అజరామర సూక్తి (బ్ర.శ్రీ. రేమెళ్ళ వారికి పంపినది)

 

అజరామర సూక్తి (బ్ర.శ్రీ. రేమెళ్ళ  వారికి పంపినది)

ఈ దేశమునకు మొదటి పేరు అజ నాభము. అజుడు అంటే బ్రహ్మ దేవుడు. నాభి అంటే బొడ్డు. అంటే గరిమనాభి (Center of Gravity ) అంటే ఈ దేశము ప్రపంచమునకు గరిమనాభి అనియే కదా అర్థము. ఇది సనాతనము. తపస్సంపన్నులైన మహర్షులు, మహానుభావులు పుట్టిన దేశము ఇది. వారు చెప్పిన నీతి వాక్యములను వీలయినంత వరకూ రెండు రోజులకు ఒకటి వంతున తెలుసుకొందాము.మన ఋషులు మనకు చెప్పిన  నీతులు అగణితములు అనగా లెక్కకు మిక్కుటములు. ప్రపంచములోని ఏదేశము కూడా నీతులకు శాస్త్ర స్థాయిని  ఇవ్వలేదు. మన వాతావరణమునకు మన సాంప్రదాయమునకు సంబంధించిన అనేక సూక్తులను సంస్కృతములో మనకు అందించినారు. తమ లోపములను సవరించుకోనదలచిన పాఠకులు తప్పక ప్రతిరోజూ ఈసూక్తులను చదివి తమను తమ కుటుంబమును, ఆవిధముగా దేశమును ఎంతో ఉన్నత స్థితికి తీసుకుపోయినవారవుతారు. ప్రపంచములో తప్పులే చెయ్యని మానవులు  కూడా ఉంటారేమో! వారు ఈ 'అజరామర సూక్తులు' చదువవలసిన అవసరము ఉండదు. మహనీయుడు భర్తృహరి తన నీతి, శృంగార, వైరాగ్య శతకముల ముందుమాటగా ఏమి చెప్పినారో తెలుడుకొందాము,

బోద్ధారో మత్సరః  గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాఃl 

అభోధోప హతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితంll భర్తృహరి

విద్వాంసులు తమకన్నీ తెలుసుననే అహంకారముతో ఉన్నారు.  రాజులు విషయాలోలురయి సద్గురువులను దరిజేరనీయరు. మూర్ఖులు తమ వ్యాసంగమును మించినది లేదు అందుచే ఏమీ విననక్కరలేదు అనుకొంటారు. మరినేను చెప్పదలచుకొన్న సుభాషితములు నాలోనే జీర్ణమై పోవలసినదేనా అని మదనపడి భర్తృహరి గారు చివరకు ఒక నిర్ణయానికికి వచ్చి, “నేనుచెప్పేది చెబుతాను, వినేవాడు విని బాగుపడనీ విననివాడు తన భవితను తానే వ్రాసుకొననీ” అనుకొంటాడు. అనుకొనుటయే గాక నీతి శృంగార వైరాగ్య శతక రచన చేసి లోకానికి బహూకరించినాడు.

అందువల్ల జిజ్ఞాసువులైన చదువరులు దైవసమానులు. అట్టివారికందరకూ  నమస్కరించి మొదటి సూక్తిని మీ ముందుంచుచున్నాను.

అజరామర సూక్తి – 1

చింతాయాశ్చ చితాయాశ్చ బిందుమాత్రవిశేషతా l

సజీవం దహతే చింతా నిర్జీవం దహతె చితా ll - సమయొచితపద్యమాలికా

 

చితి చింతల తిలకించిన

చితి శవమును గాల్చు గాని చింతటు గాకన్

బతికున్న వాని గాల్చును

చితి కన్నా చింత మిన్న చెప్పగ రామా!

 మాత్రమేతేడా!(దేవనాగరి లిపిలోకూడా బిందువు ఒక్కటే తేడా).  ఈ చింత అనేది మనిషిని బ్రతియుండగానే కాల్చి వేస్తుంది , 'చిత' కాల్చేది చచ్చినవాని మాత్రమే.కావున వ్యక్తి ఎప్పుడూ చింతను దూరముంచి తగిన పరిష్కారము కొరకు మాత్రమే ఆలోచింపవలెను.

అజరామర సూక్తి – 2

ఘటం భిద్యాత్ పటం ఛింద్యాత్ కుర్యాత్ రాసభరోహణం l

ఏన కేనాప్యుపాయేన ప్రసిద్ధః పురుషో భవేత్ ll  -సమయొచితపద్యమాలికా

కడవ పగులగొట్టినా కట్టుగుడ్డ చించినా

కాని పనులు చేసినా గాడిదపై నెక్కినా

నవ్విపోయినా గూడా నాకేమిటి సిగ్గు

మానమెటుల పోయినా మాంగల్యం ఉన్నచాలు

ఈ సూక్తి 'మానము పోయినా ఫరవాలేదు మంగళ సూత్రము ఉంటే చాలు' అని అనుకొనే నేతలకు అంకితం.

అజరామర సూక్తి – 3

దేహే పాతిని కా రక్షా యశో రక్ష్యమపాతవత్l

నరః పాతితకాయోపి యశః కాయేన జీవతిll - సుభాషితరత్నభాండాగారము

 మట్టి కరిచే కట్టెయైన ఈ శరీరానికి ఎన్నియో హంగులు రంగులు తీర్చిదిద్దుతున్నాము,

కానీ ఈ శరీరము శాశ్వతమా అన్న చింత రవ్వంతైనా మనసులోనికి రావడము లేదు.

భాగవతము లోని వామనావతార ఘట్టములో బలి చక్రవర్తి చెప్పే ఈ పద్యము చూడండి :

కారే రాజులు,రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిన్ జెందరే

వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలరే, భూమి పై

పేరైనంగలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశః కాములై

ఈరే కోర్కెలు, వారలున్ గలుగరే యిక్కాలమున్ భార్గవా

ఎంతటి గొప్ప మాటో చూడండి. పై మెరుగులు ,మై మెరుగులు పెరిగి వేలకు వేలు శరీరానికి ఖర్చు చేయుట అనవసరమని గ్రహించి , ఆ నిష్ప్రయోజన కార్యములకు

సొమ్ము వమ్ము సేయక అందులో అంతో ఇంతో ఎంతో కొంతైనా ఖర్చు పెట్టి, మనపేరు కలకాలము కాకున్నా, మన నిర్గమనమువరకు తదనంతరము

కొంతకాలమైనా నిలిచే పనులు చేస్తే మన ప్రతిష్ఠ శోభిల్లదా !

అజరామర సూక్తి – 4

 ఉపకర్తుం యథాః స్వల్పః సమర్థో న తథా మహాన్ l

ప్రాయః కూపస్త్రుషాం హంతి న కదాపి తు వారిధిః ll  సుభాషితరత్నసముచ్చయము

ఉపకార గుణము కలిగిన పేద, ధనికుడైన లోభికన్నా, ఎంతయోమిన్న. దాహార్తికి మంచినీటి బావి ముఖ్యము గానీ మహాసముద్రమునేమిచేసుకోగలడు. ఇదే అర్థము గల పద్యమును మనము గువ్వల చెన్న శతకములో గూడా చూడవచ్చు

కలిమి గల లోభికన్నను

విలసితముగ పేద మేలు వితరణియైనన్

చలి చలమ మేలుకాదా

కులనిధి అంబోధికన్న గువ్వలచెన్నా!

(చలి చలమ అంటే నదీ తీరము లోని నెమ్ము గల ఇసుకను కాస్త త్రవ్వి ఒక వెడల్పయిన గుంత చేస్తే అందులో అమృత తుల్యమైన నీటియూట చూడవచ్చును. ఆ త్రవ్వబడిన గుంత లేక గుంటను 'చలి చలమ' అనిగానీ 'చలమ' అని గానీ అంటారు. ఇటువంటి చలమను సముద్రమును ఆనుకొని వున్న ఒడ్డున త్రవ్వినా ఉప్పు నీటికి బదులు మంచినీరు పొందగలము. ఈ సందర్భములో నేను వ్రాసిన పద్యము సముచితమని భావించి మీ ముందుంచుచున్నాను.

కలిగిన ధనమును పాత్రత

కలిగిన సజ్జనునికివ్వ కలుగు యశంబే

కలిగిన వానికె యొసగిన

కలితార్థము చెడును  ఖ్యాతి తరుగును రామా!

దానపరత్వ గుణమును కలిగినవాడు గ్రహీత పాత్రుడా కాదా అన్నది తప్పక గ్రహించవలెను. ఆ గుణమే లేనివాడు నిధులను రక్షించుటకు, చుట్ట చుట్టుకొని, అనుభవించుటకు యోగ్యత లేని అజగరము అనగా పాము తో సమానము.

అజరామర సూక్తి – 5

రోహతే సాయకైర్విద్ధం వనం పరశునా హతం l

వాచా దురుక్తం భీభత్సం న సం రోహతి వాక్ క్షతం ll- మహాభారతము, ఉద్యొగపర్వము

అలుగు (బాణపు మొన) చేత కలుగు గాయము కాలాంతరము లో మానుతుంది. గొడ్డలి వ్రేటుకు గురియైన చెట్టు కాలాంతరమున చిగురించుతుంది కానీ మనమున నాటిన మాటలు వెలికి తీయలేము కదా. కొన్ని మాటలు కలిగించే బాధ జీవితాంతమువరకు తీరకపోగా ఆబాధ వ్యాకులతను పెంచి ఎట్టి వ్యాధికయినా కారణము కావచ్చును. నేను వ్రాసిన ఈ పద్యమును ఒకపరి తిలకించండి.

చింతలు వ్యాధుల హేతువు

చింతలు ధృతి నిలిపివేయు చెంగట చేరన్

చింతలనెంతగ మానిన

చెంతన అంతంత సుఖము చేరును రామా!

తెలుగు మహా భారతములోని ఉద్యోగ పర్వములోని విదుర నీతి లో ఈ భావము ఈ పద్యరూపములో వుంది:

తనువున విరిగిన యలుగుల

ననువుగ బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్

మనమున నాటిన మాటలు

వినుమెన్ని నుపాయముల వెడలునె యధిపా !

కావున మదిని బాధా నిలయముగా మార్చివేయవద్దు.

స్వస్తి.

చెరుకు రామ మోహన్ రావు

అజరామర సూక్తి – 6

 ప్రకృత్యామిత్రా హి సతామసాధవః l కిరాతార్జునీయము(మహాకవి భారవి)

దుష్టులు తమ మనోప్రవృత్తి వలన సమాజమునకు  సహజ శత్రువులు.ఈ సూక్తికి అనుబంధముగా ఈ వేమన పద్యమును మీ ముందుంచుచున్నాను.నిజమయిన దుష్టుడు ఎట్టివాడు అన్నది ఆయన మాటలలో గమనించండి.

వాక్కు శుద్ధి లేనివాడు చండాలుడు

ప్రేమ శుద్ధి లేక పెట్టు టెట్లు?

నొసలు భక్తుడైన నోరు తోడేలయా!

విశ్వదాభిరామ వినురవేమ

చండాలుడంటే ఎవరు? పుట్టుకతోనే అస్పృశ్యుడనే ముద్ర వేసి దూరంగా పెట్టబడినవాడు కాదు. చండాలుడంటే మాటలో స్వచ్ఛత లేనివాడు, స్నేహంలో పవిత్రత లేనివాడు, హృదయమున ప్రేమ నిండనివాడు లేక అసూయతో నిండిన హృదయము కలవాడు.  నిజమునకు పయోముఖ విషకుంభము. అట్టివాడు ఎంత దానము చేసినా దానివల్ల ప్రయోజనం లేదు.  చండాలుడు అనే మాటకు కౄర కర్ముడు అని అర్థం. కాని, ఇది ఈ సందర్భమునందు ఒక వర్గానికి ఆపాదించ బడినది కాదు. వేమన్న జన్మ చండాలునికి కాలంతరంలో మోక్షమన్నా ఉంటుందేమో కాని కర్మ చండాలునికి మాత్రం ఎప్పటికీ మోక్షం లభించదు అని అంతర్లీనమగు అర్థమును మనకు ద్యోతకమౌతుంది. ఇక ప్రేమ. ఈ మాటకు ఈ రోజుల్లో ఎక్కువగా స్త్రీ పురుషుల మధ్య వలపుగా అనురాగంగా వాడుతున్నారు గాని ఇది చాలా పెద్దది. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, గురువు ప్రేమ, సోదర ప్రేమ ఈ విధముగా ఎన్నో విధములగు ప్రేమలు ఉండగా స్త్రీపురుష సంబంధమునకు మాత్రమే వాడుతునారు. అది మన కర్మ. వాత్సల్యము అన్నమాట

ప్రేమకు పరాకాష్ట. ‘నొసలు భక్తుడైన’ అంటే నుదుట నామాలతోనో, బూడిద తోనో, బొట్టుతోనో ఉంటేనే భక్తుడవుతాడా? స‘బాహ్యాభ్యంతర శ్శుచిః’ అంటూ ఉన్నది శాస్త్రము. వ్యక్తికి లోన  ప్రేమ, దయ ఉన్నప్పుడే నిజమైన భక్తి ఏర్పడుతుంది. తోడేలు క్రూరమైనదే! పైగా అది పరాన్న భుక్కు. దౌష్ట్యము ఉంది హీనత ఉంది. సమాజమునకు ఇటువంటి వారు శత్రువులు కాక వేరేమౌతారు?

ఇట్లాంటివాడి నొసట భక్తి చిహ్నాలు ఉంటే ఉండొచ్చు గాని నోటికి మాత్రం క్రూరమృగాల లక్షణాలే ఉంటాయి అంటున్నాడు వేమన. ఇటువంటి వారు సమాజమునకు సహజ శత్రువులు. దేనికైనా త్రికరణ శుద్ధి అన్నదే మిక్కిలి ముఖ్యము.త్రికరణ శుద్ధి గల్గినదే నిజమైన వాక్కు. అది మనస్సులోంచి నోటిద్వారా రావాలి. వచ్చిన తర్వాత అది ఆచరణగా మారాలి. ఈ సందర్భముగా నేను వ్రాసిన ఈ పద్యమును తిలకించండి:

మనసు మాట లోన మాటేమొ పనిలోన

పనికి పట్టుదలను పదిల పరచి

కష్టపడెడు వాడు కడు గొప్పవాడురా

రామమోహనుక్తి రమ్య సూక్తి

 

పై విధముగా పనిచేసినపుడే అది త్రికరణ శుద్ధి అవుతుంది. శుద్ధిఅంటే నిర్మలత్వం, పరిశుభ్రత, ఇలా ఎన్నో అర్థాలు. ‘ఆత్మశుద్ధి లేని ఆచార మది ఏల’ అన్నాడు వేమన్న మరోకచోట. అలాగే భావశుద్ధి. అంటే మన మనసులో మైల ఉండకూడదు. ఇక దేహశుద్ధి, అన్న మాటకు విపరీతార్థము తీసుకోవద్దు’ అంటే స్నానాదులు అన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ వాక్శుద్ధి లేనివాడికి ఆ ‘దేహశుద్ధే’ మంచి బహుమతి.

స్వస్తి.

చెరుకు రామ మోహన్ రావు

అజరామర సూక్తి – 7

 హస్తస్య భూషణం దానం సత్యం కణ్ఠస్య భూషణంl

 శ్రోత్రస్య భూషణం శాస్త్రం భూషణైః కిం ప్రయొజనంll

దానము  చేతులకు ఆభరణము, కంకణములు కావు. సత్య వాక్కుకంఠాభరణము కానీ పసిడి దండలు కాదు. సద్వాక్య శృతి కర్ణాభరణముగానీ కుండలములు గావు. బాహ్యాలంకారాలు నిరర్థకములు. సుమతి శతకకారుడు పై విషయమునే ఈ క్రిందివిధముగా ఎరుకపరచినాడు.పెద్దలు ఎవరు చెప్పినా మాటతీరు తుందేమో కానీ మనోభావాన మారదు.

చేతులకు దొడవు దానము

 భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో

 నీతియ తొడ వెవ్వారికి

 నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

చేతులకు కంకణములు కడియములు ఆభరణములు కానేరవు. కేవలము దానమొకటే భూషణము. రాజులకు నీతి, నియతి ఆభరణములు, అంతే కానీ

కేయూర మణిమకుటములు కాదు. మానవ జన్మమెత్తిన ప్రతియొకరికీ నీతి నియమము నిష్ఠ ముఖ్యముగానీ మెయి నిగారింపులు కాదు. ఇక స్త్రీకి మానమే

ప్రాణము. అందుకే పెద్దలు

ప్రాణం వాపి పరిత్యజ్య మానమేవాభి రక్షతు |

అనిత్యో భవతి ప్రాణో మానమా చంద్ర తారకం|| అన్నారు.

ప్రాణము పోయినా మానము కాపాడుకొమ్మని చెప్పినారు. నేడు మానమునకు కొలమానము శూన్యము. మళ్ళీ మానవతా విలువలు మహిపై అంటే భూమిపై

వర్దిల్లుటకు కంకణము కట్టుకొందాము.ప్రాణము ఎప్పుడయినా పోవచ్చు. సంపాదించిన సత్కీర్తి కలకాలమూ నిలుస్తుంది.

ఇపుడు ఈ భర్తృహరి సుభాషితమును ఒకపరి పరికించెదము.

కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలా

న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః ।

వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే

క్షీయంతేఽఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్‌ ॥

పై సంస్కృత పద్యమునకు ఏనుగు లక్ష్మణకవి గారి తెనుగు సేతను ఈ దిగువన చదవండి.

భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగాధ తారహారముల్

భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్

భూషలు గావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి, 'వా

గ్భూషణమే సుభూషణము' భూషణముల్ నశియించునన్నియున్

మానవులకు కనకాంకితమగు నీల మరకత మాణిక్య పుష్యరాగాదిమణిమయ భూషణాదులు శోభను చేకూర్చలేవు, సుమసురభిళ జలాభిషేచనము అనగా

సుగంధ భరితమగు నీటితో స్నానము, పునుగు జవ్వాది మొదలగు సుగంధ ద్రవ్య లేపనములేవీ మాన్యర్త పెంచాలేవు. ఆ సుగుణము మాటకు మాత్రమే కలదు. ఆ

సుభూషణము ఒక్కటి ఉన్న చాలునిక అన్నీ ఉన్నట్లే!

రామమోహనుడు చెప్పిన ఈ మాటను కూడా ఒకసారి ఆలకించండి.

శిష్ట వాక్య మొకటె చేవికలంకారమ్ము

 పైడి భూషణములు పనికి రావు

 దీని నెరిగి నీవు దిద్దుకో బ్రతుకును

 రామమోహనుక్తి రమ్య సూక్తి

చెవికి ఇంపగు మాటే ఆభరణము అన్యములు కాదు. ఫణము పైన మణి వున్నదని పాముతో సహవాసము చేయము కదా ! పతితుడు పండితుడైననూ పరిహరింపదగినవాడే! భగవంతుడు అవయవాలను మనకొసగినది ఆభరణములతో అలంకరించుకొనుటకు కాదు ఆత్మ ప్రక్షాళన కొరకు. ఆత్మశుద్ధి  త్వరగా జరిగితే మనగతి పురోగతి ,లేకుంటే అధోగతే !

స్వస్తి.

చెరుకు రామ మోహన్ రావు

అజరామర సూక్తి – 8

 అగ్నౌ దగ్ధం జలే మగ్నం హృతం తస్కరపార్థివైఃl

 తత్సర్వం దానమిత్యాహుః యది క్లైబ్యం న భాషతేll - సుభాషితరత్నభాణ్డాగారము

ఒకవేళ మన వస్తువేదయినా , అగ్నిలోబడి కాలి పోవడము గానీ, నీటిలోబడి మునిగి పోవడము గానీ లేక చోరులచేత తస్కరింపబడటము కానీ జరిగితే , పోగొట్టుకొన్న దానిని గూర్చి పరితపించక  కృష్ణార్పణం అన్న దృష్టిని అలవరచుకొంటే అంతకు మించిన ఆనందమే ఉండదు. మనసులో బాధ లేకుంటే వుండబోయేది ఆనందమేగదా. కాబట్టి పోగొట్టుకొన్న వస్తువును దానమిచ్చిన  దృష్టితో చూస్తే ఆవేదన పోతుంది, ఆత్మ సంతృప్తి వస్తుంది. ఆవిధంగా మనము బాధను విడచి వుండలేకపోయినంత మాత్రాన ఎవరూ ఉండరని మాత్రం అనుకోవద్దు. ప్రపంచములో మహా పురుషులింకా వున్నారు.వారలే మనకాదర్శము.

స్వస్తి.

చెరుకు రామ మోహన్ రావు

అజరామర సూక్తి – 9

 శుభం కరోతి కల్యాణం ఆరొగ్యం ధనసంపదఃl

శతృబుద్ధి వినాశ్యాయ  దీపజ్యోతిర్నమొస్తుతేll

శుభదాయకమైన ఓ దీప శిఖా! మాకు ఆరోగ్య, ఐశ్వర్య, ధన సంపదలను ప్రసాదించు. మా శత్రువులలోని దుష్ట బుద్ధిని అహంకారమును అడగించు. ఇదే మా నమస్కారమును గైకొనుము. దీపమును తైలము అనగా నువ్వులనూనెతో మాత్రమే వెలిగించండి. అసలు తైలము అన్న పదమే తిలలు అనగా నువ్వులనుండి  వచ్చినది. వేరే నూనెలు వాడవద్దు.ఉదయ సాయం సంధ్యలలో దీపమును వెలిగించండి. ఉదయము స్నానముచేసి వెలిగించి ఈ శ్లోకము చెప్పుకొనుట మంచిది. సాయంకాలము కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని శుభ్రముగా దీపమును వెలిగించండి. ఈ మాట నేను స్త్రీలకు చెప్పుచున్నాను.

ఆనంద ధన సంపదలకు మూలము అహంకార వినాశనము. ఆనందము ముఖ్యముగా రెండువిధములు. ఐహికము మరియు ఆముష్మికము.  ఐహికమగు ఆనందమునకు అర్రులు సాచితే దానికి అంతే ఉండదు. దానికి విరుగుడు సంతృప్తి. ఉన్నదానిలో అందమును వెదుక్కొనగలిగితే అప్పుడు పరమానందమునకు మిగిలిన్క జీవితమంతా సాధించుతూ ఉండవచ్చు.ఈ దారిన పడితే అహంకారము అణగిపోతుంది. అహంకారమెల్లపుడూ అరిషడ్వర్గాలనే ఆశ్రయించి

యుంటుంది. ఈ అంతః శత్రువులు ఆరుగురు. 1. కామ 2. క్రోధ ౩.లోభ 4. మోహ 5. మద 6.మాత్సర్యము. ఇవి ఒకే శతృవు యొక్క ఆరు తలలగా కూడా భావించవచ్చు. ఆ ఒక వ్యక్తే అహంభావము. అవి పోతే ఇది పోతుంది,ఇది పొతే అవి పోతాయి. మొదట మనలోని శతృవులను తరిమివేసి ఆ మహా జ్ఞానమనే దీప శిఖను మన శత్రువుల యొక్క అహంకారమును తొలగించమని కోరుటకు మించిన కోరిక ఏమున్నది. అప్పుడు ఈ జగమంతా మన కుటుంబమే.

స్వస్తి.

చెరుకు రామ మోహన్ రావు

అజరామర సూక్తి – 10

గృహం గృహమటన్ భిక్షుః శిక్షతే న తు యాచతే |

అదత్వా మాదృశో మా భూః దత్వా త్వం త్వాదృశో భవ || - అజ్ఞాత కవి

ఇల్లిల్లూ భిక్షాటనతో యాచించే యాచకుడు ఏమని సందేశ మిస్తున్నాడంటే ' మీరెప్పుడూ ఇచ్చేవారిగానే ఉండండి, నా లాగా గ్రహీతగా మారిపోవద్దు.' 'చేతులకు తొడవు, అనగా ఆభరణము, దానము' అన్నది ఆర్యోక్తి. ఇంకొక మాట కూడా వుంది

దరిద్రాయ కృతం దానం శూన్య లింగస్య పూజనంl

అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్ఞ సమం విధుఃll

లేనివానికి ఇచ్చుట, పూజలేక ఉండిపోయిన  లింగమునకు పూజచేయుట , తల కొరివి పెట్టె వారసుడు లేని మృతునికి దహన సంస్కారము చేయుట కోటి యజ్ఞములు చేసిన ఫలము నిస్తుంది అని. అసలు జీవన గమనమునకు ఇచ్చుట పుచ్చుకొనుట రెండు చక్రాలు. ఇస్తేనే తీసుకొనుటకు అధికారమొస్తుంది. మనకు తెలుగు తెలియక పోవచ్చునుగానీ ఆంగ్లములోని Newton’s lllrd Law ‘For every action there is an equal and opposite reaction’ అన్నది మరచిపోయి ఉండము కదా! ఒక పాత్రుడగు వ్యక్తికి చేసిన దానము దాతకు ఎనలేని ఆత్మ సంతృప్తి కలిగించుతుంది.  ఆత్మ అంటే పరమాత్మనే కదా!  మరి పరమాత్మను సంతృప్తి పరిస్తే మనకు ఆనందాన్ని ఆయన కలిగిస్తాడు. ఈ జీవన సత్య మొకటి గుర్తుంటే ప్రపంచము సౌఖ్యము సౌభాగ్యముతో నిండిపోదా !

నకర్మణా, నప్రజయా, నధనేన, త్యాగైనైకానామృతత్వ మానసుః- అని వేదవాక్యం!

దానంగొప్పది. అది యమృతత్వమునకు దారిచూపును. ఇకభిక్షులవిషయం; వారు చేస్తున్నది భిక్షాటన కాదు. మనకుపదేశంచేయటమే! యెవరికీ యింత పెట్టక నేను ఈలాగైనాను, మీరు నావలెగావలదు. నలుగుర కింతబెట్టి సుఖసంపదలతో నానందింపుఁడని యాసందేశము! చెవిని బెట్టుఁడు;‘చెబితే వింటివ గురూ గురూ’ ‘వినకే చేడితిర శిష్యా శిష్యా’ అన్న పాట పాడుకొనే పరిస్థితి తెచ్చుకోవద్దు.

స్వస్తి.

చెరుకు రామ మోహన్ రావు

 

అజరామర సూక్తి-11

 

ఆదానస్య ప్రదానస్య కర్తవ్యస్య కర్మణః ।

క్షిప్రమక్రియమాణస్య కాలః పిబతి తద్రసం ।।

ఇచ్చి పుచ్చుకొనుట,కర్తవ్యపాలన, కర్మాచరణ లలో జాప్యము జరిగిందంటే దాని ఫలితము అనబడు రసాన్ని కాలమేణ కాలమే త్రాగివేస్తుంది. కావున ఎప్పటికీ చేయవలసిన పనులలో తాత్సారము పనికిరాదు . తరువాత నిముసమున  కాలము ఏమి చేయబోతుందో మనకు తెలియదుకదా! పెద్దలు నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యం ధర్మ సంగ్రహం' అన్నారు.కావున ఆలోచించి చేసే పనులు ఆచరించుటలో ఆలస్యము చేయరాదు. ఈ శ్లోక సారాంశము గ్రహించండి.

శతేషు జాయతే శూరాః సహస్రేషు చ పణ్డితఃl

వక్తా దశసహస్రేషు దాతా భవతి వా న వాll - వ్యాసస్మృతి

నూటికి ఒక శూరుడు, వెయ్యికి ఒక పండితుడు, పదివేలకు ఒక వక్త కలుగుతారు కానీ దాత మాత్రము దొరుకుతాడని చెప్పనలవి కాదు. శూరుడు మనకు అందరిలో కనిపించడు. అసలు శూరత్వము అంటే యుద్ధాలలో పాల్గొనడము కాదు. తలపెట్టిన కార్యమును సమర్థవంతముగా  నిర్వహించడము శూరత్వము. అందుకే

కార్యశూరుడు' అన్న పలుకుబడి ప్రాచుర్యమునకు వచ్చినది. ఈ కార్యశూరత కలిగిన వాడు ఒక నిస్సహాయునికి చేయూతనిస్తే సమాజమే శ్రేయోదాయకమౌతుంది. అటువంటి శూరులు పూర్వము నూటికి ఒకరు వుండేవారు. ఇప్పుడు వీరత్వము,ధీరత్వము, శూరత్వము అన్నీ స్వార్థములో మాత్రమె నిండి యుంటాయి.  . ఈ కాలము ఒకరికోరకు పాటుపడేవాడు దొరుకుట సముద్రములో మంచినీరు వెదుకడమే నేమో? ఇక పాండిత్యము విషయానికి వస్తే  ఎదో కళాశాలలకు పోవడమో స్నాతక పట్టాలను పుచ్చుకోవడము మాత్రము కాదు. పాండిత్యమునకు జిజ్ఞాస అవసరము. కోరిక వుంటేనే కదా తీర్చుకోవలెనను తపన వుండేది. పూర్వము అటువంటి వారు వెయ్యికి ఒక్కరు వుండేవారట. అటువంటి వారి వద్ద నేర్చుకోవలేననే తహ తహ కూడా నాటి జనులలో వుండేది. మరి నేడో అందరూ పండితులే! ఆమాటకొస్తే ఏమీ తెలియని నేను కూడా పండితుడనే! ఇక వక్తృత్వమును గూర్చి! 'ప్రియ వక్తృ త్వం' 'వాక్ భూషణం ' 'వచః ప్రసంగం' అని ఎన్నో విధాలుగామాట యొక్క మహిమను గూర్చి తెలిపినారు నాటి మహనీయులు. పూర్వము అట్టి వక్తలు పది వేలకు  ఒకరు వుండే వారట. అప్పుడు చెప్పేవారు తక్కువ వినేవారు ఎక్కువ. మరి నేడో అందరూ చెప్పేవారే! ఇక వినేవారేరీ? మన రాజకీయనాయకులు మాట్లాడితే ఎదుట నిలిచినవాడు తడిసి ముద్ద యగుట తప్పించి వేరే ప్రయోజనమేమీ ఉండదు. అది గాలికి నిలిచే ఊక అంటే  గాలికి ఊక  నిలువదు గదా !     

ఇక దానగుణము. లక్షల సంవత్సరముల కాలములో దాతలుగా మన మనసున చెరగనిముద్ర వేసిన వారు చాలా కొద్ది మంది. వారిలో శిబి చక్రవర్తి, బలిచక్రవర్తి,

రంతిదేవుడు, దాన కర్ణుడు  మొదలగు వారు వాశి కెక్కిన వారు. అందుకే దాత ఎన్ని కోట్లలోనైనా దొరుకుతాడో దొరకడో చెప్పుట కష్టము అన్నారు ఆకాలము లోనే. మరినేడో వంద రూపాయలు ఇచ్చినవాడుకూడా తనపేరు వార్తా పత్రికలో ప్రముఖంగా కనిపించాలనుకొంటాడు. మరి ఈ విషయము ఎన్నికలకు ఇచ్చే చందాలకు వర్తించదు ఎందుకనో?  ఒకచేత ఇచ్చిన దానము ఇంకొక చేతికి తెలియకూడదన్నది పెద్దల మాట. ఈ కాలములో వాగ్దానము కూడా దానముక్రిందనే జమ. దానమును గూర్చి మాట్లాడుకొంటూ కర్ణుని గూర్చి తెలుపకపోవుట సమంజసముకాదు. ఈ ఉదంతము చదువండి. కర్ణుడికి దాన కర్ణుడని గదా పేరు. ఒకనాడు శ్రీకృష్ణుడు పొద్దుననే కర్ణుని భవనానికి వెళ్ళినాడట.అప్పుడు కర్ణుడు అభ్యంగ స్నానానికి తయారవుతున్నాడు. తలకు నూనె రాచుకుంటున్నాడు. కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె నూనెతో వున్నది. కృష్ణుడు మాటలాడుతూ అటుఇటు చూస్తే ఆ రత్నాలు పొదిగిన గిన్నె!  . కర్ణా! ఆ గిన్నె చాలా బాగున్నది ఇస్తావా? అని అడిగినాడు. వెంటనే కర్ణుడు తీసుకో కృష్ణా అంటూ ఎడమ చేత్తోనే ఆ గిన్నెను ఆలస్యము చేయకుండా ఇచ్చివేసినాడు. కృష్ణుడు అదేమిటి కర్ణా ఎడమచేత్తో యిస్తున్నావు? కుడిచేతితో కదా ఇవ్వవలసినది అన్నాడు. అందుకు కర్ణుడు

క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయో:l

యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతి:ll

అర్థము:-- కృష్ణా!ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు. లక్ష్మి చంచల మైనది. యముడా దయలేనివాడు. మనస్సా మరు క్షణం లో ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఈ చేతినుండి ఆ చేతికి పోయే లోపలే ఏ మార్పయినా కలుగవచ్చు. అందుకే ధర్మ కార్యాన్ని తత్ క్షణమే చెయ్యవలెనను ఆర్యోక్తి ననుసరించి ఈవిధముగా చేసినాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు సంతోషించి ఏదైనా వరము కోరుకోమన్నాడు. అందుకు కర్ణుడు

దేహేతి వచనం కష్టం నాస్తీతి వచనం తథా l

దేహీ నాస్తీతి మద్వాక్యం మా భూజ్జన్మ జన్మనీ ll

కృష్ణా! యాచించడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం. అంతే కాదు, నీచం కూడా కనుక ఏ జన్మ లోనూ దేహీ(అని యాచించే) , నాస్తి(లేదు) అనే మాటలు నా నోటివెంట రాకుండు నట్లు అనుగ్రహించమని కోరినాడు. దానము విషయము లో సదా సాత్వికమే ప్రధానము. చెయ్యాలనే సంకల్పం కలుగ గానే ఆదరణ తో భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి. దానం చేసి నేను చేసినానని డప్పు కొట్టుకోకూడదు. ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే సివేయవలసింద‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు కదా! పెద్దలు. మనము కర్ణుడి లాగా వ్యవహరించ లేకపోయినా మన శక్త్యానుసారము గ్రహీత యొక్క పాత్రత తెలుసుకొని  దానము చేయుట అలవరుచుకొనవలెను. ఇక్కడ దాగివున్న కర్ణుని గొప్పదనము మరొకటి గమనించవచ్చును. కృష్ణుడు కోరుకొమ్మన్నాడు కదా అని దురాశతో ఏదయినా కోరియుండవచ్చును. కానీ ఔచిత్యమునెరిగి కోరినాడు ఘనుడగు కర్ణుడు.

స్వస్తి.

చెరుకు రామమోహన్ రావు

 

అజరామర సూక్తి-12 

సత్యానుసారిణీ లక్ష్మీః కీర్తిస్త్యాగానుసారిణీ l
 అభ్యాససారిణీ విద్యా బుద్ధిః కర్మానుసారిణీ ll  - సుభాషితరత్నభాణ్డాగారము

 సన్మార్గపు సంపాదన తోనే సతతము లక్ష్మి మనల నంటిపెట్టుకొని  యుంటుంది. ఇక్కడ ఒక విషయమును గమనించవలసి ఉంటుంది. దేశమును శాసించవలెనని తలచిన ఒక విదేశస్తురాలువేలో లేక లక్షల కోట్లో సంపాదించి కూడా చెడ్డపేరుతో బాటు కావలసినన్ని కోర్టు కేసులుకొడుకు పెళ్ళికాని ప్రసాదు గా ఉండి పోవుట, కూతురికి ప్రజలలో గుర్తింపు ప్రయత్నించినా రాక పోవుట చూసినాము. కొంతమంది విషయములో వారు సంపాదించినది ప్రముఖముగా చూస్తాము కానీ ఆతరువాత వారు ఎంత నికృష్ట మరణము.పొండుచున్నారన్నది మనకు తెలియదు. సక్రమమగు సంపాదన సంతృప్తిని సంతోషమును సమకూర్చుతుంది. కీర్తి ఎల్లపుడూ త్యాగము తోడుతే వుంటుంది. పదిమందికి చేసిన సహాయమే మనిషి కీర్తి అన్న పతాకమును ఎంతో ఎత్తున ఎగురవేయగలుగుతుంది.

అభ్యసించే కొలదీ విద్య వంటబడుతుంది. విద్యనభ్యసించుటకు వయోపరిమితి లేదు. బుద్ధి ఎల్లవేళలా కర్మను అనుసరిస్తుంది. అందుకే పెద్దలు ‘బుద్ధిః కర్మానుసారిని’ అన్నారు. పైన చెప్పినదంతా నిజమేకదా. వక్ర మార్గముల ద్వారా సంపాదించే సంపాదన క్షణ భంగురము. సంపాదకునికి లేక అతని సంసారమునకు ఏవిధమైన ఆపదైనా సంభవించి అతని ద్రవ్యము హరించి పోవచ్చును. సత్య పథమే సంపాదనకు మార్గము. కీర్తి త్యాగాన్ని అనుసరిస్తుంది.దదీచి,శిబి,బలి కర్ణాది మహనీయులు తమ త్యాగనిరతి చేతనే చిరంజీవులైనారు. అభ్యాసము కూసు విద్య అన్న పెద్దల మాట ఉందనే వుంది. అభ్యాసము నేర్చుకోవటముతో సరిపోదు. దానిని ఆచరించవలే ఆపై యోగ్యులకు పంచవలె. అప్పుడే ఆ విద్యకు సార్థకత. ఇక బుద్ధి ఎప్పుడూ మన ప్రారబ్ధ సంచిత కర్మల పైనే ఆధారపడి యుంటుంది. దానికి విరుగుడే దైవ భక్తి. అది కలిగియుంటే దుష్కర్మ ఫలితముల తీవ్రతను తగ్గించి మనిషి జీవితమును సార్థకము చేస్తుంది. ఇది పైన చెప్పిన అన్నీ విషయముల సంగ్రహము.

తమసోమా జ్యోతిర్గమయ.

చెరుకు రామ మోహన్ రావు


మర సూక్తి-13

అజరాకృతస్య కరణం నాస్తి మృతస్య మరణం తథాl

 గతస్య శోచనం నాస్తి హ్యేతద్వేదవిదాం మతంll  - అజ్ఞాత

జరిగిపోయిన పనికి చేయవలసినది ఏమీ ఉండదు. చచ్చినతరువాత తిరిగీ చచ్చేదీ 

ఉండదు. గతించిన బాధను గూర్చి తలచీ ప్రయోజనము ఉండదు..ఇది నా మాట కాదు సుమా పెద్దలమాట.

చేసిన దానిని చేసేదేమిటి

చచ్చిన జీవిని చంపెదేమిటి

జరిగినదానికి ఏడ్చేదేమిటి

తెలుసుకకొన్నచో తొలగును చీకటి

పంటంతా పక్షులన్నిఏరిఏరి తిన్నాయని

ఏడుస్తూ కూర్చుంటే ఎటుల జరుగుతుంది పని

పాలు పొంగి పోయినచో అగునుకదా పొయ్యి పాలు

ఈ నిజాన్ని తెలుసుకొని మసలుకొన్న నీవు చాలు

(పై శ్లోకమునకు యధా శక్తి అనువాదము)

స్వస్తి.

చెరుకు రామ మోహన్ రావు

అజరామర సూక్తి- 14

గుణాః సంతి నరాణాం చేద్వికసంత్యేవ తే స్వయం l

న హి కస్తూరికామోదః శపథేన నివార్యతే ll  -అజ్ఞాత

 ఒక వ్యక్తితన గుణగణములను బయట పెట్టకుండా గుండెల్లోనే దాచుకోలేడు. అవి బయట పడి తీరవలసినదే. కస్తూరి పైనకప్పి ఉంచితే మాత్రం సువాసన పరిసరాలలో ప్రాకకుండా ఉంటుందా! 

యెవ్వడూ తనగుణాలను దాచుకోలేడు " కస్తూరీ పరిమళమం గుప్పిడి మూస్తే ఆగేదిగాదు గదా! - అంటాడు కవి. కస్తూరి పరిమళంతో గుణాలను పోల్చటం , సద్గుణ గరిష్ఠతను వెల్లడించటం కోసమే!

ఒక వ్యక్తి లోని మంచి లేక చెడ్డ లక్షణములు ఎదో ఒక సమయములో బహిర్గతము కావలసినదే. 

పెట్టెలోని కస్తూరి వాసన  పెట్టె తెరిచిన వెంటనే ఏ విధంగా బయటికి వస్తుందోపెట్టె లో నున్న చిమట కూడా బట్టల కొట్టి ఆ విధంగానే బయటికి వస్తుంది. మనలో మంచిని పెంచితే , దానిని పంచితే మన చుట్టూ గల సమాజాన్ని బాగుపరచ వచ్చు. లేకపోతే ' వెనుక చింతించుటయు చాల వెర్రితనముఅన్న చందమౌతుంది.

ఈ సందర్భములో భాస్కర శతకములోని ఈ పద్యము ఎంతో సముచితము, చదువండి.

ఊరక సజ్జనుం డొదిగి యుండిననైన దురాత్మకుండు ని

ష్కారణ మోర్వలేక యపకారముసేయుట వానివిద్యగా

చీరలు నూరుటంకములు సేసెడివైనను బెట్టెనుండగా

జేరి చినింగిపో గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!

వస్త్రములు నూఱు మొహరీలు విలువ గలవియైనను తమ పాటకి తాము పేట్టెలో బడియున్నప్పటికిని తనకేమియు ప్రయోజనము లేకపోయినను చిమ్మటయా బట్టలను ముక్కలు ముక్కలుగా కొఱికివేయుచుండు విధముగా, ఎవరి జోలికింబోక యుత్తము డొకచో నణగియున్నను దుర్మార్గుడు తనకేమి లాభము లేకున్నను నిర్హేతుకముగా అపకృతి సేయుచుండును. దుర్మార్గుల కిది సహజ గుణము.

అజరామర సూక్తి – 15

పిణ్డే పిణ్డే మతిర్భిన్నా కుణ్డే కుణ్డే నవం పయఃl

 జాతౌజాతౌనవాచారానవావాణీముఖేముఖే ll                          సుభాషితరత్నభాణ్డాగారము

 ఈ సృష్టి కి కర్త ఎవరు అన్న విషయాన్ని ఒక్క నిముసము ప్రక్కన ఉంచితే ఎంత 

విచిత్రమనదో ఈ సృష్టి గమనించండి. మనుషులందరికీ అవయవాలు అవే . కానీ 

ఒక్కొక్కరి బుద్ధి వేరు. నీటిని ఎక్కడిదైనా నీరనే అంటారు కానీ రుచి మాత్రము ఒకటిగా ఉండదు. ప్రజలొకటే ఆచార వ్యవహారములు వేరు. మాట అందరిదీ ఒకటే అంటే శరీరములోని ఒకే చోటినుండి ఉత్పన్నమౌతూవుంది కానీ మాట్లాడే తీరు వేరు.

ఒక్క నిముసము ఆలోచించండి ఆ సృష్టికర్త అన్నీ ఒకే విధముగా సృష్టించి వుండి వుంటే మనలను నీరసము నిస్సహాయత ఎంతగా ఆవరించియుండేదో గమనించండి. కాబట్టి ఇంతటి ప్రకృతిని సృష్టించుటకు ఎంతటి పరిజ్ఞానము కర్తకు వుండియుండవలేనో ఆలోచించండి. మరి ఆ కర్త అంతటితో ఆగినాడా లేదు . తన సృష్టికి తానే భర్త. అంతటితో వూరకున్నాడా లేదు ,తానే హర్తగా కూడా వ్యవహరించుచున్నాడు. మన చేతిలో ఏమీలేదు. మరి ఏమీ లేనపుడు మనము మన మనసును మంచి వైపే మరలించితే మంచిది కదా! కక్షలుకలహాలుకార్పణ్యాలుకావేశాలు కలతలు కుళ్ళు కుతంత్రాలు 

 లేని సంఘాన్ని ఎందుకు నిర్మించలేము. మనసు ఉంటె మార్గము ఉండదా !

స్వస్తి.

చెరుకు రామ మోహన్ రావు

 

 

 

 

 

 

 

 

Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి