చాణక్య నీతి - 7వ శ్లోకము
చాణక్య నీతి 7వ శ్లోకము
https://ajaraamarasukthi.blogspot.com/2022/11/blog-post.html
చాణక్య నీతి 7వ శ్లోకము
శ్లో || ఆపదర్థే ధనం రక్షే చ్ఛ్రీమతాం కుత ఆపదః |
కదాచి చ్చలతే లక్ష్మీః సంచితోపివినశ్యతి
|| 7
అర్థము :- ఆపదర్థే = ఆపదలను
బోగొట్టుకొనుటకు, ధనం = ధనమును, రక్షేత్
= రక్షింపవలెను, శ్రీమతాం = ధనవంతులకు, ఆపదః = ఆపదలు, కుతః = ఎట్లు కలుగును? కదాచిత్ = ఎన్నడైన దైవ యోగముతో, లక్ష్మీః = సంపద,
చలతే = పోయినచో, సంచితో-పి = సంపాదింపబడినది
కూడ, వినశ్యతి = నశించి పోవును.
తాత్పర్యము :-ఆపత్కాలములో ఆపదలను
నివారించుకొనుటకు ధనమును రక్షించుకొనవలెను. శ్రీమంతులకు ఆపద లెట్లు వచ్చును?
ఎప్పుడైనను దైవయోగము వలన సంపద పోవును. అప్పుడు కూడబెట్టిన ధనము కూడ
నష్టమగును.
ఇక్కడ రెండు ముఖ్యమైన శ్లోకములను మీ ముందు ఉంచుతాను.
మొదటి శ్లోకము విశ్వామిత్రుడు శ్రీరామునితో చెప్పినది్
ధనమార్జిత కాకుత్స ధనమూలమిదం జగత్l
అంతరం నాభిజానామి నిర్ధనస్య మృతస్యచll
శ్రీరామా! ఈలోకము పూర్తిగా ధనమునకు దాసోహము అంటుంది. కారణము ఏదయినా నిర్ధనుడు
మృతునితో సమానము. త్రేతాయుగమునకే డబ్బువిలువ ఎంతగా ఉండేదో ఈ శ్లోకమే చెబుతుంది. పైగా
ఇది ఎవరో చెప్పిన మాట కాదు. గాయత్రీ మంత్రద్రష్టయైన విశ్వామిత్ర మహర్షి
చెప్పినది.
అయితే సంపాదనకు కూడా ఒక హద్దు అవసరము. ఆశ మనిషికి ఎంత అవసరమో హద్దు కూడా అంతే
అవసరము. అదిలేనివానిగతి నేను వ్రాసిన ఈ పద్యము తెలుపుతుంది.
ఆశఉన్న వానికాకాశమే హద్దు
లేశమాత్రమైన లేక శిగ్గు
పాశమెంతొజూపి పాపాలకొండపై
కీశమై జరించు గిట్టు వరకు
ఇక రెండవ శ్లోకము అసలు వచ్చినా పోయినా దుఃఖము కలిగించే
ధనమే అవసరము లేదు అనే స్థితప్రజ్ఞత.
అర్థానం అర్జనే దుఃఖం అర్జితానాం చ రక్షణే |
నాశే దుఃఖం వ్యయే దుఃఖం ధిగ్ అర్థః కష్ట-సంస్రయః ||పంచతంత్ర శ్లోకం 1.174||
ధనము సంపాదించినా దుఃఖమే! సంపాదించకున్నా దుఃఖమే! ధనము సపాదించవలెనను ఆశ ఉన్నా దుఃఖమే! ఆ సంపాదించిన దానిని ఖర్చు చేస్తూ ఉన్నా దుఃఖమే! మరి అటువంటి దుఃఖమును సమకూర్చే ధనమును సంపాదించి \ పోగొట్టుకొని దుఃఖిం
చుట ఎందుకు?
ఇది ముఖ్యముగా సన్యసించిన వారికే
చెల్లుతుంది, అందుకే మధ్యేమార్గముగా ఈమాట వినండి.
స్వామి దయుంచు నాయెడల చాలును సంపద ఇంతమాత్రమే
ఏమరకుండ, నా గృహము ఏర్పడ త్రొక్కిన వారికిన్
మహా
ప్రేమము తోడ భోజనము పెట్టుట, నాసతి సంతుకున్ సదా
సేమము కూర్చి ఖాదనము చేయగ చేయుట ఛాలు శంకరా!
రెండు చరణాల శ్లోకము ఎంత
వ్యాఖ్యానము కలిగి యున్నదో చూడండి.
స్వస్తి.
Very nice sir
ReplyDeleteVery nicely expressed about the values
ReplyDeleteచాణక్య నీతి లోని 7 వ శ్లోకం వివరణ చాలా జ్ఞాన దాయకమైనదండి.
ReplyDeleteధనవంతులు తమ ఉపయోగం కోసమని ధనాన్ని సంపాదించి కూడ పెడతారు. కానీ ఆపద కాలం వస్తే ఆ ధనం నష్టమౌతుంది .దానిని ఆపలేరు ఆ ధనవంతులు అని చెపుతూ...
విశ్వామిత్రుడు శ్రీ రామునికి ధనము యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పిన శ్లోకములను తెలిపి వివరించేరు. త్రేతాయుగం నాటి ధనంలేనివాడు శవంతో సమానం అనే అర్ధమిచ్చే ఆ శ్లోకం చెప్ప బడడం మహదాశ్చర్యం కలిగించింది.
ఆ సందర్భంలో మీరు ధనము విలువను గురించి చక్కని పద్యమును రచించేరు.
విశ్వామిత్రుడు చెప్పిన రెండవ శ్లోకం, తాత్పర్యాలను చక్కగా వివరించారు.
అది చాలా వైరాగ్యం భావంతో ఉంది. యదార్థమే కూడా.
ధనము సంపాదనలో బాధ ఉంటుంది, దాచడానికి యాతన పడాలి, అన్ని బాధలు పడి సంపాదించిన దానిని
ఖర్చు చేస్తే బాధ కలుగుతుంది అనునది దాని భావన. ఆ భావనలకు అనుగుణంగా మీరు పరమాత్మను ప్రార్ధిస్తూ వ్రాసిన పద్యం ఆచరిస్తే ప్రతి మనిషికీ ప్రశాంతత లభిస్తుంది జీవితంలో..
మీ పద్య భావనలు...
నా సంసారం సాఫీగా సాగిపోయింది ధనాన్ని ప్రసాదించు స్వామీ అని దేవుని ప్రార్ధించడం.. అమోఘమైన వైరాగ్య భావన వెలిబుచ్చారు..
అత్యద్భుతమైన పై విషయాలతో ఉన్న మీ రచనకు జోహార్లు అండీ రామ మోహన రావు గారూ.అనేక అభినందనలండీ.