక్ష' . కావలసినది అమ్మ 'భిక్ష', అమ్మ'రక్ష' అమ్మ అక్షము అంత ప్రశస్తమైనది. అన్నిటికీ మించి ‘మోక్షమివ్వగల మహా శక్తి సంపన్న ఆ తల్లి.

ఆ తల్లి కేవలం చూపుతోనే రాక్షసులను మట్టు పెడుతుంది.మూడు లోకములనూ సంరక్షిస్తుంది. అలా చేయడం వల్ల, ఆమె శక్తి ఏ విధంగానూ తరగదు.

పూర్వము  ఉత్తరాలలో, మరువకుండా యోగక్షేమాలు విచారించేవారు. గ్రహీత యొక్క శ్రేయస్సు (కుశల-ప్రశ్నలు)ను గూర్చి అడిగేవారు. ఇందులో యోగ-క్షేమములు రెండూ ఉంటాయి. యోగము అంటే తాను పొందదలచినది సాధించడము. క్షేమము  అంటే  రక్షణ. క్షేమంకరిగా దేవి మనకు ఈ రక్షణను అందిస్తుంది ఆ తల్లి. ఈ సందర్భములో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన

ఈ భగవద్గీతా శ్లోకమును గమనించండి.

అనన్యాశ్చింతయంతో మాం యే జన: పర్యుపాసతే |

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ||భ.గీ.9-22||

ఎల్లప్పుడూ నా గురించిన  ఆలోచన కలిగినవాడు, నా పట్ల ప్రత్యేకమైన భక్తిని కలిగి ఉంటాడు. ఎవరి మనస్సులు ఎల్లప్పుడూ నాలో లీనమై ఉంటాయో వారికి, నేను లేని వాటిని అందజేస్తాను మరియు వారు అప్పటికే కలిగి ఉన్న వాటిని భద్రపరుస్తాను.

స్వామి అయినా, అమ్మ అయినా చెప్పేది ఒకే మాట. అయితే తల్లిలో వాత్సల్యము ఆర్ద్రత ఎక్కువగా ఉంటుంది. పైగా ఆమె కామాక్షి.

దాక్షాయణి (దక్ష ప్రజాపతి కుమార్తెగా జన్మించింది) అని సంబోధించడంలో మనకు ఆ తల్లి పాతీవ్రత్యము, భర్తను  గౌరవించవలసిన తీరుపై ఆ తల్లికి గల అప్రతిహతమైన శ్రద్ధ మనకు తెలియజేస్తూవుంది.

ఆ తల్లి  పాప పుణ్యాలకు   సాక్షి మాత్రమే! ఆమెకు వానితో సంబంధము ఉండదు. గీతాచార్యుడు కూడా ఇదేమాట కదా చెప్పినాడు.

దేవి, ఎంతో  సౌమ్యము మరియు సౌందర్యము కలిగియుండుటయే గాక,తన రూపములో అన్ని శుభాలను కలిగి యుంటుంది. అట్టి 

మహేశశ్వరుకు ప్రీతిపాత్రమైన తల్లికి నమస్కారము.

ఒక ముఖ్య విషయము తెలిపి ఈ శ్లోక వ్యాఖ్యానమును ముగిస్తాను.

దాక్షాయణి హోమాగ్నికి ఆహుతియైనపుడు శ్రీ మహావిష్ణువు ఆమె నిర్జీవమైనశరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఛేదించగా ఆ శరీరము 51 క్షేత్రములలోపడినాయి. ఈ 51 అన్నది 51 అక్షరములు కలిగిన సంస్కృత  అక్షర మాలికకుప్రతీక. అంటే ఈ శక్తి పీఠాలు ఈ 51 అక్షరములకు సంకేతము.

శంకరులవారు ఆమెను లలిత అని సంబోధించినారు. ఈ మాటకు 'ఆడుకొనుట' అను ఒక అర్థము ఉంది.  ఏవిధముగా అంటే ఆమె శిష్టులకు 'రక్షదుష్టులకు 'శిక్ష' ముముక్షువులకు 'మోక్ష'మిస్తుంది. తల్లి 'రక్ష' లేనివాడు రాక్షసుడే! వానిని తన చూపుతోనే వధించ గలదు ఆ తల్లి. అట్టితల్లిని నమ్మిన
వారికి మోక్షప్రాప్తి తప్పక కలుగుతుంది.
వచ్చే శుక్రవారము మరొక శ్లోకము....

6. ఓంకారాంగణ దీపికామ్ ఉపనిషత్ప్రాసాద పారావతీమ్

ఆమ్నాయామ్బుధి చంద్రికామ్ అఘతమః ప్రధ్వంస హంస ప్రభామ్ ।

కాంచీ పట్టణ పంజరాऽऽన్తర శుకీం కారుణ్యకల్లోలినీం

కామాక్షిం శివ కామరాజ మహిషీం వందే మహేశప్రియామ్ ॥6

 ఈ శ్లోకము  చాలా సముచితమైన రూపక, ఉపమానాలతో నిండిన సుందరమైన శ్లోకము. ఇక్కడ అమ్మవారిని శంకరులవారు విభిన్న రీతుల అమ్మవారిని ప్రణుతించుట జరిగినది. ఆమెను దీపంలా, ఆడ పావురమూలా , ప్రకాశించే చంద్రునిలా, తేజస్వి  అయిన సూర్యునిలా , పంజరంలోని చిలుకళా, మరియు అగాధ  సముద్రముగాపోల్పబడినది. 

ఓంకారాంగణ దీపికామ్ ఉపనిషత్ప్రాసాద పారావతీమ్

ఆమ్నాయామ్బుధి చంద్రికామ్ అఘతమః ప్రధ్వంస హంస ప్రభామ్ ।

కాంచీ పట్టణ పంజరాऽऽన్తర శుకీం కారుణ్యకల్లోలినీం

కామాక్షిం శివ కామరాజ మహిషీం వందే మహేశప్రియామ్

 ఆతల్లి ఓంకార ప్రాంగణపు దీపము. (పూర్వము ప్రతి ఇంటికి  ముంగిలిలో దీపము ఉండేది. అది బాటసారులకు మార్గదర్శి. దీపము 'మీ దాహార్తి, క్షుదార్తి  తీర్చుకొనుటకు ఇక్కడ ఒక గృహము ఉన్నది అని చెప్పుటకు సంకేతముగా ఉండేది). అంటే ఓంకార దీపమునకు వెలుగు ఆతల్లియే అంటే ఆతల్లి ఓంకార స్వరూపిణి అని చెప్పక చెప్పడమే! ఉపనిషత్తుల సౌధములో సంచరించు ఆడపావురమై ఒప్పారుచున్నది. ఆతల్లి వెన్నెలయయి ఆకాశమున విరియగా దానిని చూసి ఉప్పొంగున్నది వేదసాగరము. అంటే సకలవేదసారము ఆతల్లియే అన్నది ఆ వర్ణన యొక్క సారాంశము. కేంద్రబిందువైన ఓంకారములో ఆతల్లి నివసించగా, ఆకేంద్ర పరివృతమైయున్నదే సకలవేద సముచ్చయము.

వేదసముద్రము అమ్మవారను వెన్నెల అగుపించినంతనే ముఖముగా ఆనందాతిరేకము తోనూ అమావాస్యనాడు ఇంకా ఎంత ఎత్తుననిలచినదో చూద్దాము అన్నట్లు  ఎగసి పడుతూ ఉంటుంది. అధమాధమమైన పాపములను తృటిలో తన తెజోమహిమతో విద్వంసము చేసివేస్తుంది. ఆదేవి కాంచీపురమను పంజరములో  ఆడ చిలుకయై నడయాడుచున్నది. 

కామరాజ' అనగా కామమును జయించిన పరమస్గివుని పట్టమహిషియగు ఆమహేశ్వరుని ప్రేయసియగు కామాక్షికి నమస్కరించుచున్నాను.

 వేదాలు మరియు ఉపనిషత్తులలో, అమ్మ అణువణువునా అంతర్లీనముగా అగుపించుతూనే ఉంటుంది.

వాటిని శక్తివంతం చేయడంలో ముఖ్యమైన భాగం. ఆమె గొప్ప శక్తి చల్లదనంతో పెరుగుతున్న పౌర్ణమితో పోల్చబడింది

ఆతల్లి జ్ఞానకిరణములు  ఉదయార్క భాసురమై  పాపమను చీకట్లను చిదిమివేస్తుంది.

అపారమైన ఆ కాంతిమతి చిత్త శుద్ధి, సద్భక్తి కల్గిన మాబవకోటికి కల్పవృక్షము. ఆతల్లి చరణములకిదే సాష్టాంగ దండప్రణామము.

మరొక శుక్రవారము మరొక శ్లోకముతో........

7. హ్రీంకారాత్మక వర్ణ మాత్ర పఠనాద్ ఐన్ద్రీం శ్రియం తన్వతీం
చిన్మాత్రాం భువనేశ్వరీమ్ మనుదినం భిక్షా ప్రదాన క్షమామ్ ।
విశ్వాఘౌఘ నివారిణీం విమలినీం విశ్వంభరాం మాతృకామ్
కామాక్షీం పరిపూర్ణ చంద్ర వదనాం వందే మహేశప్రియామ్ ॥7॥
 అపారమైన శక్తిని కలిగిన హ్రీమ్ అన్న బీజాక్షరమును పఠించుట ద్వారా, మనము  ఇంద్రునికి సమానమగు సంపద్వరిష్టులము కావచ్చును.
ఆదేవి సృష్టించిన ఈప్రపంచానికి యజమానురాలు, అంతేగాక మన ఆత్మలో స్వచ్ఛమైన స్పృహ కలిగించి ఆత్మయందే నివసించుతూ ఉంటుంది, మనము మాతాపూర్ణచిత్తులమై ఆ తల్లిని తలచుకొంటూ ఉంటే!
ఆవిధముగా ఆ తల్లిని తలచుకొంటూవుంటే ఆమె నిరంతరమూ మనకు కొరతలేకుండా భిక్షను సమకూర్చుతుంది. ఇక్కడ శంకరులవారు అమ్మను అన్నభిక్షయే కాకుండా ఎభిక్షనైనా ఇవ్వగల సామర్థ్యముగల ఆతల్లిని ఒక సందర్భములో వాదభిక్ష కోరుకొన్నాడు. ఆ వాదము పండిత ప్రకాండుడు, కర్మ సిద్ధాంత మేరువు అగు మండనమిశ్రులవారితో. న్యాయ నిర్ణేత వారి అర్ధాంగిని ఉభాయభారతీదేవి గారు. అమ్మవారి దయతో శంకరులవారు నెగ్గి మండనమిశ్రులవారిని తనశిష్యునిగా స్వీకరించుతాడు, ఉభాయభారతీ దేవిని శృంగేరీ పీఠ అధిదేవతగా విరాజిల్లమని ప్రార్థించుతాడు. అది ఆ తల్లి గొప్పదనము. కావున ఆతల్లి ఏభిక్ష నోసంగుటకైనా 
సమర్థురాలు.
ఇక మూడవ చరణమునకు వస్తే అఘము అంటే పాపము. ఒఘము అంటే రాశి. ఆ తల్లి ఈ విశ్వాంతరాళమునందలి సమస్త పాపరాశిని సమూలముగా నివారించగలదు. ఆమె విమలిని. ఆమెకు ఏమలినములూ అంటవు. సమస్త విశ్వమును భరించే తల్లి ఆమెయే! 
ఆమెది మచ్చలేని పున్నమి చంద్రుని మోము. ఎంతసేపు చూస్తూవున్నా తనివితీరదు. అట్టి మహేశ్వర ప్రియతమురాలయిన తల్లికి నమస్కరించుచున్నాను. 
వచ్చే శుక్రవారము మరియొక శ్లోకముతో..........

8. వాగ్దే వీతి చ యాం వదన్తి మునయః క్షీరాబ్ధి కన్యేతి చ

క్షోణీభృత్తనయేతి చ శృతి గిరో యామామనన్తి స్ఫుటమ్ ।

ఏకనేక ఫల ప్రదాం బహు విధాऽऽకారాస్తనూస్తన్వతీం

కామాక్షీం సకలార్తి భంజన పరం వందే మహేశ ప్రియామ్ ॥8

ఆతల్లిని వాగ్దేవియగు సరస్వతిగాను , క్షీరాబ్ధి కన్యకయగు లక్ష్మీదేవి గానూ స్తుతించుచుంటారు. అలాగే ఆతల్లి క్షోణీభృత్తనయ అనగా ప్రకృతి క్షోభకు గురికాకుండా భూమికి సుస్థిరతను చేకూర్చుటకై ఏర్పడినట్టి పర్వతములకు రాజయిన హిమవంతుని పుత్రిక యగు పార్వతి కూడా ఆ తల్లియే నని వేదములు స్పస్టముగా ఘోషించుచున్నవి.

ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ మీముందు ఉంచుచున్నాను. పర్వతముల ఉనికివల్ల భూగోళము తన చలనమును గతి భేదము కలుగనీక ఒకే కక్ష్యలో  తిరుగుతూ వుంది. ఇది వేదవాక్కు. దానిని శంకరులవారు ఉపయోగించినారు. ఈ వాస్తవమును ఇటీవలి కాలములో ఆధునిక శాస్త్రజ్ఞులు ధృవీకరించినారు.

ఆతల్లి మనము ఒకే కోరిక కోరితే ఆ ఒకటే తీరుస్తుంది, మన కోరికలు బహువిధములైతే అవన్నీ తీరుస్తుంది. ఏది ఏమయినా మనము ఈ పని సద్బుద్ధి, సదాలోచనతో చేయవలసియుంటుంది. ఆమె అవతారమూర్తి దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ఆమె అనేక అవతారములను ఎత్తవలసి ఉంటుంది. అందువల్ల ఆమె బహువిదాకార యుక్తమగు తనువు కలిగియుంటుంది.

మన ఆర్తి ఏదయినా సరే ఆతల్లితో మొర పెట్టుకొంటే తక్షణమే తీర్చుతుంది. అట్టి పరమేశ్వరుని ప్రియురాలగు తల్లికి నమస్కరించుచున్నాను. 

వచ్చే శుక్రవారము మరొక శ్లోకముతో ........ 

9 మాయామ్ ఆదిమకారణం త్రి జగతాం ఆరాధితాంఘ్రి ద్వయం

ఆనన్దామృత వారి రాశి నిలయాం విద్యాం విపశ్చిద్ధియామ్ ।

మాయా మానుష రూపిణీం మణి లసన్మధ్యాం మహామాతృకామ్

కామాక్షిం కరి రాజ మంద గమనాం వందే మహేశ ప్రియామ్ ॥9

కామాక్షీదేవి మాయామాయి. భక్తీ తత్పరత కలిగేవరకు మనసావాచాకర్మణః ఆతల్లిని హృదయ ఫలకములో నిలుపుకోనేవరకూ, మనము తల్లి మాయలో చిక్కుకోన్నట్లే! స్మ్లేషలో ఈగలమై ఇంత కొట్టుకొన్నా వెలికి రాలేము. అన్నిటికి ఆతల్లె శరణము ఆతల్లె కారణము.  ఈ మూడు లోకముల ఆవిర్భావమునకు ఆమెయే కారణ కర్త. ఆమె త్రిజగన్నుత. ఆమె పాదదోయి ముల్లోకములకు పూజనీయము. ఆనందామృత సంద్రము ఆతల్లి హృదయము. సకలవిద్యలకూ ఆమెయే హేతుభూతము. విపశ్చిత్+ధియాం అనగా జ్ఞానికి ఆమె బుద్ధిగా ప్రకాశించుతూ ఉంటుంది.

ఆమె మాయామానుష రూపిణి. అనగా ఆమె తన మాయచే మనిషి రూపములో ఉన్నా మనము ఆమెను గుర్తించలేము. మంచి లేక చెడ్డ , కర్మనుబట్టి ఆమె చేసి తనదారిన తాను పోతుంది. ఆమె కటిని అంటుకొనియున్న కాంచి అనగా వఢ్యాణము మణుల కాంతితో దేదీప్యమానముగా విరాజిల్లుతూ వున్నది ఆ మహాతల్లికి. అట్టి ఎంతో హుందాగా ఏనుగుల రాజు నడచిన తీరుగా మనదగామనయై నడచే, ఆ పరమేశ్వరుని అత్యంత ప్రియురాలికి నమస్కారము.

చివరి శ్లోకము భావ సహితముగా దీపావళి రోజున మీముందుంచి స్వస్తి పలుకగలను......

10. కాంతా కామదుఘా కరీంద్ర గమనా కామారి వామాంక గా

కళ్యాణీ కలితావతార శుభగా కస్తూరికా చర్చితా

కంపాతీర రసాల మూల నిలయా కారుణ్యకల్లోలినీ

కళ్యాణాని కరోతు మే భగవతీ కాంచీ పురీ దేవతా ॥10

ఆమహిమాన్విత కాంత కామధేనువు.  మన ప్రతి న్యాయమైన కోరికను తీర్చుతుంది. ఆతల్లిని నమ్మికొలిచినవారికి కొరత ఎన్నటికీ ఉండదు ఆమె నడక గజరాజు నడకను పోలి ద్యుతియుతమైన పదగతి కలిగి యుంటుంది. అర్ధనారీ స్వపుశుడగు పరమేశుని ఎడమవైపు భాగమును ఆక్రమించియుంటుంది. ఆతల్లి కల్యాణియై అనగా సకలశుభదాయినియై అనేక రూపముల దాల్చి లోకాలకు శుభములను చేకూర్చుతూ ఉంటుంది.  కస్తూరి అలదిన దివ్య సుగంధ భరితమగు మేనిని కలిగియుంటుంది.

 

ఒక సందర్భములో అమ్మవారు పరమేశ్వరుని మంటి లిగామును తయారుచేసి పూజించసాగింది. అమ్మవారి సంయోగము లేని మహేశ్వరుడు సంతప్త శరీరుడై తమకననుభవిన్చుచుండగా గమనించిన గంగ ఆయన తాపమును తీర్చు ప్రయత్నముగా అలోకగా ఆయన శరీరముపైకి జారజొచ్చింది. ఆగంగాప్రవాహము కామాక్షీ తపోభూమికి రాప్రయత్నిచగా అందుబాటులులో ఉన్న ఒకపుర్రెను సమంత్రకముగా గంగావచ్చేదారికి అడ్డుపెట్టింది. ఉధృతిని పెంచుకొని ప్రవహించుచున్న గంగ ఓడలు జలదరించినది అనగా కంపించి తిరోన్ముఖ గమనామునండుకోంది. అట్లు కంపించుటచే గంగానది 'కంపానది'గా కూడా పిలువబడుచున్నది. ఆ గంగా శాఖను అక్కడివారు ‘పాలార్ గా పరిగానిన్చుతారు. ‘పాలార్ అంటే ‘పాల-ఏరు అని అర్థము. ఆఎతి ఒగ్గున మామిదిచేట్టునానుకొని తపోదీక్షలో ఉన్న కరునాసాగారము ఆతల్లి. ఇక్కడ మామిడి చెట్టు ప్రస్తాపన ఎందుకు వచ్చినది అమ్మవిషయము తెలుసుకొందాము.

ఈ దేవాలయంలో  3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం.

అయితే ఇంతటి ప్రాసశ్థ్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం . ఈ మామిడి వృక్షం యొక్క ంఎీకాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు.ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో,దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతిపరమేశ్వరులు, పార్వతిదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు.

దయ కరుణ జాలి ఆర్ద్రత అనురాగము వాత్సల్యమును కలిగి శుభములను సమకూర్చు తల్లీ నాకును శుభము కలిగించు అమ్మా ఓ కాంచీపురీ సంరాజ్ఞీ! నీకు మనసా శిరసా ఉరసా నమస్కరించుచున్నాను.

కామాక్షీ స్తోత్రం సంపూర్ణం.

ప్రతియోక్కరికి పేరుపేరునా, కుటుంబ సభ్యులను కూడా కలిపి దీపావళి మహాపర్వదిన శుభాకాంక్షలు.

స్వస్తి.  






 





 


Comments

  1. కామాక్షీ దేవి స్తోత్రం లో నాలుగవ శ్లోకముతో పాటుగా యెంతో సుస్పష్టమైన వివరణలను శ్లోకార్థమునకు అన్వయముగా విశ్లేషించినారు.
    బ్రహ్మ తన రజో గుణముతో సృష్టిని చేయుట.
    విష్ణువు తన సత్వ గుణముతో సృష్టిని సంరక్షించుట.
    ఈశ్వరుడు తన తమో గుణముతో లయకారకుడౌట.
    దివా రాత్రులకు కారుకుడౌట మొదలగు విషయాలను వివరించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మువ్వురకూ ఆ శక్తులు అమ్మ వారి వలననే లభించినవి వివరించారు.
    ఆ పరబ్రాహ్మి యైన పరాదేవతను పూజించుట,ధ్యానించుట,ఉపాసించుటలోని సౌలభ్యమును గురించి బాగా వివరించారు. ఎంతో జ్ఞాన దాయకమైన సందేశమును అందించినందుకు మీకు అనేకానేక అభినందనలండీ. ధన్యవాదాలండీ ... రామ మోహన రావు గారూ.🙏🙏🙏

    ReplyDelete
  2. ఓంకారం గుణం దీపికామ్
    ఉపనిషత్ప్రాసాద పారావతీమ్
    అని ప్రారంభమైన ఆరవ శ్లోకమును అందించి
    విస్తృతమైన విశ్లేషణాత్మక వ్యాఖ్యానములనందించేరు.
    ఎంతో ఆనందం కలిగినది.
    పూర్వము ప్రతియింటి ప్రాంగణములో నూ గుమ్మము దగ్గర ఓ ప్రక్కన దీపము వెలుగుతూ ఉండేదని తెలిపారు.
    బాటసారులకు అత్యవసమైతే ఆ యింట్లో భోజనము పెట్టేవారు.
    ఓంకార రూపిణి యైన ఆతల్లి దయవలననే ఆకలి దాహం తీరుతాయి..అని తెలిపారు.ప్రతి పాదములకు సంపూర్ణ వివరణ యిచ్చేరు. ఎంతో జ్ఞాన దాయకమైన మీ సాహిత్య సేవకు అనేక అభినందనలండీ... ధన్యవాదాలండీ రామ మోహన రావు గారూ
    🌹🙏🙏🙏🌹

    ReplyDelete
  3. శ్రీ కామాక్షీ దేవి స్తోత్రంలోని తొమ్మిదవ శ్లోకమును చాలా లోతైన విశ్లేషణతో అందించేరు.
    ఇహలోకానికి చెందిన వాంఛతో శ్లేష్మం లోని యీగలవలే కొట్టుమిట్టాడుతున్న మానవులు
    అమ్మ కరుణను పొందాలంటే అమ్మవారిని తమ మనోఫలకాలపై ప్రతిష్టించుకొని,ధ్యాన,పూజాదులతో
    యే విధంగా ఆ అమ్మ ఆశీస్సులను పొందగలరు అను విషయాలను యెంతో చక్కగా వివరించారు.
    అకుంఠిత మైన మీ దీక్ష, అందరికీ మీ జ్ఞాన వితణలకు
    అనేక అభినందనలండీ.ధన్యవాదములండీ రామ మోహన రావు గారూ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి